తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేసిన తీరుపై పార్లమెంటులో ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఏపీని పునర్వ్యవస్థీకరించిన తీరు గురించి కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కానీ మోదీ నాయకత్వంలోని కేంద్రం ఈ విషయంలో చేసిన నిర్వాకమేమిటి? ఇరు రాష్ర్టాల మధ్య ఇంకా ఎన్నో విభజన సమస్యలున్నాయని మోదీజీనే అంటున్నారు. మరి ఆ సమస్యలను పరిష్కరించాల్సిందెవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? ఇరుపక్షాల ముఖ్యమంత్రులను, కీలక అధికారులనుగానీ కూర్చోబెట్టి సమస్యలపై మాట్లాడిందా..?
చట్టంలోని అంశాల అమలుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఒక సెల్ ఏర్పాటుచేసి, దాని పనితీరుతో ఇరు రాష్ర్టాల మధ్య సుహృద్భావ వాతావరణం కల్పించవచ్చు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు. అప్రజాస్వామికం అసలే కాదు. కానీ, కేంద్రం రాజధర్మాన్ని గాలికి వదిలి మొసలి కన్నీరు కారుస్తున్నది. ఆస్తులు, నదీజలాలు, ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ అతిథి గృహానికి సంబంధించిన విషయాల్లో కేంద్రం చూపిన చొరవ శూన్యం.
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయొచ్చు, అది ప్రతిపక్ష పార్టీ గనుక. ఇదే సందర్భంలో కాంగ్రెస్ను ఉద్దేశించి మోదీజీ కుటంబపార్టీల గురించి కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రాంతీయపార్టీల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయి. జాతీయ పార్టీలు వివిధ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకపోతే ప్రాంతీయ పార్టీలు పుడుతాయి. ప్రాంతీయ పార్టీలు అనేక రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నాయి. అవి కుటుంబపాలనలో ఉన్న పార్టీలా అనేది కాదు, ప్రజల విశ్వాసం పొందగలుగుతున్నాయా లేదా అన్నదే ముఖ్యం. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, ఒడిశా, బెంగాల్, బీహార్, పంజాబ్, మహారాష్ట్రల్లో ప్రాంతీయపార్టీలు శక్తివంతంగా ఉన్నాయి. కాబట్టే బీజేపీ ఆయా రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నది. బీజేపీ పొత్తు పెట్టుకున్న శివసేన, బిజూ జనతాదళ్, అకాలీదళ్, అప్నా దళ్, టీడీపీ తదితర పార్టీలు కూడా కుటుంబ పార్టీలే కదా..? మరి కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ముప్పు అయితే వాటితో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్లు? ఇదే ఏరుదాటి తెప్ప తగలెయ్యటం అంటే.
ఎన్నికల్లో ఓడిపోయి దొడ్డిదారిన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న బీజేపీ నాయకుడు శివరాజ్సింగ్ చౌహాన్ ప్రజాస్వామ్య విజయానికి చిహ్నమా?. లోక్సభలో పూర్తి మెజారిటీ ఉండి కూడా ఎన్నికలు జరిగి రెండేండ్లు గడిచినా ఉప సభాపతిని ఎన్నుకోలేకపోయింది బీజేపీ. అయితే రాజ్యసభలో మాత్రం నితీష్ పార్టీతో పొత్తులో భాగంగా ఉప సభాపతి పదవికి ఖాళీ ఏర్పడిన వెంటనే భర్తీచేశా రు. ఇక రేపు ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం వస్తే లోక్సభ ఉప సభాపతి పదవిని ఎరగా వేయటానికి ఆ పదవి ఖాళీగా ఉంచారా? రాజ్యాంగ పదవులతో రాజకీయమా? ఇదేనా ప్రజాస్వామ్యానికి బలం? దీనిగురించి ఏ మీడియా సంస్థ మాట్లాడదు. ఎమర్జెన్సీ సమయంలో మీడియాను వంగమంటే మోకరిల్లిందని అద్వానీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు. వంగమనకపోయినా మోకరిల్లుతున్నాయి మీడియా సంస్థలు. నేడు దేశంలో ఎటువంటి అభద్రతా భావం రాజ్యమేలుతుందో దీన్నిబట్టి తెలుస్తుంది. భయం, అభద్రతా వాతావరణం ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చుతాయా? ప్రధాని మోదీనే చెప్పాలి?
రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు చేసే విమర్శలకు, ఉద్వేగాలకు హద్దులుండవా? గత ఎన్నికల్లో 75 ఏండ్లు నిండినవారికి బీజేపీ టికెట్ తిరస్కరించింది. తమ చెమటతో బీజేపీని బలోపేతం చేసిన ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషి లాంటి నాయకులను పక్కనబెట్టి 85 ఏండ్లు నిండిన వృద్ధుడు మెట్రోమాన్ శ్రీధరన్ను కేరళ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఇదా ప్రజాస్వామ్యానికి బలం?
– ఆభేరి