మోదీ ప్రభుత్వ ఆగడాలు మితిమీరుతున్నాయి. కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి మరింత వికృతరూపం దాల్చాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు మోపి విచారణ పేరిట మోదీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నది. ఇప్పటికే రెండు రోజులు 20 గంటల పాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏం సాధించారో చెప్పటం లేదు. కానీ, ఇకముందు కూడా విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇవన్నీ తెలంగాణ సర్కార్ను, సీఎం కేసీఆర్ను, భారత రాష్ట్ర సమితిని అప్రతిష్టపాలు చేయటంలో భాగంగానే జరుగుతున్నవనేది అర్థమవుతున్నది.
విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు, వేధింపులకు పాల్పడటం దేశవ్యాప్తం గా మోదీ ప్రభుత్వం ఒక విధానంగా అనుసరిస్తున్న ది. ఈ వేధింపులు ఈ మధ్యకాలంలో మరింతగా వికృతరూపం దాల్చాయి. విపక్షాలపై కత్తిగట్టి ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర సంస్థలతో దాడులు చేయి స్తూ భయబ్రాంతులకు గురిచేయటం పరిపాటిగా మారింది. ముఖ్యంగా బీజేపీకి మిత్రపక్షంగా ఉండని ప్రాంతీయపార్టీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. విపక్ష నేతలను నయానో, భయానో లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. చివరికి దేశంలో పరిస్థితి ఎంతవరకు చేరిందంటే.. ‘మోదీకి జై అంటే’ అంద లం, ‘నో అంటే’ వదలం అనేలా తయారైంది. దీనికి దేశవ్యప్తంగా ఎన్నో ఉదాహరణలున్నాయి.
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎంతటి దాష్టీకానికి పాల్పడిందో దేశమంతా చూసింది. ఆ పార్టీ నేతలపై ఈడీ, ఐటీ దాడులు చేసి, అరెస్టులు చేసింది. కొంతమందిని లొంగదీసుకున్నది. అయినా… బెంగాల్లో పాగా వేయాలని చూసిన బీజేపీ పప్పులుడకలేదు. ఏవో కొన్ని సీట్లు తెచ్చుకొని ప్రజల అసహ్యానికి గురైంది. అయినా బీజేపీ తీరు మారలేదు. విపక్షాలను బెదిరించి లొంగదీసుకొనే చర్యలను మానుకోవటం లేదు. తమకు మిత్రపక్షంగా మారని పార్టీలను, నేతలను లక్ష్యంగా చేసుకొని అనేక రూపాల్లో దాడులు చేస్తున్నది. దానిలో భాగమే. ఢిల్లీ లిక్కర్ స్కామ్. దేశానికి గుండెకాయలా, కీర్తికిరీటంలా ఉన్న దేశ రాజధాని ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఉండటం బీజేపీకి, మోదీకి మింగుడు పడటం లేదు. ఢిల్లీ తమ వశం కాకపోవటం జీర్ణించుకోలేక ఆప్ నేత కేజ్రీవాల్ను అనేక ఇబ్బందులకు గురిచేశారు. లెఫ్ట్నెంట్ గవర్నర్ పేర ముఖ్యమంత్రి పదవికి పోటీగా… ప్రత్యామ్నాయ అధికార కేంద్రాన్ని నడుపుతూ కేజ్రీవాల్ పాలనకు అవరోధాలు కల్పిస్తున్నారు. అయినా లొంగని కేజ్రీవాల్ను లొంగదీసుకునేందుకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అంటూ మరో కుట్రపూరిత కేసులతో వేధిస్తున్నది. మనీష్ సిసోడియాను, మరో మంత్రిని సైతం అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేశారు.
మొదటినుంచీ తెలంగాణ అంటే మోదీకి గిట్టదు. తెలంగాణ ఏర్పాటునే.. తల్లిని చంపి పిల్లను బతికించారని తన వ్యతిరేకతను చాటుకున్నవాడు మోదీ. ఆ క్రమంలోనే.. అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ర్టాన్ని ప్రగతిబాటలో తీసుకుపోతున్న కేసీఆర్ ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నది. అనేక రూపాల్లో వివక్షకు పాల్పడుతున్నది. విభజన చట్టం ప్రకారం.. అందించాల్సిన సహకారాన్ని, కేటాయించాల్సిన నిధులను కేటాయించటం లేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఇలాంటి చట్టపరమైన, రాజ్యాంగబద్ధమైన విషయాలను సైతం తుంగలో తొక్కి మోదీ ప్రభుత్వం తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమతో వ్యవహరిస్తూనే.. ఈ మధ్యకాలంలో మరింత నీచానికి ఒడిగడుతున్నది. పార్టీని బద్నాం చేయటానికి కుట్రలు, కుయుక్తులకు పాల్పడతున్నది. అక్రమకేసులతో వేధింపులకు దిగుతున్నది.
ఆ నేపథ్యంలోంచే.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పాత్ర ఉన్నదంటూ.. అభియోగాలు మోపీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ పేరుతో సతాయిస్తున్నది. ఒక ప్రజాప్రతినిధి, ఒక మహిళ అని కూడా చూడకుండా.. గంటల తరబడి విచారిస్తున్నామంటూ బెదిరింపులకు మానసిక హింసకు దిగుతున్నది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను రెండురోజులు రోజుకు 10 గంటల చొప్పున విచారించారు. ఇంకా అవసరమైనప్పుడు విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఇలా ఒక మహిళను గంటల తరబడి నిర్బంధించి వేధింపులకు దిగటం చట్టవిరుద్ధం. అయినా మోదీ ప్రభుత్వం అన్ని రాజ్యాంగ చట్టాలను తుంగలో తొక్కి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది.
విచారణ అంటూ మానసికంగా వేధిస్తున్నారు. మోదీ ప్రభుత్వ లక్ష్యం ఒకటే.. కేసీఆర్ బెదిరిపోయి లొంగపోయేలా చేయటంగా కనిపిస్తున్నది. పోరాటాలకు, త్యాగాలకు పేరుగాంచిన తెలంగాణ గడ్డ ఎన్నటికీ ఆధిపత్య రాజకీయాలకు లొంగదు. సుదీర్ఘ పోరాటాలతో, అనన్య త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో మతోన్మాద రాజకీయాలకు తావులేదని చాటుతున్నది. లౌకిక, ప్రజాస్వామిక సంప్రదాయాలకు నెలవైన తెలంగాణ మోదీ ప్రభుత్వ నియంతృత్వ రాజకీయాలను ఎదిరించి నిలుస్తుంది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న మెజారిటీవాద మత రాజకీయాలను ఓడిస్తుంది. తెలంగాణ చైతన్యానికి ప్రతీక అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎత్తిన పిడికిలి దించదు. తెలంగాణ చైతన్యం ముందు మోదీ ప్రభుత్వ కుట్రలు, కుతంత్రాలు ఓడిపోక తప్పదు.
ఎప్పుడైతే.. మోదీ అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలను సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తూ.. జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమయ్యారో అప్పటినుంచి మోదీ ప్రభుత్వం కేసీఆర్పై కన్నెర్ర జేసింది. కేసీఆర్ను, భారత రాష్ట్ర సమితిని అప్రతిష్టపాలు చేసేందుకు కుయుక్తులు పన్నింది. దాంట్లో భాగంగానే… ఎమ్మెల్సీ కవితపై ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు అక్రమంగా మోపారు.
ఓ.నరసింహారెడ్డి: 80080 02927