రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణకు ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొమ్మిదవ సారి రాబోతున్నారు. గత ఎనిమిది పర్యటనల్లో తెలంగాణకు ఆయన ఇచ్చింది, తెచ్చింది శూన్యం. నిధులు, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడమే కాదు, కనీసం రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలు కూడా నెరవేర్చలేదు. రాష్ర్టానికి రావాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంటును ఇంతవరకు కేటాయించలేదు. ‘వోకల్ ఫర్ లోకల్’ అంటూ స్థానికతకు పెద్దపీట వేయాలని చెప్పే ప్రధాని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన ‘కాళేశ్వరం’ తన హయాంలో నిర్మించబడుతున్నందుకు సంతోషించాల్సింది పోయి తెలంగాణపై తరచూ విషం కక్కుతున్నారు.
జీఎస్టీ బిల్లు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, పెద్దనోట్ల రద్దు.. ఇలా కేంద్రం తీసుకున్న కొన్ని చర్యలకు టీఆర్ఎస్ తమ మద్దతును ప్రకటించింది. అయినప్పటికీ మోదీ సర్కారు తెలంగాణ నదీజలాల్లో వాటాను ఇప్పటికీ తేల్చలేదు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేదు. చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నవోదయ పాఠశాలలు ఇవ్వకపోగా, తెలంగాణకు మంజూరైన ఐటీఐఆర్ను రద్దుచేశారు. దీనివల్ల ఇక్కడి యువతకు వచ్చే ఉద్యోగాలను కాలరాశారు. ఐటీలో నేడు దేశంలో ప్రథమస్థానంలో ఉన్న తెలంగాణకు ఒక్క సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ను సైతం కేటాయించకపోవడం తెలంగాణపై కేంద్రానికి ఉన్న వివక్షను సూచిస్తున్నది.
పునర్విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కూడా మంజూరు చేయలేదు. ‘మిషన్ భగీరథ’, ‘మిషన్ కాకతీయ’ పథకాల కోసం తెలంగాణకు 24 వేల కోట్లు ఇవ్వాలని ‘నీతి ఆయోగ్’ సిఫారసు చేసినప్పటికీ ఒక్క రూపాయి కేంద్రం ఇవ్వకపోవడం శోచనీయం. తెలంగాణకు ఐఐఎం, ఎన్ఐడీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్), మెగా పవర్లూమ్ క్లస్టర్, కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్స్, ఇండస్ట్రియల్ కారిడార్, డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్లు, ఇతర జాతీయ ప్రాజెక్టులు ఇవ్వలేదు. 2014 ఎన్నికల్లోనే దివంగత నేత సుష్మా స్వరాజ్ కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తామని వాగ్దానం చేశారు. ఎనిమిదేండ్లయినా ఇప్పటికీ ఆ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు. కానీ కర్ణాటకకు చెందిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇచ్చారు.
ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్, తదితర బీజేపీ పాలిత రాష్ర్టాలకు వెళ్లిన ప్రతీసారి బుల్లెట్ రైళ్ల నుంచి మెడికల్ కాలేజీలు, ఐఐఎంలు ఇండస్ట్రియల్ కారిడార్లు, వేల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారు. కానీ రాజ్యాంగపరంగా తెలంగాణకు దక్కాల్సిన నిధులే సరిగా ఇవ్వడం ఇవ్వలేదు. హైదరాబాద్లో వరదలు వచ్చి తీవ్ర నష్టం జరిగితే మొండిచేయి చూపి, అదే తరహా వరదలు గుజరాత్లో వస్తే వేల కోట్లు ఇచ్చారు. హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటైన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్కు తోడ్పాటునందించకుండా గుజరాత్లో కొత్త ఆర్బిట్రేషన్ సెంటర్ను ఏర్పాటుచేయడం అనేది కవ్వింపు చర్య కాదా?
2014లో మోదీ ప్రధాని అయ్యేనాటికి పెట్రోల్ ధర రూ.70. నేడు రూ.120గా ఉన్నది. ఆ రోజు తెలంగాణ వ్యాట్ 35 శాతం, ఈ రోజు కూడా 35 శాతమే. మరి పెట్రోల్ ధర ఎందుకు రూ.50 పెరిగింది? మోదీ ప్రభుత్వం కొత్తగా వేసిన ఫ్యూయల్ ట్యాక్స్, సెస్ ట్యాక్స్ల వల్ల రోజురోజుకు పాపం పెరిగినట్టు పెరుగుతున్నది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి చేరుకొని దిగువ, మధ్య తరగతి ప్రజల జీవితాలను ఛిద్రం చేశాయి. మోదీ వీటిగురించి మాట్లాడకుండా పొద్దున లేస్తే మతం, హిందూ-ముస్లిం, పాకిస్థాన్, చైనా అంటూ ప్రజలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకొంటున్నారు. మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ‘ప్లీజ్.. ప్లీజ్..’ అంటూ అధికారం కోసం అడుక్కున్నాడు. నిన్న మసీదులు తవ్వుతామన్నాడు. తెలంగాణ ప్రజల కోసం ఫలానా పథకం పెట్టమని ఏనాడూ కేంద్రంలోని తమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దాఖలాల్లేవు. లేదా రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఫలానా పనులు చేస్తామని గానీ, ఫలానా సమస్యను ఫలానా విధంగా పరిష్కరిస్తామని గానీ ప్రజలకు వివరించిన సందర్భం లేదు. విషయం లేని నాయకులకు విషం ఎక్కు వ. అటువంటి నాయకులు ఎక్కడున్నారంటే బీజేపీలో ఉన్నారని బండి సంజయ్ వాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నది.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండోసారి జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి నలుగురు ఎంపీలను, శాసనసభ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. నాటి నుంచి నేటి వరకు వీరు తెలంగాణ అభివృద్ధికి చేసింది శూన్యం. తెలంగాణకు వచ్చిన ప్రతీసారి మోదీ ఉత్త్త చేతులతో రావడం, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి వెళ్లడం చూస్తే ఉత్తరాది నాయకులకు దక్షిణాది రాష్ర్టాలంటే ఎంత చిన్నచూపో అర్థమవుతుంది. 108 సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ 105 ఎమ్మెల్యేలున్న టీఆర్ఎస్కు పోటీనే కాదు. ఆ నలుగురు ఎంపీల వ్యవహారశైలిని చూస్తున్న తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు ఉన్న ఏకైక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక అని ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇప్పుడు హైదరాబాద్కు మోదీ రావడంలో ఉన్న ఆంతర్యం తెలంగాణ ప్రజలకు. వచ్చే ఎన్నికల్లో కొద్దో గొప్పో సీట్లు గెలిచి మహారాష్ట్ర, మిగతా 8 రాష్ర్టాల మాదిరి మిగతా పార్టీ ఎమ్మెల్యేలను ఎలాగోలా ప్రలోభపెట్టి అనైతికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనే కుటిల బుద్ధితోనే పదే పదే తెలంగాణకు వస్తున్నారు. కానీ మోదీకి తెలియని విషయ మేమంటే తెలంగాణ ప్రజలు గుజరాత్ ప్రజలు కాదు. ఇక్కడి ప్రజలకు తెలుసు కేసీఆర్ అవసరం ఇంకా తెలంగాణకు ఉన్నదని. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఒక కచ్చితమైన, స్పష్టమైన తీర్పునిస్తారు. అది వాళ్లు ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఉన్నారు.
కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో కట్టింది రూ.3,65,797 కోట్లు. కేంద్రం నుంచి తెలంగాణకు తిరిగి వచ్చింది రూ.1,68,000 కోట్లు మాత్రమే. జాతి నిర్మాణంలో తెలంగాణ తన పాత్రను గొప్పగా పోషిస్తున్నది. జాతి నిర్మాణానికి ఆర్థికంగా తోడ్పడుతున్న రాష్ర్టాల్లో నాలుగవ రాష్ట్రం తెలంగాణ అని గతేడాది అక్టోబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడం హర్షించదగిన విషయం.
– కాసర్ల నాగేందర్రెడ్డి
+61478311563
(వ్యాసకర్త: అధ్యక్షులు, టీఆర్ఎస్ ఆస్ట్రేలియా)