శివుని జటాజూటం నుంచి దూకే గంగా ప్రవాహంలా, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలు పాలమూరు భూముల వైపు పరుగులు తీసే అద్భుత సన్నివేశాన్ని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పురాణ పురుషుడైన భగీరథుడిని తలపించిండు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో ‘ఇది నా జన్మకు లభించిన సార్థకత’ అని ఎంతో భావోద్విగ్నతతో అన్నారు. నిజానికి తెలంగాణ సాధించిననాడే ఆయన చరితార్థుడైనాడు. పునర్నిర్మాణాన్ని సైతం దిగ్విజయంగా జరుపుతూ ఆయన మరింత ధన్యతను అందుకున్నారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ మొత్తం ఆరు జిల్లాలో 12 లక్షల 30 వేల ఎకరాల భూములను కృష్ణా జలాలతో తడిపి తరింపజేస్తుంది. 1,226 గ్రామాలతో పాటు జంటనగరాల దాహార్తిని కూడా తీరుస్తుంది.
గోదావరి మీద కాళేశ్వరం, సీతారామ, కృష్ణానది మీద పాలమూరు- రంగారెడ్డి ఈ మూడు భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించినందుకూ, తెలంగాణను సాంతం సస్యశ్యామలం చేసినందుకూ కేసీఆర్ కీర్తి ఆచంద్రతారార్కం నిలిచిపోతుంది. రాజకీయ ప్రత్యర్థులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనను నేడు విమర్శించవచ్చు కానీ, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి నదీ జలాలను మళ్లించి కరువు కాటకాలను బాపిన కేసీఆర్ గురించి భవిష్యత్తు అంతా కృతజ్ఞతతో మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజల ఇంటి దీపమై బంగరు పంటల బతుకు రూపమైన ఆయన కృషిని ఎన్నటికైనా శత్రువులు కూడా కొనియాడక తప్పదు.
ఆంధ్రపదేశ్ ఏర్పాటుతో అత్యధికంగా నష్టపోయింది పాలమూరు జిల్లా. నాటి తెలంగాణలో అతి పెద్ద జిల్లా. కృష్ణా, తుంగభద్ర, బీమా నదీ పరీవాహక ప్రాంతం. బంగారం పండే నల్లరేగడి భూములు దండిగా ఉన్న జిల్లా. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు.. పరాయి పాలకుల వివక్ష వల్ల, తెలంగాణ నాయకుల నిష్క్రియా పరత్వం వల్ల పాలమూరు ఎండిపోయి ఎడారిగా మారింది. ఉమ్మడి రాష్ట్ర పాలకులకు పాలమూరుకు నీరందించే ఆలోచనే లేదు. దీంతో ప్రజలు బతుకు దెరువు కోసం పొట్టచేత పట్టుకొని దూర దేశాలకు వలసపోయే గతి పట్టింది. పల్లేర్లు మొలిచిన చేన్లు, తాళాలు పడ్డ ఇండ్లు, గడ్డి మొలిచిన మొండిగోడలు, మొరం తేలిన వాకిండ్లు, ఆకలిచావులు, ఆత్మహత్యలు, గంజి కేంద్రాలు.. ఇవీ నాటి పాలమూరు భయానక జీవన దృశ్యాలు. సగం జనాభా పొట్ట చేతబట్టుకొని వలసెల్లిపోయేది. సోర సోర పిల్లలంతా ఊర్లిడిసి దూరదేశాలకు ఎల్లిపోతే, ముసలివాళ్లు అనాథలుగా ఊళ్లలో మిగిలిపోయేది. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడిన నాడు నాటి కాంగ్రెస్ నాయకులెవ్వరూ పాలమూరుకు నీళ్లు కావాల్నని అడిగిన పాపానపోలేదు. చివరికి ట్రిబ్యునలే దయతలిచి, తనకు తానుగా కృష్ణాలో 19 టీఎంసీల నీళ్లు కేటాయించింది.
అట్లా ఆ నీళ్లతోని వచ్చిందే జూరాల ప్రాజెక్టు. జూరాల ప్రాజెక్టుకు 1981లో శంకుస్థాపన చేస్తే, 1996లో పూర్తయింది. కానీ ముంపు ప్రాంత ప్రజలకు పరిహారం చెల్లించలేదు. కర్ణాటక రాష్ర్టానికి పరిహారపు సొమ్ము చెల్లించకపోవడంతో జూరాల జలాశయంలో పూర్తిస్థాయిలో నీటిని నింపలేదు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ఆ దెబ్బకు దిగొచ్చి, 2008లో చివరి చెల్లింపులు జరిపితే, 2009లో జలాశయంలో పూర్తి మట్టానికి నీరు నింపడం ప్రారంభమైంది.
రాజోలిబండది ఇంకో విషాదగాథ. 87 వేల ఎకరాలు పారాల్సిన రాజోలిబండ 30 వేల ఎకరాలే పారేది. సీమాంధ్రులు రాజోలిబండ తూములు బద్దలుకొట్టి నీళ్లను అక్రమంగా తరలించుకపోతుంటే.. చేవచచ్చి, చేష్టలుడిగి చోద్యం చూసిందెవరు? ఇవాళ బీరాలు పలుకుతున్న ఈ కాంగ్రెస్ నాయకులే కదా?కేసీఆర్ రాజోలి బండ పాదయాత్ర చేసి, సీమాంధ్రుల దౌర్జన్యాన్ని ఎదిరించారు. బాంబులతో తూములు బద్దలు కొడతామన్న బెదిరింపులకు జవాబుగా బిడ్డా.. నేను గిట్ల చిటికేస్తే, సుంకేశుల దుమ్ము దుమ్ము అయిపోవాలె అని హెచ్చరించి, తెలంగాణ పౌరుషాన్ని చాటారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పోతిరెడ్డి పాడు నాలుగు గేట్లకు అదనంగా మరో 10 గేట్లు నిర్మించి, 11 వేల క్యూసెక్కుల నీళ్లకు బదులు 44 వేల క్యూసెక్కులు తీసుకుపోతూ తీవ్రమైన జలదోపిడీకి తెరతీసిండు. ఆ అన్యాయానికి వంతపాడుతూ నాటి కాంగ్రెస్ నీటిపారుదల శాఖామంత్రి అండ్ల తప్పేముందని అన్నడు.
తెలంగాణ నీటి హక్కును కొల్లగొడుతూ, అనుమతుల్లేకుండా నిర్మించిన హంద్రీ-నీవా ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తే, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ముఖ్య అతిథులుగా పోయిన్రు. ఇదే భట్టి విక్రమార్క గారు, ఇదే డీకే అరుణ గారు కొబ్బరికాయలు కొట్టి, స్విచ్చులొత్తి తమ స్వహస్తాలతో సీమాంధ్రకు నీళ్లు అక్రమంగా పంపింగ్ చేసిన్రు. తెలంగాణ నోట్లె మట్టి గొట్టిన్రు. చరిత్ర పొడుగునా తెలంగాణ కాంగ్రెస్ నాయకులది దొంగలకు సద్దులు కట్టిన ద్రోహ చరిత్రనే.
తెలంగాణ వచ్చి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినంక గదా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ముందటపడ్డయి. ఉమ్మడి పాలమూరు సగానికి పైగా పచ్చగయింది. కాంగ్రెస్ పాలనలో పాలమూరు బిడ్డ అంటే పనికోసం ఎదురుచూసే అడ్డామీది కూలీ. బీఆర్ఎస్ పాలనలో నలుగురికి పని కల్పిస్తున్న రైతుబిడ్డ పాలమూరు బిడ్డ. నాడు పనుల కోసం పొట్ట చేతబట్టుకొని పాలమూరు కూలీలు దేశం పోదురు. నేడు దేశమంతటి నుంచీ ఇతర రాష్ర్టాల కూలీలు పాలమూరుకు వలస వస్తున్నరు. ఇదీ నిజమైన మార్పు అంటే.
సమైక్య రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సర్వేకు కూడా అనుమతి ఇయ్యలేదు. ఉద్యమం ఉధృతం చేస్తే తప్పనిసరై నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి 2014 ఎన్నికల ముందట అనుమతిచ్చిండు. ప్రధాని మోదీ దేశంలో మేం అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నికల సభల్లో వాగ్దానం చేసిండు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా విదిల్చలేదు. కనీసం కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్కు ఒక లేఖనన్నా రాయమంటే గా చిన్న పని కూడా చేయక ఉసురు పోసుకుంటున్నది.
అందుకే మంటి పనికైనా ఇంటోడుండాలంటరు. తెలంగాణ వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్తితో పూనుకొని, అటక మీద దుమ్ము పట్టిపోయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ఫైలు తీయించిండు. నీటి వనరుగా మొదట జూరాల ఉండే. ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చిండు. జూరాల అంతగొడితే 9 టీఎంసీల పిట్టంత ప్రాజెక్టు. దాని మీద ఇప్పటికే శానబరువున్నది. జూరాల సొంత ఆయకట్టు లక్ష ఎకరాలకు నీళ్లియ్యాలె, నెట్టెంపాడు 2 లక్షల ఎకరాలకు నీళ్లియ్యాలె, భీమా 2 లక్షల ఎకరాలకు నీళ్లియ్యాలె, కోయిల్సాగర్ 50 వేల ఎకరాలకు నీళ్లియ్యాలె, మిషన్ భగీరథ తాగునీటికి కూడా జూరాల నుంచే నీళ్లియ్యాలె. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు సఫలం కావాల్నంటే 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచే నీళ్లు ఎత్తిపోసుకోవాలె. ఈ మార్పుతో ముంపు ప్రాంతం తగ్గింది. నీటి లభ్యత పెరిగింది.
రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్టు తెలంగాణ వచ్చినంక కూడా కాంగ్రెస్ నాయకుల ద్రోహ బుద్ధి మారలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే బీఆర్ఎస్ బలపడుతదనే భయంతో కోర్టుల కేసులేసి అడ్డుపడ్డది, ప్రజల నోట్ల మట్టిగొట్టేటందుకు సిద్ధపడ్డది వేరెవరో కాదు, కాంగ్రెస్ కాలకేయులే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కుట్రలను ఛేదించి, న్యాయ పోరాటంలో పాలమూరు ప్రజలను గెలిపించి, శ్రీశైలం నుంచి నీళ్లను విజయవంతంగా మలిపించి నార్లాపూర్ దగ్గర ప్రారంభోత్సవం చేసిండు. కరువు కథలకూ, వలస వెతలకూ చెల్లు చీటీ రాసిండు.
ప్రాజెక్టులో మిగిలిన పనులు చకచకా పూర్తికావాలె. కాల్వలు నిండుగా నీళ్లతో పారాలె. కృష్ణా జలాలతో ఆరు జిల్లాలు పునీతం కావాలె. పచ్చని పంటల పాలమూరు కోనసీమను మించిపోవాలె. అప్పటిదాకా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిద్రపోడు. ఇప్పుడు ప్రజలను బీఆర్ఎస్ కోరేదొక్కటే. ఎట్టి పరిస్థితుల్లో ఈ అభివృద్ధి ప్రక్రియ ఆగొద్దు. ఏమరుపాటున కాంగ్రెస్కే గనుక అవకాశం ఇస్తే.. ఇగ తెలంగాణను మళ్లా పెద్దపాము మింగినట్టే. ‘అస్సల్ యాళ్లకు ఫిసల్ గయా’ అన్నట్టయితది.
అవినీతి గురించి కాంగ్రెస్ ధర్మపన్నాలు వల్లించడమంటే తోడేలు శాకాహారం గురించి మాట్లాడటమే. కాంగ్రెస్ను ఏ కోణంలో చూసినా కుంభకోణమే కనిపిస్తది. రాజకీయాల్లో నేడు కనిపించే అనేక జాడ్యాలకు, రుగ్మతలకు కాంగ్రెస్ పార్టీయే జన్మస్థలం. దోపిడీ, కుమ్ములాటలు కాంగ్రెస్ మౌలిక స్వభావం. అది ఎన్నటికీ మారదు. మేక తోలు కప్పుకొన్నంత మాత్రాన తోడేలు సాధు జంతువు కాదు. కాంగ్రెస్ను నమ్మితే, మందిమాటలు నమ్మి మారుమానం పోతే.. మల్లొచ్చె వరకు ఇల్లు కాలిపాయె.. అన్నట్టయితది.
ఈ పదేండ్లలో బీఆర్ఎస్ నాటిన అభివృద్ధి బీజాలు, ఇప్పుడు పుష్పించి, ఫలిస్తున్నాయి. కరెంటు నుంచి సాగునీరు దాకా, వ్యవసాయం నుంచి ఐటీ దాకా, పల్లె నుంచి పట్నం దాకా అన్ని రంగాలను అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేసింది. దళిత, గిరిజనుల నుంచి అగ్రవర్ణ పేదల దాకా, అందరినీ ఆదుకుంటున్నది. ప్రతి చేనుకూ నీళ్లు, ప్రతి చేతికీ పని దొరికేట్టు చేస్తున్నది. ఇవాళ తెలంగాణల హనుమాండ్ల గుడి లేని ఊరు లేదు. ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదు. సంపద పెంచుతున్నం, ప్రజలకు పంచుతున్నం. అడ్డమొచ్చినోన్ని వంచుతున్నం.
ఈ దశలో ఎటువంటి పొరపాటుకూ తావివ్వవద్దు. మల్లొకసారి చెప్తున్నా.. మంటిపనికైనా ఇంటోడే ఉండాలె. మనకు మతపిచ్చి మోదీలొద్దు, కాంగ్రెస్ కేడీలొద్దు, బతుకును నిలబెట్టే బీఆర్ఎస్సే ముద్దు. హైకమాండ్ ఢిల్లీలోనో, గుజరాత్లోనో ఉండే పార్టీలు మనకొద్దు, వాళ్లతోని ఇంత పెద్ద పనులు కావు. బీఆర్ఎస్కు హైకమాండ్ తెలంగాణ ప్రజలే. తెలంగాణల పుట్టి, తెలంగాణలనే పెరిగి, తెలంగాణను సాధించి, తెలంగాణను మనసు పెట్టి పునర్నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీనే కొండంత అండ. దక్షత కలిగిన ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష.
(వ్యాసకర్త: రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామాత్యులు)