తెలంగాణ ఆవిర్భావం తర్వాత నూతన క్రీడా విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి సారథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ఉన్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం క్రీడా విధానంపై ఎందుకు ఆసక్తి చూపించలేదని క్యాబినెట్ సబ్ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
మన క్రీడా, యువజన, పర్యాటక విధానాలు పునర్ సమీక్షించవలసిన అవసరం ఎంతో ఉన్నదని ఆ కమిటీ భావించింది. అందులో భాగంగానే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమగ్రమైన క్రీడా విధానం రూపకల్పన చేయవలసిన అవసరం ఉన్నదని, ఈ సందర్భంగా క్రీడా సంఘాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నదని ప్రభుత్వానికి నివేదించింది. రాష్ట్రంలోని విద్యార్థులకు క్రీడా నైపు ణ్యం అలవడాలంటే పాఠాల్లో ఆటలను ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేయాలి. ప్రతి విద్యార్థి మానసికంగా ఎదగాలంటే క్రీడల్లో పాల్గొనాలి.
క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించిన అంశాలను పరిశీలిస్తే రాష్ట్రంలో నూతన క్రీడా విధానం విజయవంతమవుతుందనే విషయం స్పష్టమైంది. సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ క్రీడా సంఘాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. ఈ సందర్భంగా తనకున్న క్రీడా సంఘం పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ ప్రకటించడం శుభ పరిణామం. క్రీడా సంఘాలకు, ఆటల్లో అనుభవం, చిత్తశుద్ధి గలవారే నాయకత్వం వహించాలని ఆయన సూచించడం గర్వకారణం. అయితే ఈ కొత్త విధానంలో ముఖ్యంగా సాహస క్రీడలు, పర్వతారోహణ, స్పోర్ట్స్ ైక్లెంబింగ్, వాటర్ఫాల్ ర్యాపిలింగ్లను చేర్చాలి. అప్పుడే ఎంతోమంది సాహస క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుంది. తెలంగాణకూ మంచి పేరు వస్తుంది.
అత్యంత సాహసంతో కూడుకున్న క్రీడ పర్వతారోహణ పట్ల యువత ఆసక్తి చూపిస్తున్నది. ఇంతకీ పర్వతారోహణ అంటే ఏమిటి? హెచ్ఎంఐ సంస్థ డార్జిలింగ్లో, ఎన్ఐఎం ఉత్తర కాశీ, జమ్మూ, అరుణాచల్ప్రదేశ్లు పర్వతారోహణ శిక్షణనిస్తాయి. 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు పర్వతారోహణకు అర్హులు. ఇందుకోసం భారతీయ పర్వతారోహణ సంస్థ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయిన తర్వాత పూర్తి నివేదికను ఫొటోలతో సహా సమర్పించాలి. వాటిని పరిశీలించిన ఎక్స్పర్ట్ కమిటీ ఐ.ఎం.ఎఫ్ సమ్మిట్ సర్టిఫికెట్ను అందజేస్తుంది.
భారత పర్వతారోహకులు దేశంలోని పర్వతాలపై తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి పూర్తిస్థాయి అనుభవం గడించాలి. అయితే ఎవరెస్టు ట్యాగును చూపిస్తూ దళారులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎవరెస్టును అధిరోహించడం కోసం రూ.35 నుంచి 40 లక్షలు వసూలు చేయడం గర్హనీయం. పర్వతారోహణకు శారీరక దారుఢ్యం, అనుభవం ఉన్నదా అనే విషయాలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో కొంతమంది ఈ ఆటను ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్వతారోహకులకు ఊహించని విధంగా రూ.25 లక్షల నగదు, మూడెకరాల భూమి, ఇంటి స్థలాన్ని బహుమానంగా ఇస్తున్నారు. ఈ స్ఫూర్తితో రాష్ట్ర యువత పెద్ద ఎత్తున పర్వతారోహణపై ఆసక్తి చూపిస్తున్నది. అయితే, ఇలాంటి సాహస యాత్రలు రాష్ట్రస్థాయి పర్వతారోహణ సంస్థ, యువజన సర్వీసుల శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ద్వారా నిర్వహిస్తే క్రీడాకారులకు న్యాయం జరుగుతుంది. కేంద్రం పర్వతారోహణను గుర్తించలేదు. దేశంలోనే నూతన విధానాన్ని రూపొందించి పర్వతారోహణలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలవాలి.
సాహస క్రీడల రారాజుగా వెలుగొందుతున్న వాటర్ ఫాల్ ర్యాపిలింగ్పై రోజురోజుకు యువత మక్కువ పెంచుకుంటున్నది. జలపాతాలపై విన్యాసం చేయడం ఆషామాషీ ముచ్చట కాదు. అలాంటి సాహస క్రీడలకు పుట్టినిల్లు తెలంగాణ కావడం మనందరికీ గర్వకారణం. ఒలింపిక్ క్రీడ అయిన స్పోర్ట్స్ ైక్లెంబింగ్ను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖలు క్రీడల జాబితాలో చేర్చడం అభినందనీయం. అయితే నూతన క్రీడా విధానంపై ఆయా సంఘాలు, క్రీడలకు సంబంధించిన వారితో చర్చించి, కొన్ని సంస్కరణలను తీసుకువస్తే రాష్ట్రం క్రీడా తెలంగాణగా భాసిల్లుతుంది.
(వ్యాసకర్త: వ్యవస్థాపకులు, ఏసీటీఎస్)
కె.రంగారావు 98492 70575