మహిళలకు ‘లా’ ప్రాక్టీస్ చేసే హక్కు లేదు. న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేసేందుకు వీల్లేదంటూ కలకత్తా, పాట్నా హైకోర్టులు తీర్పునిచ్చాయి. న్యాయవాద వృత్తి చేపట్టేందుకు అనుమతివ్వాలని కార్నెలియా సోరాబ్జీ 1921లో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విజయం సాధించింది.
పురుషులకే పరిమితమైన న్యాయవాద వృత్తిని సవాలు చేసిన తొలితరం మహిళా న్యాయవాదులు రెజీనా గుహ, సుధాంశు బాల హజ్రా, కార్నెలియా సోరాబ్జీ. 1879లో వచ్చిన ‘లీగల్ ప్రాక్టిషనర్స్ యాక్ట్’ ప్రకారం ‘లా’ చేసినవారు న్యాయవాద వృత్తిని చేపట్టే వీలుంది. రెజీనా గుహ ‘లా’ పూర్తిచేశాక 1916లో న్యాయవాదిగా పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోవడం పెద్ద చర్చ జరిగింది. ఆ చట్టాన్ని సవాలు చేసిన ఆమె దరఖాస్తును కలకత్తా హైకోర్టుకు నివేదించారు. ఇది దేశంలో మొదటి కేసుగా పరిగణిస్తారు. అయితే, ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం, రెజీనా గుహ అభ్యర్థనను తోసిపుచ్చుతూ తీర్పుచెప్పింది.
1921లో సుధాంశు బాల అనే మహిళ కూడా అదే తరహాలో పాట్నా హైకోర్టులో న్యాయపోరాటం చేసి ఓడిపోయారు. న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు అనుమతివ్వాలని ఆమె దాఖలు చేసిన వ్యాజ్యం దేశంలో రెండో కేసుగా పరిగణిస్తున్నారు. సుధాంశు బాల కేసులోనూ పాట్నా హైకోర్టు కూడా మహిళలు న్యాయవాద వృత్తి చేపట్టేందుకు వీల్లేదని తేల్చిచెప్పింది. అదే ఏడాది కార్నెలియా సోరాబ్జీ అలహాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి విజయం సాధించడంతో ఆమె భారతదేశంలో తొలి మహిళా న్యాయవాదిగా చరిత్ర పుటల్లో నిలిచారు. 1919లో బ్రిటన్ హైకోర్టు మహిళలు న్యాయవాద వృత్తిని ఎంచుకోవచ్చని తీర్పు చెప్పింది. 1923లో ‘లీగల్
ప్రాక్టిషనర్స్ యాక్ట్’ రూపకల్పనతో మహిళలు కూడా న్యాయవాద వృత్తిని నిర్వహించేందుకు వీలుంది. ఈ చారిత్రక చట్టం అమల్లోకి రావడంతో అప్పటికే కలకత్తా, పాట్నా హైకోర్టులు ఇచ్చిన తీర్పులకు కాలం చెల్లింది.
దేశంలో ఏ రాష్ట్ర హైకోర్టులోనూ లేనివిధంగా తెలంగాణ హైకోర్టులో మాత్రమే ఆరుగురు మహిళలు న్యాయమూర్తులుగా ఉండటం గొప్ప విషయం. ఇప్పుడు కొత్తగా మరో నలుగురు మహిళలు న్యాయమూర్తులు కాబోతున్నారు. అంటే మూడు వంతుల మంది మహిళా న్యాయమూర్తులయ్యారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు తర్వాత తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి విధులు నిర్వహిస్తున్నారు. తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ చేశారు. ప్రస్తుతం ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. దేశంలోని హైకోర్టుల చరిత్రలోనే అరుదైన విషయంగా చెప్పుకొనే స్థాయిలో మన హైకోర్టులో 10 మంది మహిళలు
న్యాయమూర్తులు ఉండబోతున్నారు. కొత్తగా నియమితులైన 12 మందిలో ఇద్దరు న్యాయాధికారుల నుంచి, మరో ఇద్దరు న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులు కాబోతున్నారు. అంటే హైకోర్టులో మూడో వంతు న్యాయమూర్తులు నారీమణులే న్యాయదేవతలు కాబోతున్నారు. దేశంలో హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు సగటున 11.5 శాతం మంది ఉంటే, మన రాష్ట్రంలో 30 శాతానికి పైగా ఉండటం గమనార్హం.
కింది కోర్టుల్లోని జడ్జిల్లో సగం మందికిపైగా మహిళలున్నారు. న్యాయాధికారుల పోస్టుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో నియమితులవుతున్నారు. రాష్ట్రంలోని కింది కోర్టుల్లో 434 మంది జడ్జిలుంటే అందులో 221 మంది మహిళలే ఉన్నారని హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్చంద్ర శర్మ చెప్పారు. మహిళల వాటా ఏకంగా 52 శాతంగా ఉండటం విశేషం. 125 మంది జిల్లా జడ్జిల్లో 52 మంది నారీమణులే. మొత్తం 231 మంది జూనియర్ సివిల్ జడ్జిల పోస్టుల్లో 130 మంది మహిళలే. ఆ మొత్తం పోస్టుల్లో 66
మందిని గతేడాది చివరలో నియమించగా, ఇందులో సగం మందికిపైగా మహిళలే ఎంపికయ్యారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోని కింది కోర్టుల్లో మహిళా జడ్జిల సంఖ్య 30 శాతంగానే ఉంది.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక సుప్రీంకోర్టు 1950లో ఏర్పాటైంది. అంతకుముందు 1935 నుంచి ఉన్న ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీం కోర్టు ఏర్పాటైంది. సుప్రీంకోర్టులో 1989లో తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ అయ్యారు. ఇప్పటివరకూ 11 మంది మహిళలు మాత్రమే న్యాయమూర్తులుగా చేశారు. ఇప్పుడు 34 మంది న్యాయమూర్తుల్లో రికార్డుస్థాయిలో తొలిసారి నలుగురు మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తి కాలేదు. కర్ణాటకకు చెందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవ్వడం ద్వారా కొత్త చరిత్ర రాయనున్నారు.
దేశంలో పలు కోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య అతితక్కువగా ఉంది. కింది కోర్టుల్లో కేవలం 30 శాతం మహిళా న్యాయమూర్తులు, హైకోర్టులలో 11.5 శాతమే మహిళా న్యాయమూర్తులున్నారు. దేశవ్యాప్తంగా 17 లక్షల మంది న్యాయవాదులుంటే.. అందులో మహిళలు 15 శాతమే. రాష్ట్ర బార్ కౌన్సిల్స్లో రెండు శాతం మహిళా సభ్యులున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో 20 మంది సభ్యుల్లో ఒక్క మహిళ కూడా లేదు. సుప్రీంకోర్టు కొలీజియంలో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేకపోవడం శోచనీయం..
దేశంలో ఏ రాష్ట్ర హైకోర్టులోనూ లేనివిధంగా తెలంగాణ హైకోర్టులో మాత్రమే ఆరుగురు మహిళలు న్యాయమూర్తులుగా ఉండటం గొప్ప విషయం. ఇప్పుడు కొత్తగా మరో నలుగురు మహిళలు న్యాయమూర్తులు కాబోతున్నారు. అంటే మూడు వంతుల మంది మహిళా న్యాయమూర్తులయ్యారు.
-పెమ్మరాజు శ్రీనివాస్, 99597 72949