‘నో అడ్మిషన్స్’- ప్రవేశాలు ముగిసిన తర్వాత ప్రఖ్యాతి గాంచిన ప్రైవేటు స్కూళ్ల ముందు ఇటువంటి బోర్డులను చూస్తుంటాం. ఆ స్కూల్ ప్రతిష్ఠకు అదొక చిహ్నం లాంటిది. తెలంగాణలో ఇటువంటి బోర్డులు పలు ప్రభుత్వ స్కూళ్ల ముందు కూడా ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఇకపై కొత్తగా విద్యార్థులను చేర్చుకోలేమంటూ ఆయా పాఠశాలలు సగర్వంగా తమ హోదాను ఈ విధంగా చాటుకుంటున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగంలో సాధించిన అభివృద్ధికి ఈ బోర్డులు ఒక సంకేతం లాంటివి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో.. ఈ విద్యాసంస్కృతి మరింత సుసంపన్నం కానుంది.
రాష్ట్రంలోని మొత్తం 26,072 ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన సదుపాయాలతో తీర్చిదిద్ది, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే పథకం ‘మన ఊరు-మన బడి’. అత్యంత పకడ్బందీగా రూపకల్పన చేసిన తీరును చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థమవుతుంది. పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన ఇంజినీర్లతో తొలుత పాఠశాలల్లో సర్వే జరిపించి.. అక్కడి అవసరాలను నమోదు చేశారు. కొత్త స్విచ్బోర్డులను బిగించటం, నల్లాల ఏర్పాటు, తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, టాయిలెట్ల ఆధునికీకరణ దగ్గరి నుంచి ప్రయోగశాలలను తీర్చిదిద్దటం వరకూ ప్రతీ అంశాన్ని పరిగణలోకి తీసుకొన్నారు. ఇక జరిగే పనులను గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ సంస్థతో తనిఖీ చేయిస్తారు. ‘మన ఊరు-మన బడి’ సాఫ్ట్వేర్ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో రూపొందిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో బూజు పట్టిపోయిన ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను బాగు పరచటానికి తెలంగాణ సర్కారు 2014 నుంచే పలు చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర గురుకులాలు, మోడల్ స్కూళ్లు రాష్ట్రంలో చదువుల పండుగను తీసుకొచ్చాయి. వాటిలో పిల్లల్ని చేర్పిస్తే చాలు.. వారి భవిష్యత్తుకు ఢోకా ఉండదన్న భరోసాను తల్లిదండ్రులకు కల్పించాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లూ పెరిగాయి. ప్రైవేటు స్కూలును వదిలిపెట్టి మరీ సర్కారు బడిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం అన్నంతో పౌష్టికాహారం అందించటం, నాణ్యమైన బోధన వంటివి దీనికి తోడ్పడ్డాయి. ఈ విధంగా మొదలైన ప్రయత్నాలను శిఖరస్థాయికి తీసుకెళ్లే నిర్ణయం.. ప్రభుత్వస్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో బోధన. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్లభాషలో నైపుణ్యం కనీసావసరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆంగ్లమాధ్యమం అనేది గొప్ప నిర్ణయం. దీనికి దన్నుగా నిలుస్తుంది ‘మన ఊరు-మన బడి’. ప్రభుత్వ పాఠశాలలను సమున్నతంగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమాల ద్వారా.. విద్యారంగంలో విప్లవానికి తెలంగాణ దీపస్తంభమై నిలువనున్నది.