రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను అనుకరిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రి చేయడాన్ని రాష్ట్రపతి, ప్రధానితో పాటు వివిధ పార్టీలు తప్పుబట్టాయి. కానీ ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం భిన్నంగా స్పందించారు. మిమిక్రి చేసిన ఎంపీని కాకుండా.. ఆ ఘటనను వీడియో తీసిన రాహుల్గాంధీకి ఆమె చురకలంటించారు. అసలు ఆయన (రాహుల్) రికార్డింగ్ చేసి ఉండకపోతే, ఈ విషయం ఎవరికీ తెలిసి ఉండేది కాదని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ వల్లనే తమ పార్టీ మాట పడాల్సి వచ్చిందని వాపోయారు. బహుశా ఇదే కోపంతో కాబోలు ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ కంటే మల్లికార్జున్ ఖర్గే బెటర్ అని దీదీ ప్రతిపాదించి ఉంటారని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
పదేండ్ల నుంచి అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాపం చాలా దయనీయంగా ఉన్నట్టు ఉంది. అతిథులకు భోజనం పెట్టించే మాట దేవుడెరుగు కనీసం సమోసాలకు కూడా డబ్బులు లేవట. అందుకే కాబోలు రూ.138 మొదలుకొని ఎంత ఇచ్చినా తీసుకుంటామని ఆ పార్టీ ఇటీవల నిధుల సేకరణను ప్రారంభించింది. కాంగ్రెస్ పరిస్థితి మరీ ఇంత హీనంగా ఉందని అనుకోలేదని బీహార్కు చెందిన జనతాదళ్ (యూ) నాయకుడు సునీల్కుమార్ పింటు సానుభూతి కురిపించారు. ఇండియా కూటమి సమావేశం కోసం పట్నా నుంచి ఢిల్లీకి వస్తే చాయ్ బిస్కెట్ ఇవ్వడమేమిటి? కనీసం మీవద్ద సమోసాలు తెప్పించడానికి కూడా డబ్బులు లేవా పాపం అని ఆయన జాలిపడ్డారట.
ప్రధాని మోదీ, హో మంత్రి అమిత్ షా ఏ రాష్ర్టానికెళ్లినా తమతో జతకట్టని పార్టీలపై పరివార్ వాది అని ముద్రవేస్తుంటారు. కానీ తమకు మద్దతు ఇచ్చే పార్టీలను మాత్రం వారు పరివార్వాది కోణంలో కాకుండా స్వపరివార్గా భావిస్తారు. కర్ణాటకకు చెందిన మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన కుమారుడు మాజీ సీఎం కుమారస్వామి, మరో కుమారుడు రేవణ్ణ, మనువడు ప్రజ్వల్ ఒకే కటుంబానికి చెందిన మూడు తరాల నాయకులు. ఇటీవల వారు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కర్ణాటకలో మా పార్టీకి మీ పరివార్ సేవలు అవసరం అని మోదీ వారిని కోరారట. అయ్యో మీరు పరివార్వాదికి వ్యతిరేకం కదా? అని ఎవరైనా గుర్తు చేస్తే, ‘నిజమే కానీ స్వపరివార్కు కాదు కదా’ అని అంటారేమో?
‘ఎవరితోనైనా పెట్టుకోండి కానీ, బండి సంజయ్తో మాత్రం పెట్టుకోకండి’ అని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ గట్టి వార్నింగ్ ఇచ్చారట. ఆయన అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే తెలంగాణలో బీజేపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని ఒకవైపు మీరే అంటారు.. మరోవైపు ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వవద్దని మీరే అంటారు? ఇదెక్కడి లాజిక్కో నాకైతే అర్థం కావడం లేదని బన్సల్ ప్రశ్నించినట్టు వినికిడి. అసెంబ్లీ ఫలితాల విశ్లేషణ సందర్భంగా ఎదురైన ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేదట. ఇదే లాస్ట్ వార్నింగ్ ఇక ముందు ఎవరైనా బండి సంజయ్ను విమర్శించినా, ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కఠిన చర్యలు ఉంటాయని బన్సల్ హెచ్చరించారట. అధిష్ఠానం వద్ద బండికి పలుకుబడి బాగానే ఉన్నట్టుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
– వెల్జాల