జాతీయత- దేశ సంస్కృతిని, భాషను, జాతి జీవన విధానా న్ని, ఆ జాతిలో వచ్చే అమూల్యమైన కళలను, సాహిత్యాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. Merriam Webster Dictionary ప్రకారం ‘జాతీయత’ అంటే జాతికి విధేయంగా ఉండటం, జాతిపట్ల ఆరాధనాభావం కలిగి ఉండటం. ముఖ్యంగా పౌరుడు జాతీయ స్పృహను కలిగి ఉండటం.
18వ శతాబ్దంలో ‘జాతీయత’ వాడుకలోకి వచ్చింది. రోమన్ సామ్రాజ్యంలో ఈ జాతిభావం వికసించింది. 18-19 శతాబ్దాల్లో ఫ్రెంచ్, అమెరికా విప్లవాలు ఈ జాతి భావాన్ని మరింత బలోపేతం చేశాయి. 20వ శతాబ్ది మధ్యభాగంలో భారతీయ సమాజంలో ప్రపంచంలోని ఇతర విప్లవాల పరిణామాల వల్ల ఏకత ఉదయించింది. తమలో విభిన్న భాషలు జీవన విధానాలు ఉన్నా.. తామంతా ఒకటేనని, తమని తామే పాలించుకోవాలని భారతీయులు ఏక కంఠంతో నినదించారు.
జాతీయతకు సాహిత్యం ప్రేరకం. సాహిత్యం సమాజానికి దర్పణం అనుకున్నపుడు దీన్ని వేరుగా చూడలేం. 1857 తిరుగుబాటు నుంచి భారతీయ సాహిత్యం జాతీయోద్యమాన్ని ప్రతిఫలిస్తూ వస్తున్నది. ఠాగోర్, ముల్క్రాజ్ ఆనంద్, ఆర్.కె.నారాయణ్, మనోహర్ మల్గోకర్, కె.ఏ.అబ్బాస్, జి.వి.డేసాని, భబానీ భట్టాచార్యలాంటి అనేకమంది భరత జాతి పోరాటాన్ని తమ రచనల్లో ప్రతిఫలించారు.
1857లో వచ్చిన తిరుగుబాటుకు 1835లో కైలాస చందర్ దత్తు రాసిన ‘A Journal of Forty-Eight Hours of the Year-1945’, సుషీ చందర్ దత్తు రాసిన ‘The Republic of Orissa’ లాంటి వ్యాసాల్లో జాతి మూలాలున్నాయి. బంకించంద్ర దేశంలోని మతాన్ని లౌకికత్వంతో చూశాడు. బంకించంద్ర మత విధానాన్ని వలస పాలకులకు వ్యతిరేకంగా నిర్మించడంలో కృతకృత్యుడయ్యాడు. దేశీయత, జాతీయవాదం, బంకించంద్ర చేతిలో ఆధ్యాత్మిక స్ఫోరకమైన లౌకిక, జాతీయవాదంగా రూపుదాల్చా యి. ఆయన రాసిన ‘ఆనంద్ మఠ్’ నవల సన్యాసి తిరుగుబాటును గూర్చి చెప్పింది. చాలామంది జాతికోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించే విధంగా స్ఫూర్తినిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నవలను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది.
గాంధీ ప్రభావంతో సాహిత్య సృష్టి చేసిన రచయితల్లో ప్రము ఖుడు ముల్క్రాజ్ ఆనంద్. ఆయన మొదటి నవల ‘Untouch -able’. ‘బక’ అనే పేరున్న అస్పృశ్యుని ఒక రోజు జీవితం ఈ నవల. ‘కూలీ’, ‘Two leaves and a Bud’ నిమ్నవర్గాల బాధలను చిత్రించిన నవలలు. రాజారావు ‘Kanthapura’ మూఢాచారాల మీద గురిపెట్టిన అస్త్రం. కేఏ అబ్బాస్ జాతీయవాదం, అస్పృశ్యతపై బాగా రాశారు. ఆయన ‘Tomorrow is Ours’ అనే నవల ఈ విషయాలను బాగా ప్రతిఫలిస్తుంది. భబా నీ భట్టాచార్య నవల ‘So many hungers’ బెంగాలీ స్త్రీ స్థితిని, క్విట్ ఇండియా ఉద్యమాన్ని బలంగా చిత్రించింది. కాజోల్ అనే గ్రామీణ బాలిక తనను వ్యభిచారిగా మార్చడానికి జరిగిన కుట్ర లను తిరస్కరించి, ఎదిరించి ‘దినపత్రిక’ను అమ్మే వృత్తిలో కొనసాగుతుంది.
స్వతంత్రేచ్ఛ వ్యక్తం చేసిన కవుల్లో ప్రథమంగా చెప్పుకోదగిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన ‘Where the Mind is Without Fear’ అనే కవిత జాతీయతను ప్రతిఫలించింది. ఇదే సమయంలో బంకించంద్ర రాసిన ‘వందేమాతరం’, ఇతర గీతాలు ప్రాతఃస్మరణీయాలు. ‘గీతాంజలి’ రవీంద్రుని మరో ప్రసిద్ధ కావ్యం. ఇందులో స్వతంత్రేచ్ఛ అన్యాపదేశంగా చిత్రించబడింది. ఆయన రాసిన ‘జనగణమన..’ జాతీయ గీతంగా నిలబడింది. ఇదే కోవలో కవిత్వ సృజన చేసిన మరో జాతీయకవి సరోజినీ నాయుడు. ఆమె రాసిన అనేక పద్యాలలో ‘The Golden Threshold‘, ‘The Bird of Time‘, ‘The Feather of the Dawn‘ పేర్కొనదగినవి. ప్రసాద్ అని కలం పేరు కలిగిన శ్యాంలాల్ మరో పేర్కొనదగిన కవి. ‘ఝండా ఊంఛా రహే హమారా’ అని ఆయన రాసిన గీతం సుప్రసిద్ధం.
‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినదించిన కవి హసరత్ మొహాని. ప్రేమ వస్తువుగా అనేక గజల్స్ రాశారు. బరోడాలో ప్రజాసేవ చేసిన మరో కవి అరబిందో. మానవునికి సామాజిక ఆధ్యాత్మిక ప్రగతిని ఏకకాలంలో ఆకాంక్షించిన తత్వవేత్త ఆయన. తెలుగు నేలలో చూస్తే.. రాయప్రోలు, విశ్వనాథ, జాషువా, తుమ్మల, ఉప్పల మొదలైన వాళ్ళంతా స్వాతంత్య్రోద్యమ ప్రభావంతో రచనలు చేశారు.
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా- పొగడరా నీతల్లి భూమి భారతిని- నిలుపరా నీ జాతి నిండు గౌరవము’ అన్న రాయప్రోలు గీతం స్ఫూర్తి నింపింది. ‘దేశమంటే మట్టి కాదోయ్’ అన్న గురజాడ గీతం సామ్యవాదాన్ని సమన్వయం చేసుకున్న జాతీయాభిమానంగా నిలిచింది. వేదుల సత్యనారాయణశాస్త్రి ‘నీచపు దాస్యవృత్తి మన నేరక’ అన్న పద్యం, చిలకమర్తి ‘భరతదేశంబు చక్కని పాడియావు’ అనే పద్యం ఆ కాలపు సమాజాన్ని ఉర్రూతలూగించాయి. గరిమెళ్ల సత్యనారాయణ ‘మాకొద్దీ తెల్లదొరతనమూ’ అనే గీతం సామాజిక, సాహిత్యరంగాన్ని కదిలించింది.
తెలంగాణ విషయానికి వస్తే… ఇక్కడ ఎందరో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించిన సృజనకారులున్నారు. తెలంగాణ సాహితీవేత్తలు అటు జాతీయోద్యమ ప్రబోధం, ఇటు నిజాం నిరంకుశత్వం మీద పోరాటం చేశారు. ‘నిజాం రాజు జన్మజన్మాల బూజు’ అని దాశరథి గర్జించాడు. ‘ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే’ అని పరిహసించాడు. అదే సమయంలో జాతీయ భావజాలాన్ని కూడా ప్రచారం చేశాడు. కాళోజీ తెలంగాణకు మరో స్ఫూర్తిప్రదాత. ‘నా గొడవ’, ‘కాళోజీ కథలు’ ఆయన ప్రసిద్ధ రచనలు. తెలంగాణ ప్రజాకవిగా పేరు పొందిన కాళోజీ జాతీయవాదిగా కూడా ప్రసిద్ధుడు.
స్వాతంత్య్రోద్యమ నేపథ్యంలో వచ్చిన సాహిత్యం విభిన్న సామాజికవర్గాలను ఒకటిగా నిలపడానికి, తమది ఒకటే జాతి అని చెప్పడానికి తాత్విక భూమికగా పనిచేసింది. వచన రచయితలు కూడా తెలంగాణ జాతిభావానికి దోహదం చేశారు. వట్టికోట ఆళ్వారుస్వామి ‘జైలు లోపల’ కథలు, ‘ప్రజల మనిషి’ నవల, ‘కనువిప్పు’ నాటిక, 14 ఏకాంకికలు, కథలు ఆయన కృషికి నిదర్శనాలు. దాశరథి రంగాచార్య ‘చిల్లరదేవుళ్ళు’, ‘మోదుగుపూలు’, ‘జనపదం’ లాంటి నవలలు రచించాడు. నాటి తెలంగాణ గ్రామీణ జనజీవితాన్ని ఇవి బాగా ప్రతిఫలించాయి.
తెలంగాణ చారిత్రకుడు, విమర్శకుడు, కవి, రచయిత, సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన రచించిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ అత్యంత స్ఫూర్తిమంతం. ఆయన బలమైన జాతీయవాది. సుద్దాల హనుమంతు ‘పల్లెటూరి పిల్లగాడ’ పాట రణభేరి మోగించింది. జాతి గర్వించదగిన కవులు గజ్జెపల్లి సత్యనారాయణరాజు, ఇప్పటికీ కొనసాగుతున్న మలయశ్రీ, కూరెళ్ళ విఠలాచార్య ఇలా ఎంతోమంది ఉన్నారు.
వీరందరిలో కొందరు సామ్యవాదులున్నారు. దేశం ప్రసక్తి లేకుండా సామ్యం ప్రసక్తి ఎక్కడిది? జాతీయత, సామ్యవాదం దేనికి ఏదీ అతీతం కాదు. మన దేశంలో కులం ఓ ప్రత్యేకత. ఈ కుల నిర్మూలన జరగనిదే జాతి ఏకంగా ఉండటం జరగదు. ఇప్పుడు మూలవాసి ఈ దేశం నాదే అంటున్నాడు. ఇప్పటికైనా ఈ దేశం మనదనే భావం రావాలి. నిచ్చెన మెట్ల అసమ సమాజం ధ్వంసమైతేనే ఆ పరిస్థితి వస్తుంది. జాతీయత వెల్లివిరుస్తుంది. సాహిత్యం అడుగులు కూడా ఆ వైపే పడటం హర్షణీయం.
– డాక్టర్ కాంచనపల్లి గోవర్ధనరాజు
96760 96614