మేడిగడ్డ మరమ్మతులు పూర్తయ్యేదెన్నడు? అనే ప్రశ్నకు ఆంధ్రజ్యోతిలో (23-02-2026)న అచ్చయిన వార్త తేటతెల్లం చేసింది. ఆ వార్తా కథనం ప్రకారం.. వచ్చే ఏడాది అంటే 2027 వేసవిలో మరమ్మతులు మొదలవుతాయి. ‘కాళేశ్వరాన్ని గాలికి వదిలేయం. మేడిగడ్డ మరమ్మతులు చేపడుతాం’ అని ముఖ్యమంత్రి గారి ఈ ప్రకటన (22-02-2026)ను కలిపి ఈ వార్తా కథనాన్ని చదువుకోవాలి. వచ్చే ఏడాది వరకు ఎందుకు ఆగాలి? అనే ప్రశ్నకు జవాబు.. పోలవరం డ్యాం నిర్మాణం పూర్తి కావాలి, డ్యాంలో నీటిని నిల్వ చేసుకోవాలి, గోదావరి డెల్టా ఆయకట్టు కింద ఉన్న భూములకు రెండు పంటలకు నికరంగా నీరందాలి.
మరి పోలవరం డ్యాం పూర్తయ్యేదెన్నడు? ఈ ప్రశ్నను గూగుల్ వారి ‘జెమిని ఏఐ’ టూల్ను అడిగాను. ఈ కృత్రిమ మేధ నన్ను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు 2024 నవంబర్ 5న జరిపిన పోలవరం ప్రాజెక్టు సమీక్షా సమావేశానికి తీసుకువెళ్లింది. ‘ది హిందూ’ దినపత్రికలో ఆనాటి సమావేశం ఫొటో సహా అచ్చైన వార్తను ఉటంకించింది. ఆనాటి సమీక్షా సమావేశంలో చంద్రబాబు పోలవరం డ్యాం పూర్తి చేయడానికి స్పష్టమైన టైంలైన్ను నిర్దేశించినట్టుగా తెలుస్తున్నది.
దాని ప్రకారం డిసెంబర్ 2027 నాటికి డ్యాం నిర్మాణం పూర్తి కావాలి. మార్చి 2028లో ప్రాజెక్టును కమిషన్ చేయడానికి సిద్ధం చేయాలి. సరే.. పోలవరం పూర్తి కావడానికి, మేడిగడ్డ మరమ్మతులకు ఏమిటి సంబంధం? అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందని నాకు తెలుసు. దానికి కొంత పరిశోధన చేస్తే ‘జెమినై కృత్రిమ మేధ’ నన్ను ‘ధవళేశ్వరం బ్యారేజి’పై వికీపీడియా పేజీ దాకా తీసుకువెళ్లింది.
ఈ పేజీలో ఏమున్నదో తెలుసుకునే ముందు మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ కోసం ఎన్డీఎస్ఏ ఏమి సిఫారసులు చేసిందో తెలుసుకుందాం. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు మొదట నిపుణులతో సమగ్రమైన భూభౌతిక పరీక్షలు జరిపి, ఆ పరీక్షల ఫలితాల ఆధారంగా డిజైన్లు రూపొందించి, వాటి ఆధారంగా బ్యారేజీ పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలని ఎన్డీఎస్ఏ సిఫారసు చేసి రెండేండ్లు గడిచాయి. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వారి చేత బ్యారేజీ వద్ద భూభౌతిక పరీక్షలు జరిపించాలని చాలాకాలం కిందనే నిర్ణయం జరిగినట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ పరీక్షలు మాత్రం చేపట్టిన జాడ లేదు.
అయితే, ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనం (23-02-2026) ప్రకారం భూభౌతిక పరీక్షల నివేదికలను డిజైన్లను రూపొందించడానికి ఎంపిక చేసిన ముంబై సంస్థ ‘ఆప్రీ ఇండియా’ వారికి అప్పజెప్పాలి. వారు ఈ నివేదికలను విశ్లేషించి తగిన విధంగా డిజైన్లను రూపొందించాలి. ఈ డిజైన్లను ఆమోదం కోసం కేంద్ర జల సంఘానికి పంపించాలి. ఆ తర్వాతనే బ్యారేజీలను నిర్మించిన ఏజెన్సీలు మరమ్మతులు చేపడతాయి. అయితే, ఈ మరమ్మతులు ప్రభుత్వ ఖర్చుతోనా? లేక ఏజన్సీలే భరిస్తాయా అనే వివాదం ఇంకా ఒక కొలిక్కి రావలసి ఉన్నది. మేడిగడ్డ మరమ్మతులకు సుమారు రూ.500 కోట్లు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో లీకేజీలను అరికట్టడానికి సుమారు రూ.100 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా.
ఇప్పుడు ధవళేశ్వరం వికీపీడియా పేజీలో ఏమి రాసుకున్నారో చూద్దాం. ఆ పేజీ చివరలో వారు Inadequate water inflows అనే సబ్ హెడ్ కింద నమోదు చేసిన వాక్యాలను యథాతథంగా కింద ఉటంకిస్తున్నాను.‘During the rabi season of 202223, adequate water is not supplied to the canals due to a lack of sufficient water inflows into the reservoir as sufficient water had not been stored earlier in the upstream Polavaram reservoir. The natural flows normally available during the dry season in the Godavari River are being stored in Medigadda and Sammakka Sagar reservoirs which used to be available for use in Godavari Delta. To build up the water level/storage in the Polavaram reservoir to enable adequate water release downstream, water is released from the Donkarayi reservoir directly without using it for power generation in the lower Sileru power station.[5] At least 60 tmc ft water storage is needed in the Polavaram reservoir or up to the safe level limit of the upper coffer dam of the Polavaram Project to supply water to the total cropped area during the rabi season. ఆసక్తి ఉన్న వారు ఈ https://en.wikipedia. org/wiki/Dowleswaram_Barrage లింక్ ద్వారా ధవళేశ్వరం బ్యారేజీ వికీపీడియా పేజీని ఇప్పటికీ చూడవచ్చు. వాళ్లకు ఎంత స్పష్టత ఉందో చూడండి. 2022-23 రబీ సీజన్లో, పోలవరం జలాశయంలో ముందస్తుగా తగినంత నీటిని నిల్వ చేయకపోవడం వల్ల గోదావరి డెల్టా కాలువలకు తగినంత నీరు సరఫరా చేయడం సాధ్యం కాలేదు. సాధారణంగా వేసవి కాలంలో గోదావరి నదిలో లభించే సహజ ప్రవాహాలను మేడిగడ్డ, సమ్మక్క సాగర్ రిజర్వాయర్లలో నిల్వ చేస్తున్నారు. ఈ నీరు గతంలో గోదావరి డెల్టాలో వినియోగానికి అందుబాటులో ఉండేది.
రబీ సీజన్లో మొత్తం డెల్టా సాగు విస్తీర్ణానికి నీటిని సరఫరా చేయడానికి పోలవరం రిజర్వాయర్లో కనీసం 60 టీఎంసీల నీటి నిల్వ లేదా పోలవరం ప్రాజెక్టు ఎగువన కాఫర్ డ్యాంకు చెందిన సురక్షిత మట్టం వరకైనా నీరు నింపడం అవసరమని వారికి నిశ్చితంగా తెలుసు. రబీ పంట కాలానికి గోదావరి డెల్టాకు రావలసిన గోదావరి ప్రవాహం తెలంగాణలో మేడిగడ్డ బ్యారేజీలో, సమ్మక్క బ్యారేజీలో నీటిని ఆపుకుంటున్నందు వలన రబీ పంట కాలానికి గోదావరి డెల్టాకు నీటి సరఫరా కష్టం అవుతున్నది. కనుక పోలవరం డ్యాంలో నీటి నిల్వ తప్పనిసరి అని ఆ పేరాలో రాసుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిపై శ్రీరాంసాగర్, ధవళేశ్వరం బ్యారేజీ మధ్యన 600 కిలోమీటర్ల పొడవునా తెలంగాణలో మరే ఆనకట్ట/బ్యారేజీ నిర్మించకపోవడానికి కారణం..నిరాటంకంగా గోదావరి ప్రవాహాలు ధవళేశ్వరం బ్యారేజీకి, అక్కడి నుంచి కాలువల ద్వారా గోదావరి డెల్టా ఆయకట్టుకు నీరు తరలిపోవాలి. ఆ ఆకాంక్షల నుండే ఈ పాట పుట్టింది.
‘గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి’ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టారు. నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. జల సంకల్పం తీసుకొని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. నెర్రెలు వారిన నేలలకు గోదావరి జలాలను పారించారు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ నీటిపారుదల రంగాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దారు. అపర భగీరథుడిగా రైతుల కన్నీళ్లు తుడిచి, కాలువల్లోకి నీళ్లు ప్రవహింపజేశారు. ఆంధ్రా జల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, తెలంగాణ హక్కులను పరిరక్షించారు. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో గోదావరి నదిపై 7 బ్యారేజీలను నిర్మించింది. తెలంగాణకు స్వర్ణయుగంగా నిలిచిన కేసీఆర్ పాలనలో బ్యారేజీల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసుకొని రికార్డులు సృష్టించింది.
నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి సీతమ్మసాగర్ బ్యారేజి వరకు గోదావరి నది పొడవు సుమారు 500 కి.మీ. అందులో ఈ బ్యారేజీల కారణంగా 312 కి.మీ. పొడవునా 365 రోజులూ నీరు నిలువ ఉంటుంది. గోదావరి నదిపై 190.39 టీఎంసీల నిల్వ సాధ్యపడుతున్నది. గోదావరి నది సజీవం అవుతున్నందున ఉత్తర తెలంగాణ రూపురేఖలు మారబోతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో వ్యవసాయ, మత్స్య, టూరిజం, జల రవాణా వంటి రంగాల్లో అనూహ్యమైన ఆర్థిక ప్రగతి జరుగనున్నది. బయోడైవర్సిటీ పెంపొందనున్నది. ఇవిగాక ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగ నదిపై చనాక-కొరాట బ్యారేజీ (1.50 టీఎంసీ) కూడా నిర్మించింది. అంటే గడచిన పదేండ్లలో గోదావరి బేసిన్లో 8 బ్యారేజీల నిర్మాణం జరిగింది.
డెల్టా రైతుల మితిమీరిన నీటి వినియోగం: గోదావరి, కృష్ణా డెల్టా రైతులు ఇంకా ఒక టీఎంసీకి సాగు చేస్తున్న భూమి 3 వేల ఎకరాలు మాత్రమే. నిజానికి ఒక టీఎంసీకి 10 వేల ఎకరాల్లో వరి కూడా సాగుబడి సాధ్యమవుతుంది. తెలంగాణలో శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్ ఆయకట్టులో వారబందీ (on & off), కింద నుండి పైకి (tail to head) నీటి సరఫరా పద్ధతులు అమలు చేసి ఒక టీఎంసీకి 10 నుండి 13 వేల ఎకరాల సాగుబడిని రైతులు సాధించారు. ఆంధ్రాలో ఇంకా వరిసాగుకు డ్యూటీ (Duty) ఒక టీఎంసీకి 3, 000 ఎకరాలు మాత్రమే అమల్లో ఉన్నది.
ఇది విలువైన నీటిని దారుణంగా వృథా చేయడమే కాదు, నేరపూరితం కూడా. గోదావరి డెల్టాకు ఆయకట్టుకు 225 టీఎంసీల కేటాయింపులు ఉంటే వారు ఏటా 300350 టీఎంసీల జలాలను మళ్లించుకుంటారు. ఈ జల దోపిడీకి అలవాటుపడిన వలసవాదులు తెలంగాణలో గోదావరిపై బ్యారేజీల నిర్మాణాన్ని, తద్వారా వ్యవసాయ రంగంలో సాధించిన ఈ అభివృద్ధిని సహించలేకున్నారు. గతంలో రబీలో పుష్కలంగా అందే గోదావరి నీరు ఈ బ్యారేజీల కారణంగా అందకుండా పోయిందని వారి బాధ. పోలవరం నిర్మాణం పూర్తయి, నీటి నిల్వ సాధ్యం అయ్యేదాకా వారికి రబీ పంట కాలానికి నీరు అందే పరిస్థితి ఉండదు.
అందుకే మేడిగడ్డ బ్యారేజీలో వరదలు లేని సమయంలో మూడు పిల్లర్లు కుంగాయి. అది ప్రమాదకర కట్టడాల జాబితాలోకి చేరింది. బ్యారేజి గేట్లను బార్లా తెరిచేశారు. ఇక సమ్మక్క బ్యారేజీలో ఛత్తీస్గఢ్ అభ్యంతరాలను చెప్పి పూర్తిస్థాయి నీటిమట్టం 83 మీటర్ల వరకు నింపడం లేదు. ఇప్పుడు రెండు బ్యారేజీల గేట్లు తెరిచే ఉంటున్నాయి. గోదావరి నీరు నిరాఘాటంగా కిందకు ప్రవహిస్తూనే ఉన్నది. అంటే పోలవరం డ్యాం పూర్తయి, నీటి నిల్వ సాధ్యం అయ్యేదాకా మేడిగడ్డ పునరుద్ధరణ కానే కాదని రూడీ అవుతున్నది. ఆంధ్రజ్యోతి వార్తా కథనం (23-02-2026) దానిని ధృవీకరించింది.
పోలవరం డ్యాం పూర్తి కావడానికి నిర్దేశించిన టైమ్లైన్, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల టైమ్లైన్ సరిపోలాయి. తెలంగాణ రైతాంగం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పంపుల నుంచి నీటి కోసం 2028 వానాకాలం వరకు ఆగవలసిందే. ఇన్నాళ్లూ బంగారు పంటలు పండేవి ఎక్కడో, మురిపాల ముత్యాలు దొరలిందెక్కడో మనకు తెలియనిది కాదు. కేసీఆర్ పాలనలోనే కదా తెలంగాణలో బంగారు పంటలు పండడం, మురిపాల ముత్యాలు దొరలడం మొదలయ్యింది. ఆ జీవధారను తెలంగాణకు అందకుండా జరుపుతున్న కుట్రలో భాగమే మేడిగడ్డ మరమ్మతులను చేపట్టడంలో జాప్యం.
వ్యాసకర్త: విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్

-శ్రీధర్రావు దేశ్పాండే