నమ్మకం, పరస్పర ప్రయోజనం ప్రాతిపదికగా బీమా రంగంలో రారాజుగా వెలుగుతున్న ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రమాదపుటంచుకు చేరుకున్నది. సమాజానికి భరోసానిస్తున్న ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయటానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో స్వదేశీ, విదేశీ రాబందులు దాన్ని కబళించడానికీ తాపత్రయపడుతున్నాయి.
ప్రపంచమంతా రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంతో బాంబుల మోతలు వినిపిస్తుంటే, ఫిబ్రవరి 26న మోదీ ప్రభుత్వం లాభాల బాటన నడుస్తున్న ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినిస్తూ అతిపెద్ద బాంబును పేల్చింది. పాలసీదారులకు నిరంతరం అందించే సేవలో మచ్చలేని సేవా రికార్డు ఎల్ఐసీ కలిగి ఉన్నది. దేశాభివృద్ధికి జీవనరేఖగా సేవలందిస్తున్న ఈ సంస్థను ప్రైవేట్పరం చేయబూనటం గర్హనీయం. కేంద్ర ప్రభుత్వం ఆర్థికవ్యవస్థలో ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి వనరుల సేకరణ పేరుతో ఎల్ఐసీని ప్రైవేటుకు అప్పగించేందుకు ఉబలాటపడుతున్నది.
తొలి అడుగుగా ఈ మార్చిలో పబ్లిక్ ఆఫర్ కోసం స్టాక్ మార్కెట్లో ప్రవేశిస్తున్నది. మొదటగా 10 శాతం షేర్లు ప్రాథమిక మార్కెట్లో పెట్టి రూ.లక్ష కోట్లు సేకరించే పనిలో కేంద్రం ఉన్నది. ఇప్పుడు ఐపీఓలో ఎఫ్డీఐలకు అనుమతి మంజూరు చేసింది. 1991లో ప్రారంభమైన ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలకు 30 ఏండ్లు నిండాయి. విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచిన ఈ కాలంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలు చాలావరకు ప్రైవేట్ పరమయ్యాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేశ ఆర్థికాభివృద్ధిలో తన వంతు పాత్ర నిర్వహిస్తూ నిలదొక్కుకున్న ఏకైక సంస్థ ఎల్ఐసీ.
1956 సెప్టెంబర్ 1న 243 చిన్నచిన్న బీమా కంపెనీల విలీనం ద్వారా ఎల్ఐసీ ఏర్పడింది. 1991వరకూ కూడా బీమారంగంలో ఎల్ఐసీ దేశంలో అత్యధిక సేవలందిస్తూ తిరుగులేని శక్తిగా ఉన్నది. నేడు ఎల్ఐసీ 4,932 కార్యాలయాలు, 2,65,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్నది. గత 24 ఏండ్లుగా ఎల్ఐసీ పురోగతిలో చోదకశక్తిగా నిలుస్తున్న 12 లక్షల ఏజెంట్లను కలిగి ఉన్నది. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, సౌదీ అరేబియా, కువైట్, సింగపూర్ మొదలగు దేశాల్లో కూడా ఎల్ఐసీ సేవలందిస్తున్నది. 40 కోట్లకు పైగా పాలసీ దారులను కలిగి ఉన్నది. రూ.38 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఉన్న భారతదేశపు మొదటి సంస్థగా నిలిచింది. 65 ఏండ్ల నుంచి దేశాభివృద్ధిలో రూ. 36 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది. వీటిలో 82 శాతం నిధులను ప్రభుత్వ ఆధీనంలోని సెక్యూరిటీ, మౌలిక రంగాల్లోనే పెట్టుబడిగా పెట్టింది.
1956లో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లను డివిడెండ్ రూపంలో ఎల్ఐసీ తిరిగి చెల్లించింది. మార్కెట్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టిన సంస్థగా చరిత్రకెక్కింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నప్పుడు కూడా ప్రజల సంపద ఆవిరి కాకుండా అనేకసార్లు ఆదుకున్నది. గృహ నిర్మాణం సాగు, తాగునీరు సౌకర్యాలు, విద్యుత్తు, రహదారులు వంటి అనేక మౌలిక సౌకర్యాల కల్పనలో ఎల్ఐసీ సంపద వినియోగపడింది.
పాలసీదారుల డబ్బుతోటే ఎల్ఐసీ విస్తరణ, అభివృద్ధి సాధ్యమైంది. 2014 వరకు బీమా రంగంలో 95.29 శాతం వాటా ఎల్ఐసీ కలిగి ఉన్నది. మోదీ ప్రభుత్వం బీమా రంగంలోనూ ప్రైవేటు కంపెనీలకు అనుమతి ఇవ్వటంతో బీమా సేవల మార్కెట్లో ఎల్ఐసీ వాటా 66 శాతానికి పడిపోయింది. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.4 లక్షల కోట్ల పైచిలుకు వ్యాపారం నిర్వహించింది. పెట్టుబడుల నుంచి రూ. 2.72 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇలా ఏటా 3 నుంచి 4 లక్షల కోట్ల పెట్టుబడి మిగులును సృష్టించుకుంటున్నది. ఇదే కార్యశీలతతో ఎల్ఐసీ పనిచేస్తే రాబోయే పదేండ్లలో ఏటా 20 నుంచి 30 శాతం పెరుగుదలను నమోదు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయటం తీవ్ర నష్టదాయకం.
ఏ ఒక్క ప్రభుత్వరంగ సంస్థను తన పాలనా కాలంలో ఏర్పాటుచేయని మోదీ ప్రభుత్వం, ఉన్నవాటిని మాత్రం కారుచౌకగా కార్పొరేటు కంపెనీలకు కట్ట బెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. మొదటినుంచీ ఎల్ఐసీని బలహీన పర్చేందుకు బీజేపీ కుయుక్తులు పనుతున్నది. ఎల్ఐసీతో పాటు పలు స్వదేశీ, కార్పొరేట్ బీమా సంస్థలలో 26 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వాజపేయి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టాటా బీమాలో అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్ (ఏఐజీ); ఐసీఐసీఐలో పృడెంట్; హెచ్డీఎఫ్సీలో వాటా పొందిన స్టాండర్డ్ లైఫ్ సంస్థలు ఈ కోవకు చెందినవే.
మోదీ ప్రభుత్వం 2015లో దేశీయ బీమా సంస్థల్లో 49 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించటానికి చట్టాన్ని సవరించింది. దీన్ని 74 శాతం పెంచడానికి 2019లో మరొకసారి చట్టాన్ని సవరించింది. కార్పొరేషన్గా ఉన్న ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ అధికారం ప్రభుత్వానికి లేదు.
ఎల్ఐసీ ప్రైవేటుపరం అయితే ప్రజలు పొదుపు చేసిన డబ్బుపై విదేశీ పెట్టుబడిదారుల పెత్తనం ఏర్పడుతుంది. ప్రజల సాంఘిక అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రజా సంక్షేమం కొరవడుతుంది. బీమా ప్రీమియం ఎక్కువై, లాభాలు తగ్గిపోయి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండదు. ఎంతో భరోసాతో బీమా, పింఛన్ ఫండ్స్లో చేరిన సాధారణ మధ్యతరగతి ప్రజలకు గడ్డు కాలం ఏర్పడుతుంది. బీమా రంగాన్ని ప్రజలపరం చేసిన నేతల కృషి మరుగునపడిపోతుంది. ఇకనైనా మేల్కొని మోదీ ప్రజావ్యతిరేక విధానాలను నిలువరించే మహోద్యమంలో భాగస్వాములం కావాలి.
(వ్యాసకర్త: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, ఉపాధ్యక్షులు)
– అస్నాల శ్రీనివాస్
96522 75560