ఆయన కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఎలక్ట్రానిక్స్ రంగ దిగ్గజ కంపెనీల సీఈఓలతో సంభాషించేటప్పుడు ఫ్యాబ్ల గురించి అనర్ఘళంగా మాట్లాడతారు. సరిగ్గా గంట తర్వాత లైఫ్ సైన్సెస్ రౌండ్ టేబుల్లో పలురకాల వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్, డిజిటల్ డ్రగ్ డిస్కవరీ గురించి అలవోకగా ప్రసంగిస్తారు. కాసేపటికి ప్రపంచంలోనే అతిపెద్ద చేపల ఎగుమతి కంపెనీతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఆవిష్కారం అవుతున్న బ్లూ రెవల్యూషన్ గురించి చెప్తూ నోరూరేలా తిలాపియా చేపల రుచి గురించి కబుర్లు చెప్తారు. ఒక మీటింగ్ నుంచి మరో మీటింగుకు పరుగులు తీసే క్రమంలో లంచ్ చేసే సమయం లేక దారిలో కారులోనే సాండ్ విచ్ తినేసి తదుపరి మీటింగుకు పయనమవుతారు.
ఆ సవ్యసాచే కేటీఆర్! తెలంగాణకు ఆయనొక ట్రంప్ కార్డ్! నిజంగా కేటీఆర్ వచ్చాక విదేశీ పర్యటనల అర్థం మారిపోయింది. అంతకుముందు రాజకీయ నాయకుల విదేశీ పర్యటనలంటే ఒకటీ అరా అధికారిక సమావేశాలు జరిపి, మిగతా సమయమంతా తీరికగా కాలక్షేపం వ్యవహారాలుండేవి. కానీ తెలంగాణ ఏర్పడినాక 2015 మే నెలలో కేటీఆర్ నాయకత్వంలో తొలి డెలిగేషన్ అమెరికా పర్యటనకు వెళ్లి ఒక నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. అప్పుడు అదొక సంచలనం. అమెరికాలోని దిగ్గజ కంపెనీల నాయకత్వాన్ని కలిసి నూతన రాష్ట్రమైన తెలంగాణను వారికి పరిచయం చేస్తూ, ఇక్కడి ప్రగతిశీల ప్రభుత్వ విధానాలను వారికి వివరిస్తూ సాగిన కేటీఆర్ పర్యటన అనేక విజయాలను నమోదుచేసి పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచింది. ఆ పర్యటన పర్యవసానంగా అనేక కంపెనీలు మన రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి.
ఈ సారి కూడా కేటీఆర్ అమెరికా పర్యటన మన రాష్ర్టానికి పెట్టుబడుల వెల్లువ సృష్టించింది. రు.7500 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ వివిధ ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ముందుకువచ్చాయి. మరిన్ని అమెరికన్ కంపెనీలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయి.
‘నాకు కేటీఆర్ ఎవరో తెలియదు. కానీ ఒక యువ భారతీయ రాజకీయ నాయకుడు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచాన్ని చుట్టిరావడం ఎంతో సంతోషకరం. అమెరికాలో ఒకవారం పర్యటనలో 35 సమావేశాలు జరిపి 7500 కోట్ల పెట్టుబడులను రాబట్టడం నిజంగా అద్భుతం!’ ఈ మాటలన్నది ఎవరో కాదు. 90 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన ప్రఖ్యాత అమెరికన్ వార్తా పత్రిక న్యూస్ వీక్ ఆసియా విభాగం ఎడిటర్ డానిష్ మంజూర్ మంత్రి కేటీఆర్ను ప్రశంసిస్తూ ట్విటర్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ ప్రసంగించిన తర్వాత ఎవరైనా ప్రసంగించాలంటే కష్టమే! అతనొక చక్కటి వక్త. బహుభాషల్లో ప్రసంగించగలడు. సభికులను ఇట్టే ఆకట్టుకుంటాడు సాక్షాత్తూ భారతీయ వ్యాపార దిగ్గజం విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ కేటీఆర్కు ఇచ్చిన కితాబు ఇది. కేటీఆర్ నిజంగా తెలంగాణ కోసం గొప్పగా పనిచేస్తున్నారు. తనలాగా నూతన అలోచనలను స్వాగతిస్తూ క్రియాశీలకంగా ఉండే నాయకులు ఈ దేశానికి అవసరం. కేటీఆర్ నిజమైన నాయకుడు! అంటూ రాజేశ్ రైనా అనే కష్మీరీ జర్నలిస్ట్ మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు.
‘విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు రోజుకో, రెండు రోజులకో ఒక సమావేశం జరిపి, మిగతా సమయం సైట్ సీయింగ్ కోసం కేటాయించే ప్రభుత్వ బృందాలనే చూశాను నేను. కానీ కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ అధికారిక డెలిగేషన్ రోజుకు 8 నుంచి 10 సమావేశాలు హాజరుకావడం, క్షణం తీరిక లేకుండా ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి, రాత్రి డిన్నర్ వరకూ విరామం లేకుండా పనిచేయడం ప్రత్యక్షంగా చూశాను నేను’ అన్నాడొక ఆంధ్రా ప్రాంత ఎన్నారై.
ముఖ్యంగా వేల మైళ్ల దూరాన ఉండి నిత్యం తెలంగాణ కోసం పరితపించే ప్రవాస తెలంగాణ మిత్రుల గురించి ఒక మాట చెప్పుకోవాలి. విదేశాల్లో స్థిరపడినా ఏ రాష్ట్ర వాసులకూ లేనటువంటి ప్రత్యేక పేగుబంధం తెలంగాణ ప్రవాసులకు ఉన్నది. నాడు ఉద్యమంలో, నేడు తెలంగాణ పునర్నిర్మాణంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. స్వరాష్ట్రం నుంచి కేటీఆర్ నేతృత్వంలో ఒక బృందం అమెరికాకు వస్తున్నదని తెలిసిన మరుక్షణం నుంచి వారి ఆనందం వర్ణనాతీతం. ప్రతి పట్టణంలో మంత్రి కేటీఆర్కు వారు ఘనస్వాగతం పలికారు. అనుక్షణం మా బృందాన్ని కంటికిరెప్పలా చూసుకున్నారు. మాకే అవసరం వచ్చినా క్షణాల్లో సమకూర్చారు. ఇదంతా చూసిన పొరుగు రాష్ట్రం లో పుట్టి పెరిగిన మా బృంద సభ్యుడు ఒకరు మీ తెలంగాణ ప్రవాసులకు నిజంగా రాష్ట్రం అంటే ఉన్న ప్రేమ వెలకట్టలేనిది అని కితాబిచ్చాడు. ఒకనాడు రాత్రీ పగలూ తేడా లేకుండా పుట్టినగడ్డ విముక్తి కోసం తమవంతుగా సహకారం అందించిన తెలంగాణ బిడ్డలు నేడు స్వరాష్ట్రం నమోదు చేస్తున్న విజయ పరంపరను మంత్రి కేటీఆర్ నోటివెంట విని కరతాళధ్వనులతో స్వాగతించారు.
తెలంగాణ ఆత్మగల్ల నాయకత్వం ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు ఎట్లా నెరవేరుతాయో కేటీఆర్ కార్యాచరణను పరిశీలించిన ఎవరికైనా అలవోకగా అర్థమవుతుంది. మిమ్మల్ని పాలించే నాయకులున్నారా? అని ఎద్దేవా చేసిన గడ్డమీదనే ఎదిగివచ్చిన యువ నాయకత్వం అంతర్జాతీయ యవనిక మీద మన జెండాను సగర్వంగా ఎగురవేస్తుంటే ప్రతి తెలంగాణ బిడ్డ గుండె ఆనందంతో ఉప్పొంగుతున్నది.
ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్తో మొదలుపెట్టిన ఆయన దినచర్య రాత్రి 10 గంటలకు స్థానిక భారతీయ సంతతికి చెందిన వందలాది ఎన్నారైలతో మీట్ ఎండ్ గ్రీట్తో ముగుస్తుంది. అప్పటికే 12 గంటల పాటు నాన్స్టాప్ సమావేశాలు నిర్వహించినా కూడా కించిత్ అలసట కనబడకుండా వేదిక ఎక్కి ఏడేండ్ల కిందటి పసికూన తెలంగాణను పరిచయం చేయడానికి వచ్చానని మొదలుపెట్టి, ఇవ్వాళ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ విజయగాధను సగర్వంగా, సోదాహరణంగా, సాధికారంగా ప్రకటిస్తారు!
లాస్ ఏంజిల్స్లో కేటీఆర్ ప్రసంగం విన్న తమిళనాడుకు చెందిన ఒక ప్రవాస భారతీయుడు, ‘నేనిక్కడ రెండు దశాబ్దాలుగా ఉన్నాను. కానీ ఏనాడూ ఒక రాష్ట్ర మంత్రి ఇంత పకడ్బందీ వ్యూహంతో, సమర్థవంతమైన టీంతో, ప్రణాళికాబద్ధమైన సమావేశాల కోసం అమెరికా రావడం చూడలేదు. మీ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు’ అన్నాడు.
– కొణతం దిలీప్