ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ‘ప్రజాస్వామ్యానికి ప్రజలే కర్త, కర్మ, క్రియ’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నిర్వచించారు. కానీ, ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, వారి సంరక్షణ కోసం పని చేస్తున్నాయా? అంటే లేదనే చెప్పాలి.
ఎన్నికల ప్రక్రియలో విజయం సాధించిన పార్టీ, నాయకులు, ప్రజా సంక్షేమం కన్నా వారి పార్టీని అధికారంలో నిలబెట్టుకోవడానికే పూర్తి పదవీకాలం సరిపోతున్నది. దీన్నిబట్టి చూ స్తే పాలకులు ప్రజా సంరక్షణకు మించి తమ పార్టీ సంరక్షకులుగా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ డబ్బు, శ్రమను దుర్వినియోగం చేస్తున్నారు. మధ్యయుగాల నాటి రాచరిక వ్యవస్థను వదిలించుకొని, ఆధునిక యుగ విధానమైన ప్రజాస్వామ్యాన్ని పలు దేశాలు ఆవాహనం చేసుకున్నాయి. కానీ నేటికీ కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలు రాచరిక వ్యవస్థలకు నకళ్లుగా మిగిలిపోయి విమర్శల పాలవుతున్నాయి. ముఖ్యంగా వలస దేశాలైన భారత దేశం వంటి మూడవ ప్రపంచ దేశాలు పేరుకు ప్రజాస్వామ్యాలైనా ఆధునిక చట్టాల అమలు విషయంలో యూరోప్ దేశాల కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. దేశ చట్టాల కంటే వ్యక్తులు, నాయకులు సర్వోన్నతులం, అధికులం అనుకునే అహంకార ధోరణులకు ఇక్కడి వ్యక్తులు దూరం కాలేకపోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చరిత్ర ఎన్నిసార్లు చెప్పుకొన్న తనివితీరేది కాదు. సాధ్యమో, అసాధ్యమో అని కాకుండా దశాబ్దాల పోరాటం, వేల ఆత్మల బలిదానం, పుట్టిన గడ్డపైనే రెండవ తరగతి పౌరులుగా ఎదుర్కొన్న వివక్ష, మరొక వైపు, నీళ్లు, నిధులు, నియామకాలంటూ ప్రతి కనీస అవసరాలకు దేహి అని దేబిరించుకునే పరిస్థితి నుంచి ఒక్కసారి నాలుగు కోట్ల ప్రజల ఆశయానికి రూపుదాల్చిన ఉద్విగ్న క్షణాలు దాటుకొని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తదనంతర దశాబ్ద కాలంలో శతాబ్ద కాలపు అభివృద్ధిని సంక్షేమ ఫలాలను అందించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్. ప్రాణాలకు తెగించి ఉద్యమం ముందు వరుసలో ఉండి నడిపించడమే కాదు, ఉద్యమ అనంతరం కూడా విజయవిహారం చేసి, రాష్ట్ర రథసారథిగా పగ్గాలు చేపట్టారు.
గతం ఎంతో వైభవం కాదు, ప్రస్తుతం ఎంతో ఉన్నతమైనదిగా ఆచరించి చూపిన దార్శనికుడు, మహా మేధావి, కార్యదీక్షాపరుడు, విజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ప్రతి గొప్ప నాయకుని తర్వాత ఎవరనే మీమాంస ప్రజల్లో రాజకీయ విశ్లేషకుల్లోనే కాదు, ప్రత్యర్థుల్లో కలగడం సర్వసాధారణం. కానీ, తెలంగాణ రాష్ర్టానికి ఎలాంటి భయం లేదు. మరో ముప్ఫై ఏండ్లు ఈ రాష్ర్టాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టించగలిగే నాయకులు మనకు సిద్ధంగా ఉన్నారు. సీఎం కేసీఆర్కు భౌతిక వారసులుగానే కాక, రాజకీయంగా వ్యవహార దీక్షాపరంగా, మేధోపరంగా మరెన్నో కల్వకుంట్ల తారకరామారావు ఆయనకు వారసునిగా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సంక్షోభం రాదని రాజకీయ విశ్లేషకుల నిర్ధారణ ఎందుకంటే పదేండ్లలో ఎంతో అభివృద్ధిని సాధించి చూపించారు సీఎం కేసీఆర్. అయితే ఆయన విజయాల్లో సింహభాగం కేటీఆర్కే దక్కుతుంది.
జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలను రాష్ర్టాభివృద్ధికి అనుగుణంగా మలుచుకుంటూ రాష్ట్ర ప్రగతి, అభివృద్ధే ధ్యేయంగా కేటీఆర్ తన నడకను నిత్యం పర్యవేక్షించుకుంటున్నారు. అమెరికాలో ఉన్నతోద్యోగం చేసి అక్కడ సాధారణ జీవితాన్ని అనుభవించిన కేటీఆర్ రాష్ర్టాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇప్పుడు రాష్ర్టాన్ని నైతిక విలువల వైపు నడిపించాలనే సదుద్దేశంతో రానున్న ఎన్నికల్లో తాను డబ్బు, మద్యం వంటి ప్రలోభాలతో ప్రజల వద్దకు వెళ్లనని, ఈ విషయంలో తనతో సహకరించే నాయకుడెవరైనా ముందుకువచ్చి ప్రతిజ్ఞకు సిద్ధమైతే నూతన రాజకీయాలకు రాష్ర్టాన్ని వేదికగా సిద్ధం చేయగలననే ధీమాను కేటీఆర్ వ్యక్తం చేశారు.
‘విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదు, అభివృద్ధి చేసి చూపించడమే సరైన జవాబు’ అని నిరూపించడానికి కేటీఆర్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అద్భుత భావాలున్న భవిష్యత్తు యువ నాయకుడిని సవాల్ రూపంలో కేసీఆర్ మన ఎదురుగా ఉంచారు! విజ్ఞుడైన నాయకుడు కేటీఆర్ విసిరిన సవాల్ను ప్రతి ఒక్కరూ అభినందించక తప్పదు.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)
-సీహెచ్ ఉపేంద్ర
99632 02547