హిందీ బెల్టులోని రాష్ర్టాల ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఎన్డీయే ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి యుద్ధానికి ముందే చతికిలపడింది. కాంగ్రెస్ పట్ల భాగస్వామ్య పక్షాల అసంతృప్తి కారణంగా అసలుకే ఎసరు వచ్చింది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడంతో సార్వత్రిక పోరుపై దృష్టి పెట్టిన కాంగ్రెస్పై ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు గుర్రుగా ఉన్నాయి. ప్రధాన పక్షాల అసమ్మతి కారణంగా కూటమి సమావేశం వాయిదా వేయాల్సి వచ్చింది. పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీశ్కుమార్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితర నేతల అసంతృప్తే అందుకు కారణం. కూటమి కో-ఆర్డినేషన్ కమిటీలో ప్రధాన భూమిక పోషిస్తున్న వీరంతా డుమ్మా కొట్టనున్నట్టు తాఖీదులు ఇవ్వడంతో సమావేశం వాయిదా పడింది.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. కీలక రాష్ర్టాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో చతికిలపడ్డ కాంగ్రెస్ ఆగమేఘాల మీద ఇండియా కూటమిపై దృష్టిసారించింది. దీంట్లో భాగంగానే ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. కానీ ఈ సమావేశం గురించి కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు ముందస్తుగా కనీస సమాచారం ఇవ్వకపోవడంతో అవి కాంగ్రెస్పై మండిపడుతున్నాయి. ముందస్తుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆరోగ్యం సహకరించడం లేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్.. సాకుగా చూపి సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తమిళనాడులో వరదల కారణంగా ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్, వ్యక్తిగత కారణాల వల్ల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సమావేశానికి అందుబాటులో ఉండటం లేదు. కీలక నేతల గైర్హాజరీ కారణంగా కాంగ్రెస్ సమావేశాన్ని వాయిదా వేయక తప్పలేదు.
అయితే కీలక నేతల అసమ్మతికి పలు కారణాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడల కారణంగానే ప్రాంతీయ పార్టీలు కూటమికి దూరమవుతున్నట్టు తెలుస్తున్నది. సమావేశం గురించి తనకు సమాచారం లేదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించడమే అందుకు ఉదాహరణ. తాజాగా జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఖరిపై మమతా బెనర్జీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలతో సీట్ల సర్దుబాటు గురించి ఆమె వ్యాఖ్యానించారు. ఆయా రాష్ర్టాల ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను విస్మరించిన కాంగ్రెస్ బొక్కబోర్లా పడింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లోని అనేక స్థానాల్లో ఓటమి అంతరం చాలా తక్కువగానే ఉన్నది. ప్రాంతీయ పార్టీలు ఓట్లు చీల్చడంతోనే ఆయా స్థానాలు బీజేపీ వశమయ్యాయి. ప్రాంతీయ పార్టీలతో సీట్ల సర్దుబాటులో విఫలమైన కాంగ్రెస్ చాలాచోట్ల వారిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఏకంగా 20 స్థానాల్లో ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. సీట్ల సర్దుబాటు గురించి అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ కాంగ్రెస్కు ముందుగానే సూచించారు. అయినా వారి ప్రతిపాదనలను కాంగ్రెస్ పెడచెవిన పెట్టింది. దీంతో కాంగ్రెస్కు భాగస్వామ్య పక్షాలకు మధ్య అంతరం పెరిగింది.
ఇండియా కూటమి ప్రధాన ఉద్దేశమైన ఎన్డీయే ఓటమి దిశగా ప్రణాళికలు రూపొందించడంలో కాంగ్రెస్ విఫలమైందని భాగస్వామ్య పక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఐదు రాష్ర్టాల ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన హస్తం.. కూటమి కార్యాచరణను పూర్తిగా పక్కకు పెట్టేసింది. ముంబైలో చివరిసారిగా సమావేశమైన కూటమి కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఇప్పటివరకు మరోసారి సమావేశం కాలేదు. ఇది అసంతృప్తికి మరో కారణం.
మరో నాలుగైదు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నప్పటికీ సీట్ల సర్దుబాటు, కార్యాచరణపై ఎటువంటి ముందడుగు పడలేదు. ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమాలోచనలు జరగలేదు. దీంతో ప్రాంతీయ పార్టీల నేతలు కాంగ్రెస్తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
తాజా ఎన్నికల్లో చాలాచోట్ల ఒంటరి పోరుకు దిగిన కాంగ్రెస్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అధికారాన్ని కోల్పోయింది. మధ్యప్రదేశ్, మిజోరంలో ఓటమి పాలై ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో హిమాచల్ప్రదేశ్, దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణకే పరిమితమైంది. మరికొద్ది రోజుల్లో జరగనున్న సమావేశానికి కూటమిలోని అసంతృప్త నేతలు అలకపాన్పు వీడి హాజరవుతారా లేదా అన్నది అందరి ముందున్న ప్రశ్న.
-ఎడిటోరియల్ డెస్క్