కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాని హోరెత్తింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ ఉదయం ధర్నా చేయగా.. తమిళనాడుకు చెందిన డీఎంకే, దాని మిత్రపక్షాల ఎంపీలు సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కేరళ సీఎం విజయన్ కేంద్రం తీరుపై చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ‘ఇండియా’ కూటమిలోని కాంగ్రెసేతర పార్టీల నేతలూ పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల సమరోత్సాహం కూడా ఈ నిరసనలకు ఒక కారణం. అయితే కేంద్రం, రాష్ర్టాల మధ్య పన్ను ఆదాయ పంపిణీపై ఏర్పడిన తగాదాలు ఈ నిరసనలకు మూలకారణమన్నది తెలిసిందే. ఈ పోరు అంతిమంగా ఉత్తర, దక్షిణ భారత సమస్యగా పరిణమించే సూచనలూ కనిపిస్తున్నాయి. ఈ సమస్య ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. ఇటీవలి సంవత్సరాల్లో, ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది జోరందుకున్నది. అత్యధిక పన్ను ఆదాయం సమకూర్చే దక్షిణాది రాష్ర్టాలు అరకొరగా నిధులు పొందుతుంటే, అంతంతమాత్రంగా పన్ను వసూళ్లు కలిగిన ఉత్తరాది రాష్ర్టాలు సింహభాగాన్ని ఎగరేసుకుపోయే విచిత్ర పరిస్థితి ఇందుకు కారణం. ‘జనాభాను అదుపులో ఉంచుతూ, అధిక ఉత్పాదకత సాధించి బోలెడంత పన్ను వసూలు చేయడమే మేము చేసిన నేరమా?’ అని దక్షిణాది రాష్ర్టాలు వేస్తున్న ప్రశ్నలో సహేతుకత లేకపోలేదు. ఉత్తరాది రాష్ర్టాలు ఉత్తపుణ్యానికి అధిక వాటా దండుకుంటున్నాయనే భావన దక్షిణాది రాష్ర్టాల్లో పాతుకుపోతున్నది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం అంత సులభమైన విషయమేమీ కాదు.
సీఎంలు ఆందోళన బాటపట్టడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అసహనం వ్యక్తం చేశారు. ఫైనాన్స్ కమిషన్ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుందని, అందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని ఆమె చెప్పుకొచ్చారు. ఇదంతా వేర్పాటువాద ఆలోచనా ధోరణి వల్ల తలెత్తిన సమస్య అని ఓ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. ప్రస్తుత పన్ను వాటాల పంపిణీ 15 ఆర్థిక కమిషన్ సిఫారసుల పరిధిలో జరుగుతున్నది. అయితే ఆ కమిషన్ ఉపయోగించిన సూత్రంపైనే సంపన్న రాష్ర్టాలకు ఏకాభిప్రాయం లేకపోవడం గమనార్హం. పన్నులు ఆదాయాన్ని బట్టి వసూలు చేస్తున్నప్పటికీ, పంపిణీ మాత్రం జనాభా ప్రాతిపదికన జరుగుతుండటం ప్రస్తుత వివాదానికి అసలు కారణం. తక్కువ జనాభా పెరుగుదల కారణంగా సంపన్న రాష్ర్టాలు (దక్షిణాది రాష్ర్టాలు) నష్టపోతున్నాయి. ఆదాయాలు పెద్దగా లేని ఉత్తరాది రాష్ర్టాల్లో జనాభా ఎడాపెడా పెరుగుతుండటంతో అవి కేంద్ర నిధుల్లో అధిక వాటా పొందగలుగుతున్నాయి. నిర్మలమ్మ చెప్పింది నిజమేనని అనుకున్నప్పటికీ, ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు పూర్తి నిధులను కేంద్రం కేటాయించడం లేదన్నదీ వాస్తవమే. పనగరియా నేతృత్వంలో నియమించిన 16వ ఫైనాన్స్ కమిషన్ ఏ మేరకు దిద్దుబాటు చర్యలను సూచిస్తుందో వేచిచూడాల్సి ఉంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం రాజకీయ కారణాలతోనే సంపన్న (దక్షిణాది) రాష్ర్టాలపై వివక్ష చూపుతున్నదనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న నిరసనల్లో దక్షిణాదికి చెందిన తమిళనాడు, కేరళ, కర్ణాటక పాల్గొంటున్నాయి. కేంద్ర నిధుల విషయంలో అన్యాయానికి గురవుతున్న రాష్ర్టాల్లో మన తెలంగాణ కూడా ఉన్నది. నిధుల విషయమై ఇదివరకటి కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంపై అలుపులేని పోరాటం చేసింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం నోరు మెదపడం లేదు. కర్ణాటకలోని సాటి కాంగ్రెస్ ప్రభుత్వం సమరశంఖం పూరించినప్పటికీ ఎందువల్లనో ఇక్కడి సర్కారులో కదలిక లేదు. కేంద్రం భావిస్తున్నట్టు వేర్పాటువాద ఆరోపణల ముసుగులో నిధుల పంపిణీ సమస్యను ఎక్కువకాలం దాచివేయడం కుదరదు. దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దక్షిణాది రాష్ర్టాల పోరు మరింత ఉధృతం కావడం మాత్రం ఖాయం.