తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపొందాక కేసీఆర్ ఈ తొమ్మిదిన్నరేండ్లలో ఏం చేశారు? ఈ ప్రశ్న కొందరు పదే పదే అడుగుతారు. వారికి కొద్దిగా అవగాహన లోపం ఉండి ఉండవచ్చు. అందుకే 2014 తర్వాత మన రాష్ట్రంలో ఏ మార్పులు వచ్చాయో వివరంగా పదే పదే చెప్పవలసి వస్తున్నది.
ఉద్యమ నాయకుడు పాలకుడైతే ఎటువంటి మార్పులు వస్తాయో ప్రపంచంలో చాలా ఉదాహరణలున్నాయి. క్యూబా అనే చిన్న దేశాన్ని చాలా ఆటుపోట్ల తర్వాత విప్లవ నాయకుడు ఫిడెల్ కాస్ట్రో 49 ఏండ్లు పరిపాలించి, చాలా సమర్థవంతమైన దేశంగా తీర్చిదిద్దాడు. లిబియా అనే ఆఫ్రికన్ దేశంలో మువమ్మర్ గడాఫీ అనే విప్లవ నాయకుడు అప్పటిదాకా ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన రాజును గద్దె దింపి 42 ఏండ్లు చాలా ఆధునికతతో దేశానికి పాలకుడిగా విద్య, వైద్యం, పేదలకు ఇండ్లు, బాల బాలికలకు తప్పనిసరి విద్య మొదలైన విధానాలతో చాలా బాగా ప్రజలను పాలించాడు. ఎరిత్రియా అనే తూర్పు ఆఫ్రికా దేశంలో జరిగిన విప్లవంలో ఇసియాస్ ఆఫ్ వర్మీ అనే విప్లవకారుడు 1991లో బ్రిటిష్ పాలకులను జయించి దేశానికి అధ్యక్షుడై ఇప్పటిదాకా చక్కగా పాలిస్తున్నాడు. అయితే ఇవి ఒక విప్లవం విజయవంతంగా నడిపి, జయం పొంది, ఆ దేశాన్ని పాలించే నాయకుడు ఎంత సమర్థవంతంగా ప్రజలను పరిపాలిస్తాడో చూపడానికి తీసుకున్న కొన్ని ఉదాహరణలు మాత్రమే!
తెలంగాణ ఉద్యమం ఈ విప్లవాలకు తీసిపోయింది కాదు. ఒక్కటే తేడా! ఇది చాలా శాంతియుతంగా నడిచి విజయవంతమైన ఉద్యమం. మహాత్మాగాంధీ దేశం కోసం అహింసాత్మకంగా నడిపిన స్వాతంత్య్రోద్యమంతో పోల్చదగినది. దీని నాయకుడైన కేసీఆర్ విప్లవాలు నడిపిన ఆ నాయకులంత ధీరుడు, ధైర్యశాలి, మేధావి, పట్టువదలని విక్రమార్కుడు, మానవీయ విలువలు ఉన్నవాడు. లౌకిక సిద్ధాంతాన్ని అహింసామార్గాన్ని నమ్ముకొని పద్నాలుగేండ్లు ఉద్యమాన్ని వదలకుండా విజయం సాధించినవాడు.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ఎన్నికలొచ్చాయి. మరి ఈ ముఖ్యమంత్రిని మళ్లీ ఎన్నుకోవాలా? అన్న సందేహం ఉన్నవారు ఆయన పాలనలో ఏం జరిగిందో, ఏయే పథకాలు అమలయ్యాయో తెలుసుకోవడం ముఖ్యం. వివిధ రంగాల్లో వచ్చిన మార్పులు పరిశీలిద్దాం!
1. సామాజిక పథకాలు: ఒక సమాజంలో అందరికీ కావలసినవి ముఖ్యంగా రెండు. ఒకటి భద్రత, రెండు గౌరవం. వివిధ వర్గాలుగా విడిపోయి, కొన్నివర్గాల దగ్గర సంపద, కొన్ని వర్గాలకే గౌరవం ఉండి, మిగతా వారు బాధపడుతూంటే అది ఆరోగ్యకరమైన సమాజం అవదు. ఈ సమానత్వం సాధించటానికి, అందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు పరిశీలిద్దాం. భరోసా కేంద్రాలు, బంజారా భవన్, ఆదివాసీ భవన్ ఇంకా ఇతర వర్గాలకు, ఇతర భాషల వారికి ఒక కేంద్రంగా భవనాలు కట్టుకోవడానికి స్థలాలు, ధనం మంజూరు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఎస్టీ రిజర్వేషన్ 10 శాతానికి పెంపు, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వారికి పాలించుకునే అధికారం, పోడు భూముల పట్టాలు, భద్రత కోసం పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం, మహిళల రక్షణ కోసం ‘షీ’ టీమ్స్.
2. ఆర్థిక పథకాలు: కనీస అవసరాలు తీరకుండా సమాజంలో ఎవరూ సంతోషంగా ఉండలేరు. చాలా నేరాలు ఆర్థికావసరాల కోసం జరుగుతాయని సామాజిక శాస్త్రజ్ఞులు విశ్వసిస్తారు. అవి ఆపాలంటే సమాజంలో అట్టడుగు వర్గాలకు, నిర్లక్ష్యానికి గురైనవారికి ఆర్థిక సహాయం అందించటం ఒక ప్రభుత్వ బాధ్యత. అప్పుడే పైన చెప్పిన భద్రత కల్పించటం సాధ్యమవుతుంది. దానికోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయి. అవి: వ్యవసాయరంగంలో రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీ బంధు, నేతన్న బంధు, అమ్మ ఒడి, బీదవారికి డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు (వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు), 6 కిలోల రేషన్ బియ్యం ప్రతి ఒక్కరికి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి అల్పాహార పథకం, విద్యార్థులకు తెలంగాణ విదేశీ విద్యా స్కాలర్షిప్లు.
3. మౌలిక వసతులు: పైన చెప్పిన పథకాలు అమలుచేసిన ప్రజలకు మౌలికమైన వసతులు కల్పిస్తేనే జీవితం హాయిగా సాగుతుంది. ఇంట్లో ఉండేవారికైనా, ఇంటి బయటకు వెళ్లి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారికైనా కనీస వసతులు అవసరం. వాటికి సంబంధించిన పథకాలు ముఖ్యమంత్రి కల్పించినవి ఇవి. హైదరాబాద్ మెట్రో రైలు, 24 గంటల నిరంతరాయ విద్యుచ్ఛక్తి, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు, మిషన్ భగరీథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్లు, గృహలక్ష్మి, భవిష్యత్తు తరాలకు కూడా కరెంటు సరిపోయేటట్టు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ అందుబాటులో ఉండేటట్టు బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం. వరద నివారణకు ఎస్ఎస్డీపీ పథకం.
4. సహజ వనరులు, వాతావరణ స్వచ్ఛత: సింగరేణి వంటి నల్ల బంగారు గనులను, అక్కడ పనిచేసే కార్మికులను ముఖ్యమంత్రి ఎంత జాగ్రత్తగా కాపాడి, ప్రగతి పథంలో నడుపుతున్నారో అందరు గమనిస్తున్నారు. కేంద్రం తెలంగాణ పట్ల శత్రువులా ప్రవర్తిస్తూ బయ్యారం వంటివి రానియ్యటం లేదు కానీ, కేంద్ర సహకారం ఉంటే తెలంగాణకు ఇంకా ఎన్నో మంచి సంస్థలు వచ్చి ఉండేవి. ఇక రాష్ట్ర వాతావరణం దేశంలోనే మిగతా రాష్ర్టాల కంటే బాగుంది. దానికి కారణం దూరదృష్టి గల మన ముఖ్యమంత్రి మేధస్సు నుంచి పుట్టిన హరితహారం ( ఈ పథకాన్ని కొందరు మొదట్లో అపహాస్యం చేశారు), మిషన్ కాకతీయ (దీనివల్ల నీటి మట్టం భూమి లోపల కొన్ని మీటర్లు పైకి వచ్చింది) అడవులను పెంచటం. స్వచ్ఛమైన నీరు గాలితో తెలంగాణ ఇతర మెట్రో నగరాల కంటే కొన్ని రెట్లు ఎక్కువ నివాసయోగ్యంగా మారింది.
5. విద్య: ముఖ్యమంత్రి చాలా ముందుగానే ప్రణాళిక తో చేసిన పథకాల్లో విద్య ఒకటి. దశాబ్దాల కాలం విద్యకు దూరంగా ఉండిపోయిన వారికోసం వెయ్యికిపైగా గురుకులాలు స్థాపించటమే కాకుండా, మైనారిటీలకు వందకు పైగా గురుకులాలు ఇచ్చారు. ఇప్పటి మ్యానిఫెస్టోలో అగ్రకులాల వారికి కూడా 100కు పైగా ఇస్తామని చెప్పారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం, దేశం ఎప్పుడూ త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఇదే కాకుండా జిల్లాకు ఒక డిగ్రీ కాలేజీ ఇచ్చారు. అంతేకాకుండా, వివక్షాపూరితంగా ఇతర రాష్ర్టాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మొండిచెయ్యి చూపితే, కేసీఆర్ ప్రతి చర్యగా జిల్లాకొక మెడికల్ కాలేజీ స్థాపించి కేంద్రానికి సవాల్ విసిరారు. ప్రభుత్వం నడిపే ఈ విద్యాలయాలన్నింటిలో అన్ని వసతులు, హాస్టళ్లు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యతగా సమకూరుస్తుంది.
6. వైద్యం: రోజువారీ జీవితానికి ఎన్ని వసతులున్నా ప్రజలకు సమయానికి వైద్యం అందటం చాలా ముఖ్యం. ముఖ్యమంత్రి 2014 నుంచీ ఉన్న దవాఖానలు బలోపేతం చేయటం, వసతులు పెంచటమే కాక చాలా పథకాలు ప్రవేశపెట్టారు. జిల్లాకొక మెడికల్ కాలేజీకి అనుబంధంగా 100 పడకల దవాఖానలు ఏర్పాటుచేయటం చాలా సాహస చర్యే కాకుండా, ప్రజలకు చాలామంచి చేసే కార్యక్రమం. ఇక మిగతా పథకాలు ఇవి: కంటివెలుగు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానలు, ఆరోగ్యలక్ష్మి, మతా,శిశు దవాఖానలు, ప్రసూతి వసతులు, కేసీఆర్ కిట్లు, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు, అంగన్వాడీలో భోజన వసతి, జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు, ఉచిత డయాలసిస్ వసతి, తెలంగాణ మెడికల్ సైన్సెస్ సంస్థ, ఫార్మాసిటీ, ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ను తీర్చిదిద్దటం, మెడికల్ డివైజెస్ పార్కు.
7. వృత్తి, వ్యాపారులకు పథకాలు: ప్రజలకు మొట్టమొదటి అవసరం ఆహారం. అందుకే వేదాల్లోనూ వ్యవసాయం ముఖ్యమైన వృత్తి అనీ, కృషీవలుడు అందరికంటే గొప్పవాడనీ చెప్పబడింది. ముఖ్యమంత్రి రైతులకు, ఇతర వృత్తి వ్యాపారులకీ కల్పించిన పథకాలు ఈ విధంగా ఉన్నాయి. రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతు పండించిన ధాన్యమంతా కొనుగోలు, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, 36 ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు, ధరణి, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, చేనేత మిత్ర, బీసీ బంధు ఇంకా నాయీ బ్రాహ్మలకు, రజకులకు ఇచ్చిన పథకాలు.
8. పార్కులు: వివిధ రంగాలను ప్రోత్సహించటానికి వారికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పార్కుల గురించి, ముఖ్యంగా చెప్పుకోవాలి. పట్టణాల్లో అర్బన్ పార్కులు ఇక్కడి ప్రజలు సేదతీరటానికి ఏర్పాటుచేశారు. వివిధరంగాల వారు తమ ఉత్పత్తుల ప్రాముఖ్యం, తమ రంగం గురించి చెప్పటానికి ఈ పార్కులు ఉపయోగపడుతాయి. అవి: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, సీడ్ పార్క్, లాజిస్టిక్స్ పార్క్, మణికొండ టెక్స్టైల్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, ఎయిరో స్పేస్ పార్క్, అపారెల్ పార్క్, మెగా ఫుడ్వర్క్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, టాయిస్ పార్క్, అర్బన్ ఫారెస్ట్ పార్కులు. ఇవేకాక పునరుద్ధరింపబడిన సరస్సుల సుందరీకరణ కూడా ప్రభుత్వ పథకాల్లో ముఖ్యమైనది.
9. పారిశ్రామిక రంగానికి పథకాలు: ఒక దేశం కానీ, ప్రాంతం కానీ, రాష్ట్రం కానీ, కేవలం ఆహారం, బట్టలు, మౌలిక వసతులతో ఆగిపోతే వెనుకబడిపోతుంది. సమతుల్యత కావాలంటే ప్రకృతి వనరుల సరైన ఉపయోగంతో పాటు, ప్రపంచంలో దూసుకుపోతున్న సాంకేతికతను అందిపుచ్చుకొని పారిశ్రామికంగా ఎదగకపోతే చాలా నష్టం. అందుకే దూరదృష్టి, విజ్ఞత గల మన ముఖ్యమంత్రి పారిశ్రామికంగా ఎదగటానికి పాలసీలు సరళతరం చేసి పలు వ్యాపారస్థులను ఆకర్షించారు. వారు పెట్టిన పథకాలు చూసి పెట్టుబడిదారులు ఆశ్చర్యపోతున్నారు. అద్భుతమని పొగుడుతున్నారు. ఆ పథకాలు కొన్ని; టీఎస్ఈపాస్, టీఎస్బీపాస్, టీ ప్రైడ్, టీ శాట్, టీ హబ్, టీ ఫైబర్, రెండవ శ్రేణి నగరాల్లో ఐటీ టవర్లు, టీఎస్ఐసీ, టీవర్క్స్ ఎస్టీపీలు, వీ హబ్, రిచ్, ఇమేజ్ టవర్, టాస్క్.
10. ఆధ్యాత్మిక పథకాలు: గుడుల పునరుద్ధరణ, దీపధూప నైవేద్యాలకు నిధులు, పూజారులకు, ఇమామ్లకు, ఫాస్టర్లకు వేతనాలు మొదలైనవి ఇచ్చి ఆయా మతాల కొనసాగింపునకు పథకాలు పెట్టారు ముఖ్యమంత్రి. సహజంగా ఆధ్యాత్మిక భావాలు, మానవీయత కలిగినవారి సహృదయత వల్ల వివిధ మతాల వారు ‘గంగా జమునా తెహజీబ్’ అన్న నానుడి నిజం చేస్తున్నారు. జీవనం ప్రశాంతంగా సాగాలంటే..తెలంగాణలో సర్వమత సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం చాలా ముఖ్యమైనవి.
11. సాంస్కృతిక పథకాలు: ప్రజాకవి కాళోజీ ఒక విలువైన విషయం చెప్పారు. ‘ఆర్థికంగా చితికిపోతే, మళ్లీ సంపాదించుకోవచ్చు, సామాజికంగా వెనుకబడితే పరుగెత్తవచ్చు, రాజకీయంగా వెనుకబడితే పుంజుకోవచ్చు; కానీ సాంస్కృతికంగా వెనుకబడితే ఒక జాతి లేవడం కష్టం. ‘దాదాపు 58 ఏండ్లు తన సంస్కృతి వలస పాలకుల హేళనకు, అపహాస్యానికి, నిర్లక్ష్యానికి గురైతే నిస్సహాయంగా ఉండిపోయిన తెలంగాణను ముఖ్యమంత్రి పట్టుదలే మళ్లీ నిలబెట్టింది. బతుకమ్మ ఆడటానికి భయపడిన స్త్రీలు, వాటిని నీళ్లల్లో వదిలిపెట్టడానికి నీళ్లు లేని చెరువుల చూశారు 2014 దాకా ఈ ప్రాంత వాసులు. కానీ తెలంగాణ రాష్ట్రమయ్యాక సంస్కృతి మళ్లీ పురివిప్పింది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలతో ఊపిరిపోసుకున్నది. కాళోజీ బతికి ఉంటే ఎంత సంతోషించేవారో! అంతేకాదు, తెలంగాణ తెలుగు వల్ల ఈ భాషకు ‘ప్రాచీన భాష’ అన్న గౌరవం దక్కడం మన ముఖ్యమంత్రి సాధించిన విజయమే.
వీటన్నింటికంటే ముఖ్యమంత్రి సునిశిత దృష్టి, సున్నిత హృదయం ప్రవేశపెట్టిన గొప్ప పథకం ప్రతి పల్లెలో వైకుంఠధామాలు నిర్మించటం. చనిపోయిన వారికి గౌరవంగా, ప్రేమతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని వసతులతో నిర్మించిన ముఖ్యమంత్రి అభినందనీయులు! అంతేకాదు, గతంలో నిజాములు పాలించిన హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలంతా కలిసి మెలిసి ఉంటారనటానికి నిదర్శనం. ఒకేచోట, పక్కపక్కనే మూడు మతాల వారి వైకుంఠధామం, ఖబర్స్థాన్, సిమెట్రీ
నిర్మించటం. ఇది కదా మన సంస్కృతి!
ఇక హైదరాబాద్కు వచ్చిన గుర్తింపు అందరికీ పరిచితమే. అదీకాక పల్లెలకు, రెండవశ్రేణి పట్టణాలకు వచ్చిన అవార్డులు, రివార్డులు చెప్తే పట్టిక చాంతాడంత పొడుగు ఉంటుంది. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం, ఏఐపీహెచ్ వరల్డ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ (2022) భారతదేశపు టెక్నాలజీ ఆవిష్కరణ రాజధాని, పచ్చదనం పెంపులో దేశంలో నం-1, ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ (అర్బర్ డే ఫౌండేషన్), రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, అత్యధిక తలసరి విద్యుత్తు వినియోగం ఉన్న రాష్ట్రం, అత్యధిక జీఎస్డీపీ వృద్ధిరేటు కలిగిన రాష్ట్రం, అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం, ఐదు తెలంగాణ నిర్మాణాలకు గ్రీన్ ఆపిల్ అవార్డులు, ఈఓడీబీలో 3వ స్థానంలో తెలంగాణ, దేశ జీడీపీకి అత్యధిక తలసరి సహకారం, దేశంలోనే 2వ అతి పెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిదారు, లైఫ్ సైన్సెస్ హబ్ ఆఫ్ ఇండియా, 100 శాతం ఓడీఎఫ్ గ్రామాలు, భారతదేశంలో అత్యుత్తమ గ్రామీణ అభివృద్ధి నమూనా, ఇవి, ఇంకా ఎన్నో విషయాలు కలిపి చూసి మెర్సెర్ సంస్థ వరుసగా 5 సార్లు హైదరాబాద్ను దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరమని ఎంపిక చేసింది.
ఇన్ని పథకాలు- ఎన్నికల్లో చెప్పనివి కూడా- ప్రవేశపెట్టిన మన ముఖ్యమంత్రికి ఇంకొన్నేండ్లు అధికారం ఇస్తే మన రాష్ట్రం ఎలా తయారవుతుందో ఊహకు కూడా అందదు కదా!
ఎన్నికల ప్రచారానికి ప్రతిపక్ష నేతలు వచ్చినప్పుడు ఒకే ఒక్క ప్రశ్న అడగాలి తెలంగాణ ఓటర్లు. పైన చెప్పిన పథకాలు కాకుండా, వీటిని పోలి ఉన్నవి కూడా కాకుండా ఇంకేదైనా ఒక్క కొత్త పథకం- వారు చెయ్యగలిగినది- చెప్పమని. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. తెలివి తక్కువగా మోసకారుల ప్రగల్భాలు నమ్మి ఓటేస్తే మోసకారులే మన నేతలవుతారు. తెలంగాణ ఓటర్లు ఈ విషయం ఆలోచించాలి.
-కనకదుర్గ దంటు
89772 43484