వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ గడ్డ మీదినుంచి తొలి అడుగు పడింది. అలనాడు తన కంటిచూపుతో ఈ దేశ భవిష్యత్తును శాసించిన ఇందిరాగాంధీని తెలుగుజాతి ఆత్మగౌరవం పేరుతో మట్టి కరిపించిందీ నేల. మళ్లీ నేడు కేసీఆర్ నాయకత్వంలో ఢిల్లీని ఢీకొట్టే పని మొదలైంది.
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యతను దేశవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. కాబట్టే, మనతో కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ర్టాలు కలసివస్తున్నాయి. మున్ముందు చాలా రాష్ర్టాలు కలసివచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం, వందేండ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్పార్టీ సరైన నాయకత్వం లేక దిక్కులు చూస్తున్నది. జాతీయపార్టీలు అని చెప్పుకొనే మిగతా పార్టీల అస్తిత్వం కూడా అంతంతమాత్రమే. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో దేశానికి ఒక ప్రత్యామ్నాయం అవసరం. ఆ అవసరాన్ని గుర్తించిన కేసీఆర్ దేశ గుణాత్మక మార్పు కోసం ఆ బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. ఇది తెలంగాణ బిడ్డలుగా మనం గర్వించదగిన విషయం.
‘ఇల్లల్కగానే పండుగ కాదు’ అనే విషయం కేసీఆర్ లాంటి అపర చాణక్యుడికి బాగా తెలుసు. అందుకే భారత దేశ భవిష్యత్ ఇదే అని ప్రస్ఫుటించే విధంగా, ఒక వేదికగా అందరినీ ఒక తాటి మీదకు తెచ్చేందుకు ‘భారత రాష్ట్ర సమితి’ పేరుతో జాతీయ పార్టీని ఏర్పాటుచేశారు. 75 ఏండ్లుగా భారత దేశం సాధించని అభివృద్ధిని, దేశంలోని సమస్యల పరిష్కారాన్ని పార్టీ ఎజెండాగా ప్రకటించి ముందుకువెళ్లే పథకం రచించారు. వ్యవసాయం, సాగునీరు, ఆర్థిక వెనుకబాటు వంటి దేశంలోని సమస్యలను దేశాన్ని పాలించిన పార్టీలు విస్మరించాయి. దేశానికి ఒక లక్ష్యమనేది లేకుండానే పాలన కొనసాగింది. విస్మరణకు గురైన దేశ భవిష్యత్తుకు భరోసానిస్తూ కేసీఆర్ బీఆర్ఎస్తో ముందుకు సాగుతున్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడిగా కేసీఆర్కు దేశవ్యాప్తంగా పేరున్నది. చరిష్మా గల నాయకుడిగా రేపు భారతదేశ యవనిక మీద కూడా ఆయన తప్పక విజయాన్ని సాధిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతి భారతీయుడి గుండెలో మన తెలంగాణ బిడ్డ కేసీఆర్ స్థానం సంపాదిస్తారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా త్వరలోనే ఢిల్లీ గద్దె మీద బీఆర్ఎస్ కొలువుదీరాలని తెలంగాణ బిడ్డలుగా మనం గట్టిగా కోరుకుందాం. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల ‘రైతురాజ్యం’ ఇక సుదూర స్వప్నం ఎంతమాత్రం కానే కాదు.
-శేరి సుభాష్రెడ్డి