గోదావరికి వందేండ్లలో కనీవినీ ఎరుగని వరద. తెలంగాణలో మూడున్నర దశాబ్దాల కాలంలో జూలైలో ఎన్నడూ లేనంత గరిష్ఠ వర్షపాతం. వారం రోజులుగా ముంచెత్తుతున్న వాన రాష్ర్టాన్ని గుక్కతిప్పుకోకుండా చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితి ఇటీవలి కాలం లో ఎన్నడూ చూడనిది. అయినా రాష్ట్రప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించి ఆస్తి, ప్రాణ నష్టాలను గణనీయంగా తగ్గించగలిగింది. స్వయంగా సీఎం కేసీఆర్ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ అటు అధికారులను, ఇటు మంత్రులను, నేతలను క్షేత్రస్థాయిలో మోహరింపజేసి ప్రజలకు భరోసా కల్పించారు. ప్రాకృతిక విపత్తులను మనిషి నివారించలేడు. చేయగలిగిందల్లా ముందుజాగ్రత్త మాత్రమే.
నైరుతి రుతుపవనాలతోపాటు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో క్రమంగా పెరిగిన వర్షాల ఉద్ధృతి ఒక్కసారిగా జడివానగా, కుంభవృష్టిగా మారిపోయింది. ప్రమాదాన్ని ముందే అంచనా వేసిన సీఎం కేసీఆర్ వెంటనే కార్యాచరణ చేపట్టారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తూనే, సంబంధిత ప్రభుత్వ విభాగాలన్నింటినీ యుద్ధప్రాతిపదికన మోహరించారు. చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలో నీటిమట్టాల వివరాలను సమీక్షించారు. ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించటానికి రెస్క్యూ టీంలను ఏర్పాటు చేయాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలని, అవసరమైతే హెలికాప్టర్లను వాడాలని అధికారులకు సూచించారు. ప్రతి ఆరుగంటలకు ఒకసారి పరిస్థితిని సమీక్షించాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్తలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖకు దిశానిర్దేశం చేశారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఒకవైపు క్షేత్రస్థాయి పరిస్థితిని, మరోవైపు పైస్థాయి అధికారులను ఏకకాలంలో సమన్వయపరిచారు.
తెలంగాణపైకి దూసుకొచ్చిన ఈ జలఖడ్గాన్ని ఎదుర్కోవటంలో సీఎం కార్యాలయమే వార్రూమ్గా మారిపోయింది. జీపీఎస్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాష్ట్రవాప్తంగా సహాయక చర్యలకు దిక్సూచిగా నిలిచింది. సీఎం ప్రతిరోజూ 12 నుంచి 15 గంటల పాటు ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షించారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు స్థానికంగా పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. వంతెనలు, జలాశయాలు, లోతట్టు ప్రాంతాల వద్ద పోలీసుశాఖ నిరంతర పహారా చేపట్టింది. ఇక ఇంజినీర్ల కృషిని, సాహసాన్ని మాటల్లో వర్ణించలేం. రోడ్లు దెబ్బతిని రాకపోకలకు ఆటంకం ఏర్పడిన ప్రాంతా ల్లో అప్పటికప్పుడు తాత్కాలిక ఏర్పాట్లు జరిపి రవాణాను పునరుద్ధరించారు అధికారులు. కరెంటు సరఫరా దెబ్బతినకుండా విద్యుత్శాఖ సమర్థవంతమైన ఏర్పాట్లు చేసింది. ఒక్కటని ఏమిటి, ప్రతి శాఖ, ప్రతి అధికారి బాధ్యతతో ముందుకువచ్చి తమ వంతు పాత్ర పోషించారు. పూర్తి సమన్వయంతో రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం కదిలిన ఫలితంగానే విపత్తు నుంచి దాదాపుగా బయటపడగలిగాం. వరుణుడు శాంతిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి!