రోజూ పొద్దుగాల ఆరేడు గంటలకు గింత కడుపులేసుకోవాలె… నాలుగైదు కాగితాలు వర్కు కవర్ల ఏసి సంకన పెట్టుకోవాలె… ఆటో పట్టుకొని కిందా మీద పడి తొమ్మిది గంటలకల్ల కచ్చీరుకు చేరుకోవాలె… అక్కడ చెట్టు కింద కూర్చన్నడంటె కచ్చీరు మూసిందాక పురస్తు… మధ్య మధ్యల ఒకాయన వస్తుంటడు… ఖర్చుకు పైసలంటూ తీస్కపోతుంటడు… పని ఏమైందయ్యా అంటే! ‘తొందరపడితె అయితదా? సారు కాగితాలు చూస్తుండు!’ అని చెబుతడు. రోజూ ఇదే కథ.
మొన్నటిదాకా తన పేరు మీదనే ఉన్న నాలుగైదు గుంటలో… ఎకరం భూమో… రాత్రికి రాత్రి ఆర్ఓఆర్ల వేరే వాళ్ల పేరు మీదకు మారడంతో రైతు పడిన అవస్థ ఇది. చేలల్లో ఉండాల్సిన రైతులు నెలలు… సంవత్సరాల తరబడి కచ్చీరు ముందు కాలం వెళ్లదీసినరు. ఇట్ల తిరిగి తిరిగి కాలం చేసిన రైతులు కూడా ఎందరో! ఊర్ల ఉండె రాజకీయ నాయకుడు దళారీ అవతారమెత్తి.. వాళ్ల రక్తం పీలిస్తే వీఆర్వోలు, అధికారులు అందుల వాటాలు పంచుకున్నరు. మొన్నటిదాకా ఈ దృశ్యాలు లేని ఊరు లేదు! ఇట్ల రైతుల అవస్థలు చూడని కచ్చీరు లేదు!! దశాబ్దాలుగా తెలంగాణ రైతులు పడిన ఈ బాధల్ని సీఎం కేసీఆర్ స్వయంగా చూసిండు. ఉమ్మడి రాష్ట్రంల రైతులు పడిన గోసల్లో ఇదీ ఒకటి.
ఈ బాధల్ని తీర్చాలని ఆనాడే కేసీఆర్ సంకల్పించుకున్నడు. తెలంగాణలో రైతురాజ్యం తీసుకురావాలని, ఇటువంటి సమస్యలను రూపుమాపాలని భావించాడు. అందుకనే, తెలంగాణను తెచ్చుకున్న తర్వాత దీనికోసం చర్యలు తీసుకున్నడు. ఏండ్ల తరబడి అవినీతి చీడ పట్టిన వ్యవస్థను మార్చడమంటే మాటలా?! దళారీల ప్రమేయం లేకుంట, రైతులు ఎవరి ముందు దేహీ అనకుంట వారి భూమిపై వారికే సర్వహక్కులు ఉండే వ్యవస్థను తీసుకురావాలని సీఎం కేసీఆర్ చూసిండు. చాలా కాలం మేధోమథనం చేసిండు. ఈ రంగంలో పని చేసిన అనుభవజ్ఞులతో చర్చలు జరిపిండు.
రైతులకు ఎటువంటి వ్యవస్థను అందజేస్తే వారికి మేలు జరుగుతుందో ఆలోచించి, ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి… ధరణిని తీసుకువచ్చిండు. ఇన్నాళ్లూ రైతుల భూములకు తాళం చెవులు అధికారులు, దళారుల చేతుల్ల ఉండె. అవన్నీ బంద్ చేసి… రైతుల భూములకు ధరణితో రక్షణ తాళం వేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ తాళం చెవుల్ని రైతుల చేతుల్ల పెట్టిండు. ఇగ… భూముల జోలికి రావాలంటే పగోడు కాదు, మనోడి తరం కూడా కాదు. రైతు స్వయంగ వేలి ముద్ర పెట్టి తాళం తీస్తే తప్ప ఆయన పేరు మీదున్న భూమి కూడా ఇంకోళ్ల పేరు మీదికి మారదు.
భూముల రికార్డుల నిర్వహణ అనేది కొన్నేండ్ల నుంచి ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు కొనసాగింది. దీంతోనే అనేక సమస్యలు పేరుకపొయినై. ఇదే సందుగా, దళారులు, అధికారులు కుమ్మక్కై పంచుకతిన్నరు. కానీ, కేసీఆర్ ఈ పరిస్థితిని సమూలంగా మార్చకపోతే, ఇగ ఎప్పటికి ఇట్లనే సమస్యలు ఉంటయని ధరణిని ఎంతో ముందుచూపుతోని తీసుకొచ్చిండు. ఊర్లె ఉన్నవాళే కాదు, అమెరికాల ఉన్నవాళ్లు కూడా తమ భూమి రికార్డులను ఇంటర్నెట్ల ఎప్పటికప్పుడు చూస్కొనే సదుపాయం ఇది. భూమి యజమాని తప్ప వేరేవాళ్లు ఎవ్వరు దాంట్ల జోక్యం చేసుకునేతందుకు అవకాశమే ఉండది.
మరి సీఎం కేసీఆర్ రైతులకు ఇంత సౌలత్ చేస్తే… కాంగ్రెసోళ్లు మాకు అధికారం ఇయ్యండి ధరణిని బంగాళాఖాతంల పడేస్తమంటున్నరు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏడ పడ్తె ఆడ ఇదే పాట. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా ధరణిని బంగాళాఖాతంల కలిపేస్తమని, ఇది బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని ప్రకటించిండు. దశాబ్దాల పాటు తెలంగాణను ‘ఉద్ధరించిన’ ఏలికలు కదా వీళ్లు. ఎండుతున్న పంటలను జూసి తెలంగాణ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటె.. తలాపున ఉన్న గోదావరి, కృష్ణా నీళ్లను చేలల్లకు మళ్లియ్యనోళ్లు! ఇప్పుడు ఏకంగ బంగాళాఖాతం దాకా పోయి వస్తమంటున్నరు.
ఒక ఆరోపణ చేసినపుడు దానికి సుబూతు కావాలి. కాంగ్రెసోళ్లు ధరణిని బంగాళాఖాతంల వేస్తమంటున్నరు. ఎందుకు? ధరణి రావడం వల్ల ఎవరి కొంపలు మునిగినయి. ఎవరి దుకాణాలు బంద్ అయినయి. నిజంగ ధరిణితోటి రైతులకు ఏమైన నష్టం జరిగిందా? కాంగ్రెసోళ్ల దగ్గర సుబూత్ ఉందా? తెలంగాణ రైతులు దీని మీద చర్చించాల్సిన సమయం ఇది. ఎందుకంటే.. ఏండ్ల తరబడి ఆగమాగం ఉన్న భూముల రికార్డులను గట్టుకేసి ధరణిగ మార్చడమంటె ఒక్కరాత్రి, ఒక్క రోజుల అయినది కాదు. దాని వెనక ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరి నుంచి అధికారుల వరకూ ఎంతో శ్రమ ఉన్నది. ఏదైనా మంచి పని చేయాలంటె చాలా కష్టపడాలి. చెడగొట్టాలంటె ఎంతసేపు? మన రాష్ట్రంల చెడగొట్టేందుకు కాంగ్రెసోళ్లే కాదు… ఇంకొంతమంది సిపాయిలు కూడా సిద్ధంగనే ఉన్నరు. మనం ఆత్మగౌరవ ప్రతీకగ కట్టుకున్న సచివాలయం వంటి గొప్ప నిర్మాణాలను ‘మేం అధికారంలోకి వచ్చిన వెంటనే కూలుస్తం’ అని ప్రకటించిన నాయకుడు మన కండ్ల ముందే తిరుగుతున్నడు.
ప్రజా జీవితంల ఉన్న నాయకులు ప్రజలకు పది కాలాలు మేలు చేసే పనులు చేస్తమని చెప్పుకోవాలెగానీ… కూలుస్తుం, బంగాళాఖాతంల కలుపుతం అనుడు ఏంది? గిట్ల కూల్చెటోళ్లు, కాల్చెటోళ్లతోని తెలంగాణ మళ్ల తెర్లు కాదా! ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆర్తితో ఎన్నో పథకాలు తెచ్చి, తెలంగాణను ఒడ్డున పడేసిండు. ఇప్పుడిప్పుడే మన రైతులు, ఏండ్ల గోస నుంచి బయటపడుతున్నరు. ఇటువంటప్పుడు, వాళ్లను మళ్ల పాత రోజులకు తీసుకపోదామనా ఈ నాయకుల మాటల వెనుకున్న ఆంతర్యం. ఇసోంటోళ్లకు అధికారం ఇస్తే ఆగమయ్యేది వాళ్లు కాదు, మనమే. దీని మీద మనమందరం గట్టిగ చర్చ చెయ్యాలె.
రైతు తనకున్న భూమికి పట్టా పాసు పుస్తకాలు తీస్కోవాలంటె పట్వారీ చుట్టూ… ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ నెలల తరబడి తిరిగింది నిజం కాదా? పట్వారీకి, అధికార్లకు పైసలు ఇచ్చుకునుడు నిజం కాదా? ఇప్పుడు రాష్ట్రంల ఎక్కడైన రైతులు పాసు పుస్తకాల కోసం ఎమ్మార్వో ఆఫీసుల చుట్టు తిరుగుతున్న దాఖలాలు ఉన్నయా? నయా పైసా ఇయ్యకుంట రైతులు పాసు పుస్తకాలు తీసుకోవటం మనం చూస్తలేమా? రైతుల భూముల రికార్డుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఊర్లె నలుగురైదుగురు రాజకీయ నాయకులు పైరవీకారులుగా అవతారమెత్తడం నిజం కాదా? ఇప్పుడు ఎక్కడైనా ఆ పరిస్థితి ఉందా? రాత్రికి రాత్రి ఆర్వోఆర్లో వైట్నర్లు పెట్టి, కొట్టివేతలతో.. రికార్డులు మార్చినది నిజం కాదా? ధరణి వచ్చిన తర్వాత రైతుకు తెలియకుండా ఆయన భూమిలో మార్పులు చేసే అవకాశం ఉన్నదా? ఎవరికీ అది సాధ్యం కాదు.
ధరణితో ఇన్ని లాభాలు రైతులకు కలుగుతున్నా కూడా, కాంగ్రెసోళ్లు బంగాళాఖాతంల కలుపుతమని అనటం వెనక పెద్ద కుట్రనే కనపడుతున్నది. మళ్ల పైరవీకార్ల రోజులను తీసుకురావాలని వాళ్లు చూస్తున్నరు. అందుకే సీఎం కేసీఆర్ హెచ్చరిస్తున్నరు. బంగాళాఖాతంలో కలుపుతమంటున్నది ధరణిని కాదు.. తెలంగాణ రైతాంగాన్ని అనే వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచుతున్నరు. మరి.. తేల్చుకోవాల్సింది రైతులే! ధరణితో భూములు భద్రంగ ఉండటమే కాదు.. రైతుబంధు, రైతుబీమా, వడ్ల పైసల వరకు సక్కగ రైతు అకౌంట్ల పడుతున్నాయి. దళారులు, పైరవీకారులు, అవినీతి అధికారులు.. ఏ ఒక్కరి ప్రమేయం లేకుండానే కొనసాగుతున్న ఈ సేవలన్నీ ధరణి పుణ్యమే. ఇటువంటి ధరణి ఒక్కసారి మాయమైందంటె మళ్లీ రాబందులు రైతుల మీద వాలడం ఖాయం. కాంగ్రెసోళ్ల మాటలల్ల ఆ దళారుల సప్పుళ్లు వినిపిస్తున్నాయి. జాగ్రత్త రైతన్నలారా! ఆలోచించండి, చర్చించండి, నిర్ణయానికి రండి.
మంచికి భుజం తట్టాలి… చెడును తొలగించాలి.. ప్రజాపక్షం అంటేనే అది. సమాజహితం కోరే వాళ్లెవరైనా ఇదే చేస్తారు. మరి.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అని చెప్పుకునే మీడియాపై ఆ బాధ్యత మరింత ఎక్కువగానే ఉంటుంది. సామాన్యుడి గొంతుక అని చెప్పుకోవడం కాదు… నిజంగా ఆ సామాన్యుడు ఏండ్ల తరబడి అనుభవిస్తున్న గోసకు అక్షరరూపం కల్పించాలి. ఇదే సమయంలో సామాన్యుడికి మేలు చేసే వ్యవస్థల్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చినపుడు అదే అక్షర ఆయుధాన్ని ఝుళిపించాలి. ‘నమస్తే తెలంగాణ’ నూటికి నూరు శాతం అదే చేసింది… చేస్తున్నది కూడా. నాడు అవినీతి చిక్కుముళ్లలో చిక్కుకున్న రైతుల భూముల సమస్యకు పరిష్కారాన్ని చూపేందుకు ‘ధర్మగంట’తో అక్షర యజ్ఞాన్ని సాగించింది. చెదలు పట్టిన భూ అక్రమాల బాగోతాలు, రైతుల ఆవేదనల్ని సర్కారు ముందుకు తీసుకుపోయింది.
ఈ నేపథ్యంలోనే, తెలంగాణ రైతన్న గుండె చప్పుడు తెలిసిన సీఎం కేసీఆర్ లంచాల దందాకు చెక్ పెట్టేలా… ఇక ముందు తెలంగాణల రైతులకు భూ చిక్కులు లేకుండా ఉండేలా శాశ్వత పరిష్కారంగా ధరణిని తీసుకువచ్చారు. కానీ.. రైతాంగానికి మేలు చేయడాన్ని కూడా కొన్ని రాజకీయ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నయి. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటూ గాయి గాయి చేస్తున్నయి. ఇలాంటి తరుణంలో బాధ్యత కలిగిన ప్రజల గొంతుకగా ‘నమస్తే తెలంగాణ’ మళ్లీ ముందుకు వచ్చింది. ధరణి లేకపోతే రైతుల బతుకులు మళ్లీ పాతరోజుల చీకట్లకే వెళ్తాయని, పైరవీకారులు, దళారులు మళ్లీ రాబందుల్లా వాలుతారని హెచ్చరిస్తూ వరుస కథనాలను వెలువరించింది. ధరణి వల్ల కలుగుతున్న ప్రయోజనాన్ని స్వయంగా రైతులు చెప్పిన మాటల్లోనే వివరించింది.
భూసంస్కరణల్లో ధరణి ఒక కీలక ఘట్టమని పలువురు నిపుణులు చెప్పిన హితోక్తులకు వేదికగా నిలుస్తున్నది. ధరణిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమస్తే తెలంగాణ తిప్పికొడుతున్నది. ఇదంతా తెలంగాణ రైతన్నల కోసమే. రాజకీయ లబ్ధి కోణంలో ధరణిపై విషం చిమ్ముతున్న వారిపై కలంపోరు కొనసాగిస్తున్నది నమస్తే తెలంగాణ. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘నమస్తే తెలంగాణ’ చారిత్రాత్మక పాత్రను పోషించిన విషయం తెలిసిందే. అడుగడుగునా అడ్డంకులు సృష్టించి, నిరుత్సాహమనే విషాన్ని కుమ్మరించిన నాటి మీడియా దాడుల నుంచి తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను కాపాడే రక్షణ కవచంగా నమస్తే తెలంగాణ నాడు పని చేసింది.
రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆ పవిత్ర బాధ్యతను కొనసాగిస్తున్నది. తెలంగాణ పురోభివృద్ధిని చూసి ఓర్వలేని శక్తులు, ఏదో రకంగా అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతూ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నది. దాంట్లో భాగమే, నేడు ధరణిపై ఓవైపు రైతులోకంలో చైతన్యాన్ని పెంచేలా అనేక వార్తకథనాలను ప్రచురిస్తూనే, మరోవైపు, ధరణిని వద్దంటున్న వారి అసలు గుట్టు రట్టు చేస్తున్నది. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ‘నమస్తే తెలంగాణ’ది రాజీ లేని వైఖరి.
గుండాల కృష్ణ: 80966 77031