పల్లవి: నిండు పున్నమి పూసె ఎండిన బీడు తడిసె
కర్రు నాగలి నడిసె పంటసేను మురిసె
కన్నీటి బతుకులల్ల గంగమ్మా పన్నీరై కురిసినావు గోదారమ్మ
చరణం: గలగల మని కదలి గంగ ఎద తలుపులు తెరిచె
జలజలమని గోదారమ్మ కెరటాలై ఎగసె
అలుగుదుంకి పారినావు గంగమ్మా
మా గుండెల్లోకి ఇంకి పోవె గోదారమ్మా ॥ నిండు ॥
చరణం: అప్పులతో వేగలేక రైతులాగమై పోతే
ఉరి తాటికి వేలాడి ఉసురు రాల్చుకుంటుండే
బతుకు నిలుప వచ్చినావు గంగమ్మా
మెతుకు వోలె మెరిసినావు గోదారమ్మా ॥ నిండు ॥
చరణం: దున్నరాని దుక్కులల్ల దుఃఖమంత తీరి
సల్లగ వర్ధిల్లును మా గొడ్డూ-గోదావరి
కలలను పండించినావు గంగమ్మా
మా కలతల నెడబాపినావు గోదారమ్మా ॥ నిండు ॥
చరణం: సంద్రమే తలాపుకొచ్చి సాప దూప దీరె
నింగిలోని నీటి తెప్పె నేల మీద పారె
గడప గడప దడిపినావు గంగమ్మా
మా కడుపు నింప వచ్చినావు గోదారమ్మా ॥ నిండు ॥
చరణం: చెట్టుకేమో పచ్చదనం పిట్టకేమొ వెచ్చదనం
గుమ్ములు గరిసెల్ల నిండ నువ్వే మా మూలధనం
భరోసాను నింపినావు గంగమ్మా
బంగారు భవితను చూపించినావు గోదారమ్మా ॥ నిండు ॥
చరణం: అంతగిరి పోశమ్మతో అలై బలై దీసి
రంగనాయకునికి అంతరంగమై నిలిచి
కొండ పోచమ్మ చెంత గంగమ్మ
నువు నిండ పొంగి పొరలినావు గోదారమ్మా
మల్లన్నసాగర్వై గంగమ్మా
నువ్వు ఎల్లలన్ని దాటినావు గోదారమ్మా ॥ నిండు ॥