అవును.. కరువును జయించేది కాళేశ్వరమే. వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు ఒక వరం. తెలంగాణలో సాగునీటికి సమస్య రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఒక్క కాళేశ్వరమే కాదు, అనేక జల రిజర్వాయర్లు ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయి.
నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. నైరుతి పవనాలు కొంచెం ఆలస్యంగా రావడంతో వారం కింద వర్షాలు పడినట్టే పడి, వారం రోజులుగా మళ్లీ ఎండలు మండుతున్నాయి. ఒక పది, పదిహేను రోజులు వానలు కురిస్తే సాగు చురుగ్గా సాగుతుంది. కానీ, వర్షాలు ఆలస్యం కావడంతో రైతుల్లో కొంత ఆందోళన మొదలైంది. అయితే, మనకున్న నీటి వనరులు, ప్రాజెక్టులు నీళ్లతో నిండి ఉండటం వల్ల రైతులు ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది.
వానలు ఆలస్యమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ పనులకు ఆటంకం కలుగవద్దు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటిపై సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒకవైపు ఎస్సారెస్పీ తదితర ప్రాజెక్టుల్లోకి నీటిని మళ్లిస్తూ జలాశయాల ద్వారా సాగునీటిని అందివ్వాలని నిర్ణయించారు. అందుకే అనుకోని పరిస్థితుల్లో వర్షాలు ఆలస్యమైనా వరి, తదితర పంటలకు సాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నది. కాళేశ్వరం, తదితర ప్రాజెక్టుల్లో నీటి వనరులు పుష్కలంగా ఉండటం మన రైతులు చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు.
‘వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ముందు జాగ్రతలు తీసుకోవాల్సి ఉంటుంది. సంక్షోభ సమయంలోనే పంటలు పండించి చూపించాలి. ఇన్నిరోజులు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు’ అనే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు ఎంతటి దూరదృష్టిని కలిగి ఉన్నాయో మనకు అర్థమవుతుంది. నీళ్లు లేకపోతే బతుకు లేదు. బొట్టు బొట్టు ఒడిసిపట్టి నా తెలంగాణ జల ప్రపంచంలా కనిపిస్తున్నది. ఎంతటి కష్టం వచ్చినా, ఎగువ గోదావరి నీళ్లు రాకున్నా, ప్రాణహిత ద్వారా నీళ్ల ప్రవాహం ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. ప్రాణహిత ద్వారా వచ్చి గోదావరిలో చేరి మేడిగడ్డకు చేరుతుంది. ప్రాణహిత గోదావరికి ప్రాణం. తెలంగాణ జీవకోటికి నీరే ప్రాణవాయువు. కాళేశ్వరం ప్రాజెక్టు ముప్పావు తెలంగాణ నీటి గోసను తీరుస్తున్నది. ఎస్సారెస్పీ, నిజాంసాగర్ నిండుకుండల్లా, ఇటు మిడ్మానేరు, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గౌరవెల్లి వంటి రిజర్వాయర్లు సాగునీటిని అందిస్తున్నాయి.
ఈ ప్రాజెక్టుల వల్ల ఒక వరి కర్ర సైతం ఎండిపోకుండా చివరి ఆయకట్టు దాకా నీళ్లందించే సామర్థ్యం గల ప్రాజెక్టులు నిర్మాణం జరిగాయంటే అది కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలనే ఆయన తపనకు ఉదాహరణ. అటు సూర్యాపేట, తుంగతుర్తి, వరంగల్, జనగాం ప్రాంతాలకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కృషిచేస్తున్నది. సీతారామ, భీమా లిఫ్ట్, కల్వకుర్తి తదితర ప్రాజెక్టుల ద్వారా వానకాలం పంటకు సాగు నీటిని అందిస్తున్నది.
తెలంగాణలో ఇప్పుడు సాగునీటికి కొదవ లేదు. దేశమంతా ఎడారి ప్రాంతంలా ఉన్నా ఒక్క తెలంగాణలోనే నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. మండు వేసవిలో కూడా గలగల పారుతున్న నీళ్లను చూశాం. వర్ష కాలంలో వానలు ఆలస్యమైనా పంటలకు నీళ్లిచ్చే జల వనరులు నిండుగా ఉండటమే రైతులకు కొండంత భరోసా. గత యాసంగిలో 56 లక్షల వరి పంట సాగయింది. తెలంగాణ అంటేనే వ్యవసాయ రాష్ట్రం. ఈ రంగం బాగుంటేనే అన్నిరంగాల్లో పురోగతి కనిపిస్తుంది. విత్తనాలు, ఎరువులకు ఇబ్బంది లేదు. రాష్ట్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ 2 లక్షల నుంచి 5 లక్షల టన్నులకు పెంచింది.
తెలంగాణ రాష్ట్రం అనే విత్తనం నారుగా ఎదిగి, ఆకుపచ్చ తెలంగాణగా మారి బంగారు పంటలు పండిస్తున్నది. తెలంగాణ అనే నారు పోసింది కేసీఆర్, నీరు పోస్తున్నది కేసీఆరే…
– చిటుకుల మైసారెడ్డి 94905 24724