Jammu Kashmir Elections | జమ్మూకశ్మీర్లో పదేండ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పలు రకాలుగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఎన్నికలను కశ్మీరీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే ఆర్టికల్ 370 రద్దు ద్వారా కశ్మీర్కు దఖలు పడిన ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంపై ఈ ఎన్నికలను ప్రజాభిప్రాయ సేకరణగా భావించవచ్చు. ఈ ఎన్నికల్లో 63.45 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది ఇటీవలి పార్ల మెంట్ ఎన్నికల సగటు 57.89 కంటే ఎక్కువ. అంతేకాదు, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 61.01 కంటే ఎక్కువే. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా, సోఫియాన్, కుల్గాం, ఉత్తర కశ్మీర్లోని బారాముల్లాల్లో ఓటింగ్ భారీగా పెరిగింది. దక్షిణ కశ్మీర్లో జమాతే ఇస్లామీ మద్దతుతో బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు, ఉత్తర కశ్మీర్లో బారాముల్లా ఎం పీ ఇంజినీర్ రషీద్ నేతృత్వంలోని అవామీ ఇత్తేహాద్ పార్టీ పోటీ కారణంగా పోలింగ్ శాతం పెరిగినట్టు అంచనా. 370 రద్దుతో ఓటుహక్కు పొందిన పాక్ కాందిశీకులు, వాల్మీకి తెగ ప్రజలు, గూర్ఖాలు ఈ ఎన్నికల్లో తొలిసారిగా తమ హక్కును వినియోగించుకోవడం విశేషం. వారి ఓటు నిర్ణయాత్మకం కావచ్చనే అంచనాలూ ఉండటం గమనార్హం.
కశ్మీర్ అస్తిత్వాన్ని సమూలంగా మార్చివేసిన బీజేపీ విధానాలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష లాంటివి. పదేండ్ల క్రితం పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ, పీడీపీలు ఈసారి విడివిడిగా బరిలోకి దిగాయి. బీజేపీ చేతుల్లోకి కశ్మీర్ వెళ్లకుండా అడ్డుకోవాలనే లక్ష్యంతో ఎన్సీ, కాంగ్రెస్ జట్టు కట్టాయి. స్థానిక సమస్యలు, కూడు, గూడు లాంటి అంశాలపై కాకుండా ప్రత్యేక హోదా పునరుద్ధరణ, రాష్ట్ర హోదాను తిరిగి కల్పించడం లాంటి అంశాల మీదే ఎన్నికల ప్రచారం సాగింది. రాష్ట్ర విభజన తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రమే చక్రం తిప్పుతున్నది. ఇది సగటు కశ్మీరీకి ఏ మాత్రం నచ్చని అంశమని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ గనుక గెలిస్తే ఆర్టికల్ 370 రద్దుకు ప్రజల మద్దతు ఉందని ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రజలు కోరుకుంటున్న రాష్ట్ర హోదా పునరుద్ధరణ దిశగా అడుగులు వేయవచ్చు. అలా కాకుండా హంగ్ ఏర్పడి అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిస్తే మాత్రం ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు స్వతంత్ర అభ్యర్థులు, చిన్నాచితకా పార్టీలను తనవైపు తిప్పుకోవాల్సి ఉంటుంది.
అదే కాంగ్రెస్, ఎన్సీ కూటమి గెలిస్తే రాష్ట్ర హోదా పునరుద్ధరించకుండా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే రాష్ట్ర హోదాతో పాటు ఆర్టికల్ 370 కోసం డిమాండ్లు ఊపందుకోవచ్చు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ చేయాలంటూ కూటమిలోని ఎన్సీ డిమాండ్ చేస్తుండగా, కాంగ్రెస్ కేవలం రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నది. ఈ కారణంగా కూటమి గెలిచినా ఎన్నాళ్లు అధికారంలో ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జమాతే ఇస్లామీ, ఇంజినీర్ రషీద్, పీడీపీ మద్దతు కీలకం. ఏదేమైనప్పటికీ కశ్మీరీలు అధిక సంఖ్యలో వచ్చి ఓటింగ్లో పాల్గొనడం అభినందించాల్సిన విషయం. ఎలాంటి అల్లర్లు జరగకుండా, రీపోలింగ్ లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం ప్రజాస్వామ్యానికి శుభసూచకం.