దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టడం కేంద్ర దర్యాప్తు సంస్థల బాధ్యత. శాంతి భద్రతలను నెలకొల్పడం పోలీస్ వ్యవస్థ, రక్షణ సంస్థల బాధ్యత. వాటిని ప్రారంభించిన ఉద్దేశం కూడా అదే. కానీ ఇటీవల ఈ సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని విమర్శలు వస్తున్నాయి. ఇది వాస్తవమేనని వార్తా కథనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు, పోలీస్ సంస్థల పనితీరులో సంస్కరణలు తప్పనిసరిగా మారాయి.
ప్రతి దేశంలో ప్రజలు శాంతియుతంగా జీవించడానికి, ఆర్థిక పరమైన, సామాజిక పరమైన నేరాలను అరికట్టడానికి పోలీస్, దర్యాప్తు సంస్థలు అత్యావశ్యకం. కానీ మన దేశంలో నేటికీ బ్రిటిష్ వారి సామ్రాజ్య వాద విధానాలు, పోకడలు, విధి విధానాలు పోలీస్, దర్యాప్తు సంస్థల్లో కొనసాగుతుండటం వల్ల ప్రజలకు సరైన న్యాయం జరగడం లేదు. ఆయా సంస్థల్లో రాజకీయ నాయకులు, పాలకుల ప్రమేయం ఉండటం వల్ల అవి స్వతంత్రంగా పని చేయలేకపోవడం మరో ప్రధాన లోపం. స్నేహపూరిత పోలీసింగ్ విధానంతో ఇటీవల పోలీస్ వ్యవస్థ ప్రజలకు చేరువ అవుతున్నా, నేటికీ న్యాయం జరగడంలో ఆలస్యం అవుతున్నది. దర్యాప్తు, పోలీస్ సంస్థల్లో సిబ్బంది కొరత ముఖ్యంగా ఫోరెన్సిక్ సిబ్బంది తక్కువగా ఉండటం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉండటం, దోషులను పట్టుకొని శిక్ష విధించడంలో జాప్యం తదితర కారణాల వల్ల బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదు.
ఈ నేపథ్యంలో రాష్ర్టాల పోలీసు వ్యవస్థలతోపాటు సీబీఐ, ఐబీ, ఈడీ, ఎన్ఐఏ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల్లో సంస్కరణలు వేగవంతం చేయాలి. ఆ దిశగా నూతన చట్టాలు చేయాలి. ఆయా సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి తగినంత సిబ్బందిని నియమించాలి. ఆ సంస్థలకు రాజ్యాంగ పరిపుష్టి కల్పించాలి. 2024 నాటికి అన్ని రాష్ర్టాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)లను ఏర్పాటు చేస్తామని, దేశంలోని అన్ని జిల్లాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి పరిశోధన వేగవంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించారు. ఇది అమలైతే నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం.
కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాల వల్ల, జోక్యం వల్ల ఈ సంస్థల ప్రతిష్ట మసకబారుతున్నది. నిజమైన దోషులకు సరైన శిక్ష పడటం లేదు. ప్రత్యర్థులను వేధించడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, పార్టీలు ఈ సంస్థలను వాడుకుంటున్నాయి. అందుకే ఈ సంస్థల్లో సంస్కరణలు అనివార్యమయ్యాయి. సత్యమేవ జయతే అనే సూక్తి నిజం అవ్వాలంటే ఈ సంస్కరణలు తప్పనిసరి. దేశ ప్రజలందరికీ సరైన న్యాయం జరగాలంటే, వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవాలంటే, రాజకీయ నాయకులు నిర్బయంగా ప్రజా సేవ చేయాలంటే ఈ సంస్కరణలు వెంటనే అమలు కావాలి.
1963లో కేంద్ర ప్రభుత్వ తీర్మానం ద్వారా సీబీఐ ఏర్పాటైంది. మొదట్లో బాగా పని చేసిన ఆ సంస్థ ఆ తర్వాత సిబ్బంది కొరత, కేసుల భారం, రాజకీయ జోక్యం వల్ల ప్రాభవం కోల్పోయింది. నేటికీ ఆ సంస్థకు రాజ్యాంగ పరమైన పూర్తి రక్షణ, విధి విధానాలు, మౌలిక సదుపాయాలు లేవు. ఎల్.పి.సింగ్ కమిటీ, అనేక పార్లమెంటు కమిటీలు ఈ సంస్థను బలోపేతం చేయడానికి పలు సూచనలు చేశాయి. కానీ వాటినీ ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదు. మరో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇంటిలిజెన్స్ బ్యూరో(ఐబీ)ని బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేశారు. దీనికీ రాజ్యాంగ పరమైన పూర్తి రక్షణ విధివిధానాలు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉండగా నేటికీ కల్పించలేదు. ఆధునిక అవసరాలకు, భారత దేశ స్థితిగతులకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్ద లేదు. దర్యాప్తు సంస్థలు నిజాయితీగా, పారదర్శకంగా, ధైర్యంగా పని చేయడానికి అమెరికాలో కాంగ్రెస్నల్ కమిటీలు సూచనలు ఇస్తుంటాయి. బ్రిటన్లో దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పని చేయడం కోసం రాజ్యాంగ రక్షణ కల్పించారు. ఇలాంటి సంస్కరణలు మన దేశంలోనూ అమలు చేయాలి. ప్రస్తుతం మన దేశంలో 530 ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయి. వీటిలో 32 ప్రధానమైనవి, 80 ప్రాంతీయమైనవి, మిగిలిన 418 మొబైల్ యూనిట్లు.
140 కోట్ల జనాభా కలిగిన మన దేశ అవసరాలకు ఈ ల్యాబ్స్ సరిపోవు. 2020లో ఏర్పాటు చేసిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి తోడుగా మరో మూడు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. ఫోరెన్సిక్ సిబ్బందికి ఈ యూనివర్సిటీల్లో శిక్షణ ఇవ్వాలి. నేరాలకు సంబంధించిన చట్టాలపై వారికి అవగాహన కల్పించాలి. కంప్యూటర్ సైన్స్లో నైపుణ్యాలు పెంపొందించుకోవడంలో శిక్షణ ఇవ్వాలి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి, ఐదు సంవత్సరాల లోపు తగినంత తర్ఫీదు ఇవ్వాలి. నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలి.
రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఉన్న పోలీస్ వ్యవస్థలోనూ పలు మార్పులు చేర్పులు చేయాలి. ఆధునిక అవసరాలకు తగినట్లు విధి విధానాలు రూపొందించాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, నూతన ఆయుధాలను పోలీసులకు అందించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రజలతో మమేకం కావడం దేశ వ్యాప్తంగా ఒకే రీతిలో అమలు కావాలి. స్మార్ట్ పోలీస్ వ్యవస్థను ఆచరణలోకి తేవాలి. అవసరమైన చోట సిబ్బంది నియామకం చేపట్టాలి. ఈ సంస్కరణలన్నీ అమలు చేస్తేనే పోలీస్, దర్యాప్తు సంస్థలు ప్రజాదరణ, ప్రజామోదం పొందుతాయి. నిజాయితీగా, అప్రమత్తంగా, జవాబుదారీగా ఉండే పోలీసులు, దర్యాప్తు సంస్థల అధికారులు ప్రజలకు స్వేచ్ఛగా సేవ చేసే వాతావరణాన్ని కల్పించాల్సింది అధికారంలో ఉన్న ప్రభుత్వాలే.
ఐ.ప్రసాదరావు: 63056 82733