టీచర్ కావాలనే ఏకైక లక్ష్యంతో డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన యువత కలలపై రాష్ట్ర సర్కార్ నీళ్లు చల్లింది. టెట్ నిర్వహించకుండానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టెట్కు వివిధ కారణాల వల్ల అనేకమం ది గైర్హాజరయ్యారు. 2 లక్షల మంది దాకా అర్హత సాధించలేదు. వారితో పాటు కొత్తగా ఉత్తీర్ణులైనవారితో కలిపి సుమారు 4 లక్షల మంది టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రజాపాలన అంటూ చెప్పుకొంటున్న రేవంత్ సర్కార్ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో టెట్ నిర్వహించింది. మళ్లీ 2012లో మరోసారి టెట్ జరగగా, అదే ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదలైంది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2016లో మరోసారి టెట్ జరిగింది. ఆ తర్వాత 2017లో టెట్ నిర్వహించి.. టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఐదేండ్ల తర్వాత 2022 జూన్లో టెట్ పరీక్ష నిర్వహించారు. 2023 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహించారు. పేపర్-1కు 2,23,582 మంది హాజరయ్యారు. వారిలో 82,489 (36.89 శాతం) మంది మాత్రమే అర్హత సాధించారు. పేపర్-2కు 1,90,047 అభ్యర్థులు హాజరవగా.. 29,073 (15.30 శాతం) మంది అర్హత సాధించారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ, టెట్ నిర్వహణ ను గాలికి వదిలేసింది. మొదట టెట్ నిర్వహించి ఆ తర్వాత డీఎస్సీ నిర్వహిస్తే మాలాంటి ఎంతో మంది నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.