వాల్మీకి రామాయణం యుద్ధ కాండ. మొదటి రోజు రాముడు ప్రత్యక్షంగా రావణాసురుడితో తలపడ్డాడు. రాముడు నేల మీద నిలుచుని బాణాలు వేస్తూ ధర్మ యుద్ధం చేస్తున్నాడు. రావణుడేమో నేల మీద, ఆకాశంలో, రథం కనిపించకుండా అదృశ్య రూపంలో రాక్షస మాయలన్నీ పన్ని చిత్ర విచిత్రమయిన యుద్ధం చేస్తున్నాడు. అయినా సరే రామబాణం గురి తప్పలేదు. రావణుడి రథం ముక్కలై కింద పడింది. కిరీటం ఎగిరిపోయింది. చావుదప్పి కన్ను లొట్టబోయి నేల మీద ఆయాసపడుతున్నాడు. నిరాయుధుడిని, దీనంగా పడి ఉన్నవాడిని రాముడు కొట్టడు.
పో! ఈరోజుకు ఇంటికెళ్లి…రేపు సూర్యోదయం తర్వాత మళ్లీ రా! తేల్చుకుందాం! అన్నాడు రాముడు. ఈ మాటకే రావణుడు చచ్చిపోయాడని మిగతా రామాయణాలు అన్నాయి.
రెండోరోజు సూర్యోదయం అయ్యింది. నిన్న జరిగిన యుద్ధంలో రావణుడి మాయలన్నీ ఒకసారి రాముడికి గుర్తుకొచ్చాయి. రావణుడిని గెలవగలనా? అనే సందేహం కూడా మది లో మెదిలినట్లుంది. అంతే. ఆ క్షణంలో అగస్త్య మహాముని ఆకా శం నుంచి నేలకు దిగాడు. రాముడి భుజం తట్టాడు. అగస్త్యుడు రాముడికి ఆదిత్య హృదయం చెప్పాడు. ఆ ఆదిత్య హృదయాన్ని జపించి…సూర్యుడి శక్తిని పొంది…ఈ క్షణమే రావణుడిని వధించు! అని మాయమైపోయాడు. రాముడు అలాగే చేశాడు. రావణ సంహారం జరిగింది.
అదే రామాయణంలో కొంచెం ముందు- సూర్యుడి రథసారథి అనూరుడి కొడుకులు జటాయువు- సంపాతి ఇద్దరూ ఒకరోజు సూర్యమండలం దాకా ముందు ఎవరు వెళ్లి వస్తారో చూద్దామా అని సరదాగా పోటీ పెట్టుకుని లక్షల కిలో మీటర్లు పైకి… పైపైకి ఎగురుతూనే ఉన్నారు. దాదాపు సూర్యమండలం దగ్గరై వేడి పెరుగుతోంది. జటాయువు కొంచెం ముందు ఉండడంతో కళ్లు బైర్లు కమ్మి స్పృహతప్పి పడిపోయే స్థితి. కిందున్న సంపాతి గమనించి రెక్కల వేగం పెంచి జటాయువు మీద తన రెక్కలను కప్పి రక్షించింది. ఒక్క క్షణంలో రెక్కలు మాడి మసై సంపాతి కింద ఎక్కడో తమిళనాడు దగ్గర పడ్డాడు. రెక్కలు కాలకపోయినా స్పృహతప్పి జటాయువు దండకారణ్యంలో పడ్డా డు. ఇద్దరూ రామకార్యం కోసం వేచి ఉంటారు. జటాయువు రావణుడి కత్తివేటుకు రెక్కలు తెగి రాముడి ఒడిలో మరణిస్తా డు. సంపాతి హనుమ బృందానికి సీత జాడ చెప్పడంతో పోయిన రెక్కలు వచ్చి గాల్లోకి ఎగురుతాడు.
ఇంకొంచెం ముందు కెళితే ఆంజనేయుడు రోజుల పిల్లాడిగా ఉయ్యాల్లో ఉండగా…పైన ఎర్రగా ఉన్న సూర్యుడిని చూసి…తినే పండనుకుని సూర్యుడి దాకా ఎగురుతాడు. అదే సమయానికి సూర్యుడిని మింగాల్సిన రాహువు వస్తుంటాడు. ఎర్రపండు కంటే ఈ నల్ల పండు బాగుందే అని రాహువును పట్టుకోబోతాడు. రాహువు ఇంద్రుడిని శరణు వేడితే…ఇంద్రుడు రాగానే ఈ తెల్లపండు ఇంకా బాగుందే అనుకుని అటు వెళతాడు. ఇక లాభం లేదనుకుని ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొడితే ఆంజనేయుడు అంతెత్తు నుంచి కింద పడతాడు. దెబ్బకు పిల్లా డి మూతి కొద్దిగా వాచింది. పిల్లాడికి ఇంకేమీ కాలేదు కానీ.. పిల్లాడు పడ్డ చోట కొండ పిండి అయ్యింది. తండ్రిగా వాయుదేవుడు అలగడం, దెబ్బకు లోకాల ఊపిరి కాసేపు ఆగిపోవడం చివరకు బ్రహ్మ కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దడం అంతా పెద్ద పంచాయతీ. మహా అల్లరి పిల్లాడు హనుమకు చదువు చెప్పడానికి పెద్ద పెద్ద బృహస్పతులు వణికిపోతే సూర్యుడు ఒప్పుకుంటాడు. తూర్పు మీద ఒక కాలు…పడమర మీద ఒక కాలు పెట్టి…సూర్యుడు ఎటు వెళితే అటు ఆయనకు ఎదురుగా నిలుచుని హనుమ సకల శాస్ర్తాలను బుద్ధిగా నేర్చుకుంటాడు.
సూర్యుడి కొడుకు యముడు. కూతురు యమున. సూర్యుడి నుంచి బయలుదేరిన కిరణాల గుంపులో వెయ్యిరకాల కిరణాలుంటాయంటుంది సూర్యారాధన స్తోత్రం. ఒక్కో కిరణం ఒక్కో పని చేయాలి. మంచును కరిగించే కిరణాలు కొన్ని. చెట్లకు పత్రహరితాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని. నీళ్లను ఆవిరి చేసి మే ఘాలకు చేర్చే కిరణాలు కొన్ని. వేడినిచ్చేవి కొన్ని. వెలుగులు పంచేవి కొన్ని. శక్తినిచ్చే కిరణాలు కొన్ని. ఆరోగ్యాన్ని ప్రసాదించే వి కొన్ని. లేత కిరణాలు కొన్ని. ముదురు కిరణాలు కొన్ని. ఎ రుపు రంగు కిరణాలు కొన్ని. పసుపు రంగువి కొన్ని. బంగారు రంగు కిరణాలు కొన్ని. అతి నీలలోహిత కిరణాలు కొన్ని.
ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్
గాయత్రీ మంత్ర రహస్యమే సూర్యుడి కిరణం. సూర్యుడి కిరణమే గాయత్రీ దేవి నివాసం. అంటే వెలుగే దైవం. వెలుగే చైత న్యం. వెలుగే జ్ఞానం. వెలుగే శక్తి. వెలుగే సర్వస్వం. సూర్యుడు లేకపోతే అంతా చీకటి. చిమ్మ చీకటి.
150 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి గురించి తెలుసుకోవడానికి…15 లక్షల కిలో మీటర్ల దూరం వరకు వెళ్ళడానికి వీలుగా ఆదిత్య ఎల్-1 ను ప్రవేశ పెట్టింది ఇస్రో.
‘ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్’ అని మన రుషుల వాక్కు. ఇప్పుడు ఇస్రో రుషులు ఏయే కొత్త విషయాలు చెబుతారో!.. ఎదురుచూద్దాం.
విష్ణువు రెండు కళ్లు సూర్య- చంద్రులు అంటుంది విష్ణు సహస్రనామం. మొన్న చంద్రయాన్-3 తో భారత్ చంద్రుడి మీద కాలుమోపి కన్ను తెరిచింది. ఇప్పుడు సూర్యుడి ముందు కన్ను తెరవడానికి ఆదిత్య ఎల్-1 బయలుదేరిం ది. ఇక సూర్యచంద్రులకు భారత్ రెండు కళ్లు. జయహో ఇస్రో… శభాష్ ఇస్రో
-పమిడికాల్వ మధుసూదన్
99890 90018