దశాబ్ద కాలం క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్), ఇటీవల నిర్వహించిన తెలంగాణ కులగణన సర్వే (టీసీఎస్) గణాంకాల మధ్య బీసీ జనాభా శాతం విషయంలో వ్యత్యాసం ఉన్నదన్న చర్చ తీవ్రంగా జరుగుతున్నది. బీసీల జనాభా శాతం పెరిగిందన్న ప్రభుత్వ వాదన సరైనది కాదని బీఆర్ఎస్ నాయకులు సోదాహరణంగా గణాంకాలతో ఉటంకిస్తూ విభేదిస్తున్నారు. టీసీఎస్లో పెరిగిన బీసీల శాతం ముస్లిం బీసీలను, జనరల్ బీసీ క్యాటగిరీలో చేర్చడం వల్లేనన్నది బీఆర్ఎస్ నాయకుల వాదన.
ఒక ప్రధాన ప్రతిపక్షంగా, గతంలో చిత్తశుద్ధితో సమగ్ర కుటుంబ సర్వే చేసిన పార్టీగా బీఆర్ఎస్ ఇచ్చే సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ఎస్కేఎస్, టీసీఎస్లలోని మెరుగైన అంశాలను తీసుకొని అవసరమైతే ఒక శాస్త్రీయ ప్రత్యామ్నాయ హైబ్రిడ్ మాడల్ రూపొందించే ఆలోచన చేస్తామని సభాముఖంగా సభానాయకుడు శాసనసభలో హామీ ఇచ్చినట్టయితే ఆయన వ్యక్తిత్వం ఆకాశం ఎత్తున ఎదిగేది. అదొక మేలైన మార్గంగా పరిణమించడానికి బాటలు వేసేది. తద్వారా రాజకీయాలకు అతీతంగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరువలోకి వచ్చే సదవకాశం పరిపూర్ణంగా కలిగేది.
ప్రభుత్వం, దాని నాయకుడి వాదననే పరిగణలోకి తీసుకుని విశ్లేషిస్తే, వారు చెప్తున్నట్టు తెలంగాణ కులగణన ఎంత మేలు కలిగించేదైనప్పటికీ, బీసీ జనాభా శాతం గణనలో తేడాలు, ముస్లిం బీసీలను హిందూ బీసీలతో కలిపి చూపడం లాంటి అంశాలు చర్చకు అవకాశం ఇస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతో వీటిని పోల్చి చూపిస్తూ, బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్న వ్యత్యాసాలను, అధికారపక్ష నాయకులు ఎవరికి నచ్చిన రీతిలో వారు, శక్తివంచనలేకుండా తమ వాదనను సమర్థించుకోవడం హాస్యాస్పదం. ఎస్కేఎస్ 100 శాతం గృహ గణనను జరిపి గణాంకాలను క్రోడీకరించగా, దీనికి భిన్నంగా, టీసీఎస్ కేవలం 96.9% కవరేజీ మాత్రమే సాధించింది. ఆ గణన ఆధారంగానే, కులాల వారీగా వివరమైన విభజనను అందించింది. సమగ్ర కుటుంబ సర్వే, కులగణన సర్వేలు రెండింటినీ సమన్వయపరుస్తూ, గణాంకాలను సమగ్రంగా విశ్లేషించి, సంక్షేమం, రిజర్వేషన్ విధానాలను రూపొందించడం ప్రభుత్వానికి మంచిది.
సమగ్ర కుటుంబ సర్వే దేశంలోనే అలా నిర్వహించిన వాటిలో మొదటిది. 2014 ఆగస్టు 19న నాడు 90 లక్షల కుటుంబాలను కవర్ చేస్తూ నిర్వహించారు. ప్రతి ఒక్కరి సమగ్ర సామాజిక-ఆర్థిక గణాంకాలను సేకరించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్టంగా, లాభదాయకంగా అర్హులైనవారికి అందేలా చూడడం సర్వే మౌలిక లక్ష్యం. మానవ వనరుల సహాయంతో ఒకే ఒక్క రోజులో పూర్తి డాటా సేకరించి, కేవలం 14 రోజుల్లో కంప్యూటర్లో డాటా ఎంట్రీ చేశారు. ఇదే బాటలో దశాబ్దం తరువాత మొదటి ‘కులగణన’ అంటూ 1.12 కోట్ల కుటుంబాలను కవర్ చేసినట్టు ప్రభుత్వం చెప్తున్నది. ఈ గణనకు ఎస్కేఎస్లాగా ఒకే ఒక్క రోజులో కాకుండా 50 రోజులకు పైగా సమయం పట్టింది.
సర్వేల మధ్య సారూప్యతలు, వ్యత్యాసాలు ఉన్నాయనేది వాస్తవం. సమగ్ర కుటుంబ సర్వే 100 శాతం గణన ఆధారంగా బీసీల జనాభాను 51 శాతంగా పేర్కొన్నది. టీసీఎస్ 96.9 శాతం కవరేజీ ఆధారంగా బీసీల జనాభాను 56.33 శాతంగా పేర్కొంటూనే, హిందూ బీసీలు 46.25 శాతం, ముస్లిం బీసీలు 10.08 శాతం అని మెలిక పెట్టింది. షెడ్యూల్డ్ కులాలు ఎస్కేఎస్లో 18 శాతం కాగా, టీసీఎస్లో 17.43 శాతం. షెడ్యూల్డ్ తెగలు ఎస్కేఎస్లో 10 శాతం కాగా, టీసీఎస్లో 10.45 శాతం. ఇతర కులాల వారు (ఓసీలు) ఎస్కేఎస్లో 21 శాతం కాగా, టీసీఎస్లో 15.79 శాతంగా నమోదైంది. రెండు సర్వేల్లో ఎస్సీ, ఎస్టీ శాతాలు దాదాపు ఒకేలా ఉండటం గమనార్హం. ఎస్కేఎస్ 51 శాతం బీసీ జనాభాలో ముస్లిం బీసీలు లేరు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుదల విషయంలో పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందనడంలో సందేహం లేదు. ఫిబ్రవరి 4న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ కేంద్రం కూడా టీసీఎస్ తరహాలో కుల, సామాజిక-ఆర్థిక సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. టీసీఎస్ చారిత్రక ప్రాముఖ్యతను రేవంత్ నొక్కి వక్కాణిస్తూ బీసీల హక్కుల సాధన విషయంలోనూ, రిజర్వేషన్ల విషయంలోనూ రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలని సూచించారు. కానీ, ఏడేండ్లు వెనక్కి వెళ్తే 2017 ఏప్రిల్ 16న తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదించబడిన వేళ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే డాటా పరిపూర్ణమైనదని, అత్యున్నత న్యాయస్థానం విధించిన 50 శాతం పరిమితిని దాటి రిజర్వేషన్లు పెంచడానికి అది సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేసీఆర్ అపారమైన చొరవ తీసుకున్నారు. అలాగే, ముస్లిం బీసీ-ఈ రిజర్వేషన్ను 4 శాతం నుంచి 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్ను 6 శాతం నుంచి 10 శాతం, ఎస్సీ రిజర్వేషన్ను 15 శాతం నుంచి 16 శాతానికి పెంచే ప్రతిపాదన చేశారు. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి, రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ల (42 శాతం) పెంపుతో సహా, మొత్తం రిజర్వేషన్లను 62 శాతానికి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా నిరంతర కృషి చేశారు.
బీసీల హక్కుల సాధన విషయంలో, రిజర్వేషన్ల విషయంలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టాలి. రేవంత్రెడ్డి కేవలం అసెంబ్లీలో చెప్పడమే కాకుండా త్రికరణశుద్ధితో దాన్ని ఆచరణలో పెట్టడానికి చొరవ తీసుకోవాలి. వనం జ్వాలా నరసింహరావు
బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం గణాంకాలను వాడుకోవడం కాకుండా, వాటిని సామాజిక న్యాయ సాధనంగా ఉపయోగించాలి. ఏదేమైనా, కేసీఆర్, రేవంత్ అనుసరించే మార్గాల్లోనే వ్యత్యాసం కనబడుతున్నది. ఎవరి మార్గాన్ని ఎవరు అనుసరిస్తున్నారో, అనుకరిస్తున్నారనేది వేరే సంగతి. కాకపోతే, వినయంగా వాస్తవాలను అంగీకరించకపోవడంలోనే తేడా కనిపిస్తున్నది. రాజకీయమంటే ఇదేనేమో! ‘మీ చర్యలు ఇతరులను మరిన్ని కలలు కనేటట్టు, మరికొంత ఎక్కువగా నేర్చుకునేటట్టు, ఎక్కువ పనిచేసేట్టు, ఇంకా మెరుగయ్యేటట్టు ప్రేరేపిస్తే, అప్పుడు మీరు నిజమైన నాయకుడు అవుతారు’ అని అమెరికా 6వ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ అన్నారు. అంటే, నాయకుడి ప్రధాన బాధ్యత, తాను నడుస్తూ, ఇతరులను తనతోపాటు నడిపిస్తూ లక్ష్యసాధన దిశగా మలచుకోవడం. సర్వేలు, డాటాను పక్కన పెడితే ఎవరు ఎవరిని ప్రేరేపించారు? ఎవరి ప్రభావం ఎవరిమీద పడింది? అనేది అందరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నది.
కులగణన సర్వేలో ముస్లిం బీసీలను జనరల్ బీసీ క్యాటగిరీలో చేర్చడం వల్ల, హిందూ బీసీల వాటా తగ్గిపోతుందని బీసీ నేతలు, మేధావులు భావిస్తున్నారు. ఆందోళన పడుతున్నారు. ఇది సహజం. సర్వే డాటాను సమాజ వాస్తవాలను ప్రతిబింబించేలా, మారుతున్న సామాజిక, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా రిజర్వేషన్ విధానాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది.
అందుకే భేషజాలను పక్కనపెట్టి, ఎస్కేఎస్ డాటాను తెలంగాణ కులసర్వే డేటాకు ఎలా అనుసంధానం చేయవచ్చో ఆలోచించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాలకు మేలు కలిగేలా పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయ హైబ్రిడ్ మాడల్ను రూపొందించాలి. వివాదాన్ని తీవ్రతరం చేయకుండా పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నం జరగాలి. సామాజిక-ఆర్థిక దృక్పథంలో సమతుల్య అభివృద్ధి అవసరం. దానికి చొరవ చూపాల్సింది ప్రభుత్వమే.
వివిధ రంగాలకు చెందిన బీసీ సామాజిక వర్గాల ప్రతినిధుల భయాలను ప్రభుత్వం తొలగించాలి. ప్రభుత్వం, మేధావులు, అధికార-ప్రతిపక్ష బీసీ నాయకులు ఉమ్మడిగా రాజకీయ అడ్డంకులను అధిగమించే దిశగా ఎవరిపాత్ర వారు పోషించాలి. నెల రోజులు ఆలస్యమైనా ఏకాభిప్రాయ సాధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పూనుకోవాలి. బీసీల హక్కుల సాధన విషయంలో, రిజర్వేషన్ల విషయంలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టాలి. రేవంత్రెడ్డి కేవలం అసెంబ్లీలో చెప్పడమే కాకుండా త్రికరణశుద్ధితో దాన్ని ఆచరణలో పెట్టడానికి చొరవ తీసుకోవాలి. సర్వపక్ష ఆమోదమార్గం అన్నిటికన్నా ఉత్తమమైనది. దీని ద్వారా ఒక సమతుల్యమైన హైబ్రిడ్ మాడల్ అమలుకు మార్గం సుగమం అవుతుంది. సమగ్ర కుటుంబ సర్వే అయినా, తెలంగాణ కుల సర్వే అయినా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తమ హక్కులను పరిరక్షించుకోవాలి. ఆ దిశగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వేసిన బలమైన పునాదులమీద నిర్మాణం చేసే బాధ్యత మలి ముఖ్యమంత్రి మీద వున్నది.