1960లో పాకిస్థాన్తో ఒప్పందం జరిగినప్పటికీ రావి నదిపై ఆనకట్టను నిర్మించడంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాక్కు అప్పనంగా నదీ జలాలు అందడంపై స్పందించిన పీవీ నరసింహారావు అప్పటి ప్రధాని హోదాలో 1995లో కండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే మూడేండ్లలోనే పూర్తి కావలసిన ప్రాజెక్టు.. రాష్ర్టాల మధ్య వివాదాలు, తర్వాతి పాలకుల చిత్తశుద్ధి లేమి కారణంగా మరో 25 ఏండ్లు ఆలస్యంగా ఇటీవల పూర్తయింది. దాంతో పాకిస్థాన్కు రావి నీటి సరఫరాను ఆపి భారత్లో వినియోగించుకునే అవకాశం మనకు దక్కింది. ఈ ప్రాజెక్టుకు ఆద్యుడు మన పీవీ కావడం మనకు గర్వకారణం.
PV Narasimha Rao | సింధు నదీ వ్యవస్థలోని మూడు తూర్పు నదులలో రావి ఒకటి.1960లో భారత్, పాకిస్థాన్ల మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో సింధు నదీ వ్యవస్థలోని ఆరు నదుల పంపకంపై ఒప్పందం జరిగింది.దాని ప్రకారం సింధు వ్యవస్థలోని పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ల నీరు పాకిస్థాన్ వాటాలోకి వస్తుంది. రావి, బియాస్, సట్లెజ్ అనే మూడు తూర్పు నదుల నీటిని భారత్ ఉపయోగించుకోనుంది.
ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్థాన్ మూడు పశ్చిమ నదుల నుంచి 135 మిలియన్ ఎకరాల అడుగులు (ఎంఎఎఫ్) పొందుతుంది. రావి నదిపై రంజిత్ సాగర్ ఆనకట్టకు 11 కిలోమీటర్ల దిగువన, మాధోపూర్ బ్యారేజీకి 8 కిలోమీటర్ల ఎగువన ఉన్న షాపూర్ కండి ఆనకట్ట రావి జలాలను బాగా ఉపయోగించుకోవడానికి భారతదేశానికి సహాయపడుతుంది.
ఒప్పందం జరిగినప్పటికీ కేంద్రం సమగ్రమైన యోచన చేయకపోవడంతో రావి నది పాకిస్థాన్లోకి ప్రవహిస్తుండటంతో భారత్ 24 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకోలేకపోయింది. 35 ఏండ్లుగా భారత్కు జరిగిన నష్టాన్ని గ్రహించిన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, 1995 ఏప్రిల్ 20న షాపూర్కండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి మూడేండ్లలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
అయితే, తర్వాత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించలేకపోవడంతో ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. తర్వాత పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్ల మధ్య ఏర్పడ్డ వివాదాల కారణంగా ప్రాజెక్టు పురోగతి సాధించలేకపోయింది. అటు పిమ్మట వచ్చిన ప్రభుత్వాలేవీ కూడా ఈ ప్రాజెక్టుపై అంతగా శ్రద్ధ చూపలేదన్నది కూడా ఒక కారణం. నవంబర్ 2001లో ఆనకట్ట పనులకు ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపినప్పటికీ పంజాబ్ నిధుల కొరతను ఎదుర్కొంటున్నందున పనులు పెద్దగా పురోగతి సాధించలేకపోయాయి.
గత 24 ఏండ్లలో ఈ ప్రాజెక్టుకు అనేక శంకుస్థాపనలు జరిగాయి. పనులు వేగవంతం చేస్తామని 2001 ఏప్రిల్ 4న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హామీ ఇచ్చారు. పఠాన్కోట్ సమీపంలోని రంజిత్ సాగర్ డ్యాం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సందర్భంగా వాజపేయి ఈ ప్రకటన చేశారు.ఇద్దరు ప్రధానులు, ముఖ్యమంత్రులు, పంజాబ్ క్యాబినెట్ మంత్రులతో సహా రాజకీయ నాయకులు శంకుస్థాపనలు చేసినప్పటికీ, ప్రాజెక్టు పురోగతి నత్తనడకనే సాగింది.
రావి, బియాస్ జలాలకు సంబంధించి 1981 డిసెంబర్ 31న పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తూ 2004 జూలై 12న పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా రూపొందించిన ఈ బిల్లులోని పంజాబ్ నదీజలాల హక్కులను కాంగ్రెస్, అకాలీలు ఏకపక్షంగా సమర్థించారు.ఈ బిల్లు నీటి పంపకాల సమీకరణాన్ని మొత్తం మార్చేసింది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) ప్రకారం రాష్ట్రపతి తన అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జమ్మూకశ్మీర్ను పార్టీగా చేర్చి నోటీసులు జారీ చేయడంతో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ 2004 నవంబర్ 20న సుప్రీంకోర్టులో సమాధానం దాఖలు చేసింది.1966 పంజాబ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 78, 79లను భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పంజాబ్ ప్రభుత్వం 2007లో సుప్రీంకోర్టులో సివిల్ దావా వేసింది. ఇలా వివాదం కోర్టు పరిధిలోకి చేరడంతో ప్రాజెక్టు మూలన పడింది.
చివరికి 2018 సెప్టెంబర్ 8న న్యూఢిల్లీలో ఎంవోడబ్ల్యూఆర్, ఆర్డీ అండ్ జీఆర్ ఆధ్వర్యంలో పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ర్టాల మధ్య ఒప్పందం కుదిరింది.దాంతో 2018 డిసెంబర్ 6న కేంద్ర మంత్రివర్గం రావి నదిపై పంజాబ్లోని షాపూర్ కండి ప్రాజెక్టు అమలుకు ఆమోదం తెలిపింది. తొలుత 1995లో శంకుస్థాపన చేసే నాటికి రూ.286 కోట్ల అంచనాలతో ఉన్న ప్రాజెక్టు వ్యయం తరువాత 31.10.2018న జరిగిన 138వ ఎంవోడబ్ల్యూఆర్, ఆర్డీ అండ్ జీఆర్ సలహా కమిటీ సమావేశంలో రూ.2715.70 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం రూ.3,300 కోట్లకు ఎగబాకింది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది.
షాపూర్ కండి మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 55.5 మీటర్ల ఎత్తైన ఆనకట్టను నిర్మించారు. ఇందులో 206 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో రెండు జలవిద్యుత్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల మాధోపూర్ బ్యారేజీ ద్వారా పాకిస్థాన్కు వృథాగా పోతున్న రావి నీటిని అడ్డుకోవచ్చు.అయితే, ఈ ప్రాజెక్టు పూర్తి ప్రయోజనం విద్యుత్ ప్లాంట్లు పూర్తయ్యాకే సాకారం అవుతుంది. ఈ రెండు జలవిద్యుత్ కేంద్రాలు 2025 చివరి నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు.
ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారంలో డ్యాంలో నీటి నిల్వను అధికారులు ప్రారంభిస్తారు. దీని ద్వారా పంజాబ్లో 5 వేల హెక్టార్లు, జమ్మూకశ్మీర్లో 32 వేల హెక్టార్లకు సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు.షాపూర్ కండి ఆనకట్ట అందుబాటులోకి రావడంతో పాకిస్థాన్కు నీరు వెళ్లకుండా రంజిత్సాగర్ డ్యాంను పూర్తి సామర్థ్యంతో నడపగలుగుతామని, షాపూర్ కంది దిగువకు నియంత్రిత నీటి విడుదల ఉంటుందని, ఇది మాధోపూర్ బ్యారేజీ వద్ద నీటిని సద్వినియోగానికి వీలు కల్పిస్తుందని వివరించారు. ఇదంతా ఎంతో ముందుచూపుతో వ్యవహరించిన మన తెలంగాణ బిడ్డ పీవీ ఘనతే.
– స్వామి ఆర్వీవీయస్