ఆహారధాన్యాల నిర్వహణలో కేంద్రం చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నది. 2006కు ముందు దేశ అవసరాలను అంచనా వేయకుండా తక్కువగా ఆహార ధాన్యాన్ని సేకరించింది. సేకరించిన ధాన్యంలో కొన్ని టన్నులు విదేశాలకు ఎగుమతి కూడా చేసింది. చివరికి మన అవసరాల కోసం గోధుమలను విదేశాల నుంచి 2006 లో మళ్లీ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదే ధోరణి అవలంబించింది. నిపుణుల నుంచి విమర్శలు ఎదురవడంతో ఎగుమతులను నిలిపివేసింది. ఆహారధా న్యాల సేకరణ, నిర్వహణలో శాస్త్రీయ అధ్యయనం, ఆచరణే ఈ సమస్యకు పరిష్కారం.
2006-07 (ఏప్రిల్-మార్చి)లో అవసరమైన దాని కన్నా తక్కువగా 9.23 మిలియన్ మెట్రిక్ టన్నుల(ఎంఎంటీ) గోధుమలు సేకరించారు. అంతకు ముందు ఏడాది సేకరణ కన్నా అది చాలా తక్కువ. బఫర్ స్టాక్స్(ధరలు పెరిగినప్పుడు వాడుకునేందుకు నిల్వ చేసేవి) కూడా 2 ఎంఎంటీలు తగ్గాయి. ఇది ఆహార భద్రత చర్యల్లో తీవ్ర లోపం. దీంతో ఆ సీజన్లో ధాన్య సేకరణ, నిల్వల విషయంలో ప్రభుత్వం తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక వైపు దిగుమతులు, సేకరణ తక్కువ ఉన్నాయి. మరో వైపు సెంట్రల్ పూల్లో కేంద్రం వద్ద భారీ నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. కేంద్ర గిడ్డంగుల్లోని ధాన్యం ఎలుకలకు ఆహారం అవుతున్నదని విమర్శలు వస్తున్న సమయంలోనే దేశంలో ఆహార కొరత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎఫ్సీఐ గోదాముల్లోని కొంత ధాన్యాన్ని ప్రజలకు పంపిణీ చేయాలనుకున్నది.
2004-05లో 16.7ఎంఎంటీలు, 2005-06లో 14.8ఎంఎంటీల గోధుమ లు… ఇలా ధాన్య సేకరణ తగ్గుతూ వచ్చింది. దేశ అవసరాలపై ఏ విధమైన అవగాహన లేకుండానే ఈ పని చేయడంతో ధాన్య సేకరణ క్షీణించింది. మనకు చాలినంత నిల్వలు ఉన్నాయని అపోహపడి ప్రపంచ దేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేస్తాం. ఫలితంగా.. ఊహించని పరిణామాలతో మన గోదాము లు ఖాళీ అవుతాయి. మొత్తం ప్రక్రియను గమనిస్తే ఇది లోపాలతో కూడిన ప్రణాళిక అని అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం ధాన్య సేకరణ ఇలాగే తగ్గడం ఆందోళనకరమైన విషయం.
వాతావరణం ముఖ్యంగా ఉష్ణోగ్రత పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భార త ఆహార సంస్థ, వ్యవసాయ మంత్రిత్వశాఖ ఈ ఏడాది 75 ఎంఎంటీలకన్నా ఎక్కువ ధాన్య సేకరణ ఉంటుందన్న అంచనాతోనే పాత నిల్వలను పంచేసింది. అప్పుడే మూడో ముందస్తు అంచనా ఒకటి చేశారు. అప్పటికే జరిగే నష్టం జరిగిపోయింది. అప్పుడు నేను కొన్ని ప్రైవేటు సంస్థల సాయంతో వాతావరణ ప్రభావం, ప్రైవేట్ నిల్వల ప్రభావం గురించి సమాచారం సేకరించాను. దేశంలో ప్రైవేటు నిల్వలు ఎంత ఉంటాయో ప్రభుత్వం వద్ద ఏ సమాచారం లేదు. ప్రభుత్వం తన విధాన నిర్ణయాలకు ప్రభుత్వ గిడ్డంగుల్లోని నిల్వలపైనే ఆధారపడుతూ, ప్రైవేటు నిల్వల ప్రాధాన్యాన్ని విస్మరిస్తున్నది. ఒక బహుళజాతి కంపెనీ సీఈవో ఉత్తర, పశ్చిమ భారత దేశం లో రోజువారీగా వాతావరణ మార్పులను గణించి, అధ్యయనం చేసి, ధాన్యపు గింజ పరిమాణాన్ని కూడా అంచనా వేసి 68 ఎం ఎంటీల దిగుబడి వస్తుందని చెప్పారు. ప్రభుత్వ రంగాలు ఈ అతి ముఖ్యమైన విషయాన్ని పట్టించుకోవటం లేదు.
మరో ప్రైవేటు బహుళజాతి కంపెనీ అధికారి గోధుమల బ్యాలెన్స్ షీట్ తయారు చేశారు. దీన్ని గోధుమ ఉత్పత్తి, ఎగుమతులు, దిగుమతు లు, సేకరణ, వినియోగం (ఎన్ఎస్ఎస్ఓ డేటా) ఆధారంగా శాస్త్రీయంగా రూపొందించారు. ఒక మార్కెట్ ఏజెన్సీ కూడా స్థానికంగా ఉండే మార్కెట్లలోని రోజూవారీ ధరల ఆధారంగా ధాన్యం అందుబాటును, నిల్వలను తన కంప్యూటర్ తెరపై చూపించింది. ఇవన్నీ మనకు కండ్లు తెరిపించే అంశాలు. ప్రస్తుత పరిస్థితి తెలిసిందే. 102 ఎంఎంటీల దిగుబడి ఉంటుందని అంచనా వేశారు. కొరతలో కూడా ధాన్యానికి ఊహించిన కనీస మద్దతు ధర ఇవ్వలేదు. ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తామని గొప్పలు పోతూ, ఎగుమతి చేస్తున్న ప్రభుత్వం, దిగుబడి తగ్గుదల లెక్కల ఆధారంగా భిన్న వర్గాల నుంచి విమర్శలు రావటంతో ఎగుమతులను నిలిపేసింది.
నిపుణులంతా ఉత్పత్తి తగ్గుదలనే అంచనా వేస్తున్నారు. ఇక ఎగుమతుల సంగతి ఎవరు ఆలోచిస్తారు? ఇదంతా తప్పుడు గణాంకాలపై ఆధారపడిన అతి విశ్వాసంగా చెప్పవచ్చు. మరి ఇలాంటి తప్పుల నుంచి మనం ఎలా బయటపడాలి? మొదట మనం శాస్త్రీయంగా పంట దిగుబడి గణాంకాలు అంచనా వేసే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. రెండవది-ఆయా కాలల్లో వచ్చే దిగుబడులపై కచ్చితమైన శాస్త్రీయమైన అధ్యయనాలతో అంచనాలుండాలి. ఈ క్రమంలోనే నేషనల్ క్రాప్ ఫోర్కాస్టింగ్ సిస్టం, ఫసల్ సాఫ్ట్లను రీసెట్ చేయాలి. అత్యాధునిక డ్రోన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీలను వినియోగించి సరియైన, కచ్చితమైన దిగుబడిని అంచనా వేయాలి.
సరఫరా-డిమాండ్ల మధ్య ఉన్న అసమతుల్యతను సరైన ధరల నిర్ణయంతోనే నివారించవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రైవేటు నిల్వలపై, బ్లాక్ మార్కెట్ నిల్వలపై కచ్చితమైన సమాచారం ఉండాలి. కమీషన్ల కోసం మాత్రమే నడిచే మార్కెట్లు దేశంలో ఉండకూడదు. ప్యూచర్ మార్కెట్లు(వేలం నిర్వహించే మార్కెట్లు) ధాన్య సేకరణకు ఉపయోగపడతాయి. వీటిని పెంపొందించాల్సిన అవసరం ఉన్నది. శాటిలైట్ల ద్వారా వాతావరణ పరిస్థితులను, పంట దిగుబడులను అంచనా వేయాలి. వ్యవసాయంలో సాంకేతికత, కచ్చితమైన గణాంకాల వినియోగం తక్షణ అవసరం. సరైన సమాచారంతోనే ఆహార ధాన్యాల సేకరణ సాధ్యం.
(వ్యాసకర్త: రిటైర్డ్ ఐఏఎస్)