ఈ మధ్య ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీ మూడవ స్థానంలో నిలిచినట్లు బ్లూమ్ బర్గ్ సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో మూడవ స్థానం చేరిన తొలి ఆసియా వాసి అదానీ అని పేర్కొన్నది. ఆయనకు ముందు ఎలాన్ మస్క్, జెఫ్ బేజోస్లు మాత్రమే నిలిచారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఆ జాబితాలో తొలి పది స్థానాల్లో ఉన్న వారి సంపద ఈ ఏడాది కొవిడ్ కారణంగా తగ్గినప్పటికీ, ఒక్క అదానీ సంపద మాత్రమే పెరగటం గమనార్హం.
కొవిడ్ ప్రారంభ సమయంలో అంటే 2020 జనవరిలో అదానీ సంపద పది బిలియన్ డాలర్లు ఉండగా, 2022 ఆగస్టు నాటికి పదమూడింతలు పెరిగి 137 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడవ స్థానానికి ఎగబాగారు. అదే కాలంలో ముఖేష్ అంబానీ సంపద కూడా 59 నుంచి 91.9 బిలియన్ డాలర్లకు పెరగడంతో సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో నిలిచారు.
‘విశ్వగురువుగా ఎదుగుతున్న భారతదేశ సిగలో ఈ ఘనతలు కలికి తురాయిలు’ అని చెప్పుకునే ప్రబుధ్ధులు ఉండవచ్చు. ఈ ఇద్దరు గుజరాతీ వ్యాపారుల సంపద ఎలా పెరిగింది? అందులోనూ అదానీ సంపద అనూహ్యంగా పెరగ టం వెనుక ఆయన వ్యాపార రహస్యమేమిటి? ఇది నిస్సందేహంగా మోదీ ప్రభుత్వ ఆశ్రిత పక్షపాతానికి నిదర్శనం.
కొవిడ్ తర్వాత 90 శాతం గృహస్థుల ఆదా యం పడిపోయింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వికటాట్టహాసం చేస్తున్నాయి. కానీ ఆ ఇద్దరు గుజరాతీ వ్యాపారుల సంపద మాత్రం పెరిగిపోయింది. వారు ఆపద కాలంలో కూడా అవకాశాలను వెతుక్కున్నారా? అంటే కాదనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వమే వారికి దోచి పెట్టిందన్నది వాస్తవం.
స్వాతంత్య్ర సమరయోధులు దేశంలో అంతరాలు లేని సమసమాజం నిర్మించాలని ఆకాంక్షించారు. మహాత్మాగాంధీతో సహా జాతీయోద్యమ నాయకులంతా దేశ సంపద ప్రతి ఒక్కరికీ చెందాలని నినదించారు. అందుకు పంచవర్ష ప్రణాళిక రూపొందించి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిచేందుకు కృషి చేశారు. సామాజిక మార్పు తీసుకరావడానికి అనేక సంస్కరణలు తెచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల రూపకల్పన చేశారు. ఫార్మా, ఉక్కు ఫ్యాక్టరీలు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వేలు ప్రభుత్వ రంగ సంస్థలుగా ఏర్పాటు చేశారు. కానీ, నేటి బీజేపీ ప్రభుత్వం నాటి నినాదాలను, విధానాలకు తిలోదకాలిచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్, ప్రైవేట్ శక్తులకు అప్పగిస్తున్నది.
1991నుంచి నూతన ఆర్థిక విధానాల పేరిట ప్రైవేటీకరణ మొదలైంది. 2014లో మోదీ అధికారం చేపట్టిన తర్వాత ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ జోరందుకున్నది. నిజానికి ప్రభుత్వ రంగసంస్థలు నష్టాల్లో ఉంటే లాభాల్లోకి తీసుకరావడానికి సంస్కరణలు తోడ్పడాలి. కానీ లాభాల్లో ఉన్న వాటిని అప్పన్నంగా కార్పొరేట్ శక్తులకు తెగనమ్ముతున్నారు. ప్రజలకు సేవలందించేందు కు గ్రామాల్లో కూడా బ్యాంకులను నెలకొల్పితే, ఇప్పుడు వాటిని కుదించి ప్రైవేటు పరం చేస్తున్నారు. మరోవైపు మొండి బాకాయిల పేరుతో రూ.12 లక్షల కోట్లను కార్పొరేట్ కంపెనీలకు రద్దు చేసిన కేంద్రప్రభుత్వం, కరోనా కాలంలో అల్లాడుతున్న పేద ప్రజలకు ఒక్క రూపాయి కూడా సాయంగా అందించలేదు.
మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఇష్టా రాజ్యంగా వరాలిస్తున్నది. వారి అప్పులను మొం డి బకాయిల పేర రద్దు చేస్తున్నది. కానీ పేదల సంక్షేమ పథకాలను మాత్రం ఉచితాలనే పేరుతో రద్దు చేయాలని చూస్తున్నది.
‘సబ్ కా సాత్’ అంటున్న బీజేపీ ప్రభుత్వం అన్ని విషయాల్లో కార్పొరేట్ వారికే వత్తాసు పలుకుతున్నది. మోదీ ప్రభుత్వంలో ‘దోచుకో దాచుకో’ ఒక విధానంగా తయారైంది. సంపద అందరికీ చెందాలని నాటి స్వాతంత్య్రోద్యమ నేతలు అంటే… నేడు అది కొందరికే చెందేలా మోదీ ప్రభుత్వం చేస్తున్నది.
ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. సహజవనరులకు నిలయమైన మన దేశం ప్రకృతి సమతుల్యానికి ప్రతీక. ప్రపంచానికి సరిపడే అన్ని రకాల ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి. అయినా దేశంలో పేదరికం 50 శాతం ఉన్నది. కరోనా సమయం లో వలస కార్మికులు 20 కోట్ల మంది ఉన్నారని తెలిసి వచ్చింది. వారి అభివృద్ధి సంక్షేమాలకు కేంద్రం ఏం చేయదలచిందో ఏమీ చెప్పదు.
అదానీ ఆస్తుల వెనుక ఎవరి హస్తం ఉందో ప్రతి ఒక్కరూ గమనించాలి. నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అదానీ చిన్న కంపెనీ పెట్టుకున్నారు. అలాంటి ఆయన నేడు ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి చేరారు. ఇప్పుడు దేశాభివృద్ధి అంటే, దేశ సంపద అంటే అదానీ, అంబానీలే అయ్యారు.
ఈ విధానాలను ప్రశ్నిస్తున్న వారిపై మోదీ ఈడీ, ఐటి దాడులు చేయిస్తూ, భయభ్రాంతులను సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యం ముసుగు లో నియంతృత్వం చెలాయిస్తున్నారు. ఈ అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు ఎదిరించాలి. విద్వేష రాజకీయాలతో సమాజాన్ని చీల్చాలనుకొంటున్న మోదీని గద్దె దించాలి.
(వ్యాసకర్త: సీపీఐ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి)