స్నిగ్ధా భూదవనీ వనీ మరకతశ్యామా చ కల్లోలినీ
నానావర్తవిహారిణీ జలధరస్యాంశైర్నభో మేదురమ్
సర్వం సాధు తవోదయే కి మిహ యద్ధుర్నీ తిమాలోకయే
యద్భేకా ముఖరీభవంతి విరసీభూతాశ్చ పుంస్కోకిలాః
ఈ సృష్టిలో సర్వకాల సర్వావస్థలయందు అనువైన వర్షం అందరికీ మోదమే. అలాంటి వర్షం కురిసింది. ఆ వర్షం రాకతో భూమి స్నిగ్ధయైనది. వన భూములు మరకత శ్యామములై మురిసినవి. నదులు హొయలు పోతూ నానావిధాలుగా పరుగులు తీసి ఆనంద తాండవం చేశాయి. ఆకాశం నీలి మబ్బుల రంగును పులుముకొని రంజిల్లుతున్నది. పుంస్కోకిలములు ప్రకృతిని చూసి పరవశించి పాట పాడటం కూడా మరిచి మౌన తన్మయంలో మునిగిపోయినవి. అంతా బాగానే ఉన్నది. కానీ, ఈ పాడు కప్పలే… బెకబెకమంటూ ఒకటే రొద చేస్తూ ఈ తన్మయానందావస్థను చెడగొట్టి చీకాకు పరుస్తున్నవి.
అవును.. ఎదుటివారి పురోగమనాన్ని, సంతోషాన్ని చెడగొట్టే కప్పలు అక్కడక్కడా ఉంటాయి. మన ఎల్లో మీడియా పుల్లారావుల్లాగ!!
తెలంగాణ పుట్టిన ముహూర్తం ఎలాంటిదో గానీ దీనికి పచ్చ లాబీ అనే ఏలిననాటి శని ఏదో వెంటాడుతున్నట్టు కనబడుతున్నది. ఈ లాబీల తాలూకు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, మేధోసంఘాలు, సంస్థలు అన్నీ కట్టగట్టుకొని తెలంగాణ మీద నిరంతరం దాడి చేస్తూనే వస్తున్నాయి. ఇందులో రాతకృష్ణుడి శైలి ప్రత్యేకం. కేసీఆర్ మీద బురద చల్లటం అనే ఏకైక కార్యక్రమానికి ఆయన తన సగం జీవితాన్ని అంకితం చేసేశాడు. మిగిలిన సగం అధికార వైధవ్యంతో బాధపడుతూ మారుమనువు అనేది భాగ్యరేఖలో ఉందో లేదో తెలియని అయోమయావస్థలో కొట్టుమిట్టాడుతున్న బాబుకు బాసింగం కట్టి గద్దెనెక్కించడానికి కేటాయించేశాడు. వారం వారం ఆయన పలుకుల నిండా కనిపించే సారాంశమిదే.
రాజకీయాల్లో అనుభవం అనే ఆకురాయి మీద సాన తేలిన నేతలంతా అంచెలంచెలుగా పైపైకి ఎదగడమనేది సహజం. భారతదేశ రాజకీయాల్లో ఇలా రాష్ట్రస్థాయి నుంచి కేంద్రస్థాయికి చేరుకున్నవారు ఎందరో ఉన్నారు. చరణ్సింగ్, వీపీ సింగ్ వంటి నాయకులు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసి సొంత పార్టీలు పెట్టి స్వయంకృషితో జాతీయస్థాయికి ఎదిగి ప్రధానులయ్యారు. వారి సొంత పార్టీలేవీ జాతీయస్థాయి పార్టీలు కావు. ఇదే మార్గంలో తెలంగాణ నుంచి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించాలని సంకల్పించారు. తెలంగాణలో ఒక విజయవంతమైన మాడల్ను అమలుచేసిన అనుభవంతో దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నారు. ఆరు దశాబ్దాలుగా ఏలిన ప్రభుత్వాలు దేశాన్ని దివాలా స్థితికి తీసుకురావడం మీద ప్రజాజీవితంలో ఉన్న నాయకుడికి ఆగ్రహం కలగడం సహజం. జాతి నిర్మాతలు ఇటుక ఇటుకా పేర్చి ఏర్పాటుచేసిన గ్రోత్ ఇంజిన్లు అనబడే ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతూ ఉండటం, వ్యవసాయ దేశంలో రైతుల హక్కులను లాక్కునే యత్నాలు ఆయనలో ఆగ్రహాన్ని రగిలించి ఉండవచ్చు. గతంలో కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన అనుభవంతో అక్కడి పరిస్థితుల మీద ఉన్న అవగాహనతో దేశానికి ఏదైనా చేయాలనే ఆలోచన ఆయనను దేశ రాజకీయాల వైపు నడిపించి ఉండవచ్చు. అది ఆయన హక్కు.
కానీ, కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూడటం రాతకృష్ణుడికి జీర్ణం కావడం లేదు. కళ్లు మూసినా, తెరిచినా ఇపుడు రాతకృష్ణుడికి బీఆర్ఎస్సే కనిపిస్తున్నది. కేసీఆర్ ఏంటి? జాతీయ రాజకీయాలేంటి? అనేది మింగుడుపడటం లేదు. బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ‘కంటికి నిదుర వచ్చునే..’ అనే శ్రీనాథుడి బాధ ఆయన అనుభవంలోకి వచ్చింది. దానికితోడు ఇటీవలి ఖమ్మం సభతో మతి గతి తప్పిపోయింది. అసలు కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టగానే ఎవరెవరు ఎన్నిసార్లు జాతీయ రాజకీయాల్లో ఫెయిలయ్యారనేది గుర్తుచేశాడు. ఆయన బాధ వర్ణనాతీతం.. కేసీఆర్ ఎక్కడ జాతీయ రాజకీయాల్లో వెలిగిపోతాడో అన్న భయం ఆయనను ఎపుడూ వెంటాడుతున్నట్టుంది. అందుకే తరచూ రంధ్రాన్వేషణ కొనసాగిస్తూనే ఉంటాడు. ఆ మధ్య కేసీఆర్ ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభిస్తే అఖిలేష్, కుమారస్వామి తప్ప ఎవరూ రాలేదని, అసలు బీఆర్ఎస్ పార్టీని అక్కడ ఎవరూ పట్టించుకోలేదని తన పత్రికలో కథనం వేసుకొని మురిసిపోయాడు. ఇదే చంద్రబాబు ఢిల్లీ వచ్చి ఉంటే కనీసం పదిమంది ఇతర పార్టీ నేతలను ‘రప్పించుకునే’ వాడనీ రాశాడు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అప్పటికే హైదరాబాద్లో ప్రారంభమైంది. కావలిసినవాళ్లు వచ్చారు. ఈసారి ఢిల్లీకి వెళ్లింది మంచిరోజు కాబట్టి పార్టీ కార్యాలయాన్ని పూజ చేసి లాంఛనప్రాయంగా ప్రారంభించడానికే. అదీ తాత్కాలిక అద్దె భవనంలో.. దానికి కూడా మళ్లీ అతిథులంతా పొలోమంటూ క్యూ కడతారా? ఏదో అద్భుతం జరిగిపోయినట్టు మీడియా వెల్లువలా తరలి వచ్చేస్తుందా? అక్కడ కార్యక్రమం ఏమిటి? మేనిఫెస్టో ప్రకటనా.. పొత్తుల ప్రకటనా.. విధానాల ప్రకటనా? బల ప్రదర్శనా? కేసీఆర్ కనీసం ప్రెస్మీట్ కూడా పెట్టలేదు. కొన్ని సందర్భాలు కొన్ని పనులకే పరిమితం. అంత పెద్ద ఖమ్మం సభలోనే మేనిఫెస్టోను ప్రకటించని కేసీఆర్, ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన హడావుడి చేస్తారా? చూడబోతే కేసీఆర్ ఢిల్లీకి పోతే ఎన్ని పార్టీల నుంచి ఎంతమంది వస్తారోనని రాతకృష్ణుడు రాత్రంతా నిద్రపోనట్టున్నాడు. అందుకే ఆ పర్యటన విఫలమైందని ఎవరూ పట్టించుకోలేదని రిలీఫ్గా రాసుకొని మురిసిపోయినట్టున్నాడు. లెగ్గో.. టంగో తెలియదు కానీ అక్కడ రాని నాయకులంతా వందల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ ఖమ్మం సభకు వచ్చారు. టంగ్ మహాత్మ్యమనుకుందామా?
కేసీఆర్ జాతీయ నాయకుడు ఎలా కాగలుగుతాడనేది ఆయనకు కొరుకుడుపడని సందేహం. జాతీయ రాజకీయాలంటే రాతకృష్ణుడికి ఎంపీ సీట్ల లెక్కలే. కేవలం 17 స్థానాలున్న తెలంగాణకు చెందిన కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయగలడనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదని తాజా కొత్త పలుకులో రాసుకున్నాడు.
ప్రాంతీయ పార్టీ పేరు మార్చుకొని జాతీయపార్టీగా ప్రకటించుకున్నంత మాత్రాన జాతీయపార్టీ అయిపోతుందా? అని నిష్ఠురపడ్డాడు. అయితే సమస్యలను పరిస్థితులను కేసీఆర్ డీల్ చేసే పద్ధతి వేరు. సింగరేణిని నష్టాల నుంచి గట్టెక్కించాలనే చర్చ వచ్చినపుడు చాలామంది గనుల సంఖ్య పెంచాలని, ఉత్పత్తి లక్ష్యాలను, పనిగంటలను పెంచాలన్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఎంతో అనుభవం ఉన్న సింగరేణి ఇతర రాష్ర్టాల్లో, దేశాల్లో బొగ్గు గనులు లీజ్ తీసుకునే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఒక వృత్తానికే పరిమితమై ఆలోచించడం కేసీఆర్ విధానం కాదు. అలాగే ఆర్టీసీ.. ఎవరైనా లాభాలు రావాలంటే ఏం ప్రతిపాదిస్తారు? బస్సులు పెంచాలి. చార్జీలు పెంచాలి. నష్టదాయక రూట్లు వదిలేయాలి. మైలేజీ పెంచాలి. ఇవే సలహాలు వస్తాయి. కానీ కేసీఆర్ కొరియర్ సర్వీస్ ప్రారంభించమన్నారు. ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంకులు పెట్టుకోమన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ల మీద కమర్షియల్ కార్యకలాపాలు చేసుకోవాలన్నారు. ఇదీ కేసీఆర్ ఆలోచనావిధానం. ఈ 17 సీట్లు అంశం జాతీయ రాజకీయాలకు ఎప్పటికీ ప్రతిబంధకమే. అందుకే తన పరిధిని విస్తరించి జాతీయ పార్టీగా మార్చారు. ఇప్పటికే తెలంగాణ మాడల్ దేశానికి పరిచయమై ఉన్నది. ఇక్కడి పథకాల మీద దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నది. ఇపుడు వివిధ రాష్ర్టాల్లో తెలంగాణ మాడల్ను ప్రజల వద్దకు మోసుకుపోయే యంత్రాంగం ఏర్పాటుచేసుకోవాలి. బీజేపీని ఢీ అంటే ఢీ కొట్టగల సాహసిగా జాతీయ మీడియాకు ఇప్పటికే కేసీఆర్ పరిచయం. ఆ మాడల్.. ఈ ఇమేజ్ ఇపుడు కేసీఆర్ ఆయుధాలు. కేసీఆర్ లేవనెత్తే అంశాలు బుద్ధిజీవుల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. బీజేపీతో ఢీకొన్న ఆయన సాహసం జాతీయస్థాయి, ప్రాంతీయ స్థాయి నాయకులను ఆకర్షిస్తున్నది. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ది ఇపుడు ప్రాథమిక దశ మాత్రమే. పార్టీ యంత్రాంగం ఏర్పాటు, సభలు, సదస్సులు, సవాళ్లు, రాజకీయ వేడి రాజేయడాల వంటివి ముందున్నాయి. సర్వం సిద్ధం చేసుకోకుండా కేసీఆర్ యుద్ధభూమిలో దిగడు. రేపటి యుద్ధంలో బీఆర్ఎస్ పోటీ స్థానాల సంఖ్య, గెలిచే సీట్ల సంఖ్య రాతకృష్ణుడు అనుకున్నట్టు 17 దగ్గర ఆగదు.
ఖమ్మం సభ సాధించిందేమీ లేదని అంతా ఒంటిచేతి చప్పట్లేనని తాజా కొత్తపలుకులో రాసుకున్నాడు. కేసీఆర్ను తమ నాయకుడంటూ ఏ పార్టీ చెప్పలేదన్నారు. మరి ఖమ్మం సభలో ‘కేసీఆర్ మా పెద్దన్న’ అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రస్తావించడం దేనికి సంకేతమో రాతకృష్ణుడికి తోచలేదు.
అసలు సభకు జనం పెద్దగా రాలేదని, వచ్చినవాళ్లు సభ జరుగుతుండగానే వెళ్లిపోయారని తన పత్రిక పతాక శీర్షికల్లో వేసుకున్నారు. సభకు జనం వచ్చారో, లేదో టీవీల్లో జనం చూశారు. కేసీఆర్ ప్రసంగానికి హర్షాతిరేకాలూ చూశారు. కాకపోతే ఖమ్మం సభ సాధించిందేమిటో రాతకృష్ణుడే గమనించలేదు. ఒకటి.. గత ఎన్నికల్లో కేవలం ఒకే అసెంబ్లీ సీటు గెలిచిన ఖమ్మంలో పెట్టిన ఆ సభకు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లక్షలాది జనం తరలివచ్చారు. కొద్దికాలం కింద అక్కడే నిర్వహించిన చంద్రబాబు సభకు ఇందులో పదో వంతు జనం కూడా రాలేదు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ పచ్చ లాబీ మీడియా కోడై కూస్తున్న ప్రచారం ఈ సభకు తరలివచ్చిన జనంతో పటాపంచలైంది. ఈ సభ కవరేజీకి వచ్చిన జాతీయ మీడియా ద్వారా ‘రాష్ట్రంలో కేసీఆర్ తిరుగులేని నాయకుడు’ అన్న సందేశం వెళ్లింది. ఇంకోవైపు ‘కేసీఆర్ మీద వ్యతిరేకత ఉందేమో.. అధికారంలోకి వస్తామేమో’ అనే సంశయాత్మక భ్రమీభూతస్థితిలో ఉన్న పార్టీలకూ, వాటి నాయకులకు ఆ సభకు తరలివచ్చిన జనాన్ని చూసి గొంతు తడారిపోగా తమ పరిస్థితి మీద జ్ఞానోదయం కలిగింది. రాష్ట్రస్థాయిలో ఈ సభ ద్వారా కేసీఆర్ సాధించిన విజయం ఇది.
రెండోది.. కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తారా? అనే అనుమానానికీ నివృత్తి లభించింది. ఎక్కడ ప్రతిపక్ష నేతల సమావేశాలు జరిగినా సరిగ్గా సభ సమయానికే ఆయా పక్షాల నాయకులు వెళ్తారు. కానీ ఖమ్మం సభ వ్యవహారం చూడండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ముగ్గురు నాయకులు సహా విపక్ష నేతలంతా ముందురోజు రాత్రికే వచ్చారు. వాస్తవానికి సభ మరుసటి రోజు సాయంత్రం వేళకు ఉంది. పొద్దున రాగలిగినా ముందురోజే వచ్చారు. తర్వాత తెల్లవారి యాదాద్రి దర్శనం, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆవిష్కరణ, కంటివెలుగు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవన్నీ జాతీయ మీడియా ద్వారా దేశ ప్రజలకు చేరాయి. వారు యాదాద్రి ఆలయాన్ని చూశారు. దేశంలో మరెక్కడా లేని అద్భుతమైన కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాన్ని చూశారు. ఆ తర్వాత దేశంలో ఎక్కడా అమలుజరుగని కంటి వెలుగు కార్యక్రమాన్నీ చూశారు. వచ్చిన నాయకులు సభలో ఈ పథకాలను ప్రశంసించారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు ఒకడుగు ముందుకువేసి తమ రాష్ట్రంలో కంటివెలుగు అమలు జరుపుతామని సభాముఖంగా ప్రకటించారు. తెలంగాణ పథకాల్లోని విశిష్టత దేశ ప్రజలకు తెలియజెప్పారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ గురించి కేజ్రీవాల్ ప్రస్తావించారు. కేరళ సీఎం తన ప్రసంగంలో కూడా తెలంగాణ పథకాలను మెచ్చుకున్నారు. బీజేపీపై పోరాటంలో కలిసివస్తామన్నారు. ఎక్కడా ఎవరూ భేషజాలకు పోలేదు. ఇవన్నీ ఏం సంకేతాలిస్తున్నాయి? ఖమ్మం సభ ద్వారా రాష్ట్రంతో పాటు జాతీయస్థాయిలో కేసీఆర్ ప్రతిష్ఠ పెరిగింది. తరలివచ్చిన జనాన్ని చూసి నమ్మకమూ కుదిరింది.
ఈ ఒక్క సభ ఎన్నో సమాధానాలిచ్చింది. సభకు వచ్చిన పార్టీలు నాయకులు ఎవరు? దేశ రాజకీయాల్లో కుంభస్థలం యూపీ. ఆ రాష్ట్రం నుంచి బలమైన పక్షనాయకుడు, సామాజిక శక్తుల ప్రతినిధి అఖిలేశ్ సభకు వచ్చారు. దక్షిణాదిలో వామపక్ష భావజాలం ప్రబలంగా ఉన్న కేరళ నుంచి సీఎం పినరయి విజయన్ వచ్చారు. నూతనత్వానికి పెద్దపీట వేసే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ వంటి పార్టీ నాయకులు వచ్చారు. అందరికందరూ బీజేపీతో రాజీలేని పోరాటం చేస్తున్నవారు. వారెవరికీ గతంలో బీజేపీతో సాన్నిహిత్యం గానీ పొత్తుల నేపథ్యం గానీ లేదు. ప్రతి వక్తా తమ ప్రసంగాల్లో రైతు వ్యతిరేక విధానాలు, పబ్లిక్రంగ సంస్థల అమ్మకాలు, గవర్నర్ గిరీ దుర్వినియోగం, కేంద్ర అప్రజాస్వామిక ధోరణి, మతోన్మాదం, సీబీఐ, ఈడీ దాడులు, న్యాయవ్యవస్థను చెరపట్టజూచే వైఖరి వంటి అంశాలను ప్రస్తావించారు. ఈ అంశాల మీద అందరిలో ఏకాభిప్రాయం వెల్లడైంది. ఇది చాలు.. కంటివెలుగును తమ రాష్ర్టాల్లో అమలుచేస్తామంటూ చేసిన ప్రకటన ఇచ్చి పుచ్చుకునే ధోరణికి సంఘీభావానికి ఇది సంకేతం.
సభ సక్సెస్ జీర్ణం కాదు కాబట్టి తెల్లారే సభకు రాని ఓ నేత చెప్పిన మాటలు వక్రించి నన్ను
పిలవలేదంటూ ఓ కథనం పరిచేశాడు రాతకృష్ణ.
వాస్తవానికి ఆయనే కాదు, పక్కన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా రాలేదు. రావడానికి, రాకపోవడానికి పనుల ఒత్తిడితో సహా సవాలక్ష కారణాలుంటాయి. కుమారస్వామి బీఆర్ఎస్ ఆవిర్భావానికి హైదరాబాద్కు.. కార్యాలయ ప్రారంభానికీ ఢిల్లీకీ వచ్చారు. నితీశ్ కుమార్ బీహార్ పర్యటనలో కేసీఆర్తో సన్నిహితంగా మెలిగారు. ఏకాంత చర్చలూ జరిపారు. కేసీఆర్ను రాష్ట్రం సాధించిన పోరాట యోధుడని భేషజాలు లేకుండా ప్రశంసించారు. అదే రాష్ట్రం నుంచి తేజస్వీ యాదవ్ గతంలోనే హైదరాబాద్కు వచ్చారు. బీజేపీ మీద పోరులో కలిసి పనిచేస్తామని అపుడే చెప్పారు. వామపక్షాలు గానీ, ఆప్ గానీ, సమాజ్వాదీ కానీ కలలో కూడా బీజేపీతో రాజీపడవు. వచ్చే నెల హైదరాబాద్లోని పరేడ్గ్రౌండ్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రెండో సభకు తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం సోరెన్, బీహార్ సీఎం తరఫున జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్తో పాటు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా హాజరుకానున్నారు. ఇది మొదటి ఇన్నింగ్సే. ఆట ఇంకా బాకీ హై.
పాపం రాతకృష్ణుడికి ఆత్రమెక్కువ. బీఆర్ఎస్ ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందో స్పష్టత లేదు, ఏయే రాష్ర్టాల్లో ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందో స్పష్టత లేదని అంటాడు. ఉత్తరాది రాష్ర్టాల్లో తన పార్టీని ఎలా విస్తరిస్తారో కేసీఆర్ చెప్పలేదంటాడు. బీఆర్ఎస్ అన్ని రాష్ర్టాల్లో పోటీ చేస్తుందని కేసీఆర్ ప్రకటించారని, మరి పొత్తుకు ఆప్, సమాజ్ వాదీ అంగీకరిస్తాయా? అన్నది అస్పష్టమంటాడు.
కమ్యూనిస్టులు కేవలం బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకే మద్దతునిస్తున్నాయి తప్ప కేరళలో బీఆర్ఎస్తో కలిసి పోటీచేస్తామని చెప్పడం లేదు కదా అనేది ఆయన ప్రశ్న. ‘ఆలు లేదు.. చూలు లేదు..’ అన్నట్టు అసలు బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఎన్నో రోజులు కాలేదు. విధి విధానాలు, మేనిఫెస్టోలు రూపొందించుకోవడమే ఇంకా పూర్తికాలేదు. బీఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత జరిపిన మొదటి సభ. ఖమ్మంలోనే మొత్తం కార్యక్రమం ప్రకటించి ఉండాలా? అపుడే పుట్టిన పార్టీ ఇపుడే పొత్తులు ప్రకటిస్తుందా? కలిసివచ్చే పార్టీలైనా చర్చలు, అవగాహనలు లేకుండానే ఏకపక్ష ప్రకటనలు చేస్తాయా? పార్లమెంటు ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నది.
మన ప్రాచీన వాఙ్మయంలో టిట్టిభ న్యాయం అనేది ఒకటుంది. దీని ఆధారంగా పంచతంత్రంలో ఒక కథ కూడా ఉంది. ఒక తీతుక పిట్ట సముద్రపు ఒడ్డున గడ్డిలో గుడ్లు పెట్టుకుంది. సముద్రుడు తరంగాల రూపంలో వచ్చి ఆ గుడ్లను ఊడ్చుకుపోయాడు.
కడుపు మండిన తీతుక పిట్ట సముద్రంలోని నీరంతా ఇంకిపోయేలా చేస్తానని శపథం చేసి నీటిలోకి వెళ్లి తన రెక్కల మీద నీటిని తెచ్చి ఒడ్డున పోయడం ప్రారంభించింది. దీన్ని చూసి సాటి పక్షులు నవ్వసాగాయి. అయినా ఈ తీతుక తన పని మానలేదు. ఆ దారిన పోతున్న నారదుడు దాని సంకల్పాన్ని అందులోని ధర్మనిరతిని మెచ్చి స్వర్గం నుంచి తీతుకపిట్టకు సహాయపడమని గరుడుడిని పంపించాడు. శత సహస్ర యోజనాలు విస్తరించిన రెక్కలతో మహోగ్ర స్వరూపంతో గరుడుడు వాలగానే సముద్రుడు భయపడి తీతుక పిట్ట గుడ్లను తానే అప్పగించి శరణమన్నాడు. స్వరూపం కాదు సంకల్పం గొప్పదన్నది దీని సారాంశం. ప్రజాస్వామ్యమూ అంతే.. మన సంకల్పంలో ధర్మం ఉంటే మనది ధర్మపోరాటమే అయితే.. ప్రజాభిప్రాయం అనే గరుడుడి వంటి మహాశక్తి మనకు అండగా నిలుస్తుంది. రెండు ఎంపీ సీట్లతో తెలంగాణ సాధించిన చరిత్రే దీనికి నిదర్శనం!!
అనగా అనగా రాగం మూల్గగా మూల్గగా రోగం అని సామెత. అలాగే ఏదో ఒక ప్రచారాన్ని ఎత్తుకొని ప్రబల ప్రచారంతో దాన్నే నిజమని నమ్మించాలనుకునే వారిలో రాతకృష్ణుడు ముందుంటాడు. ‘తెలంగాణలో టీడీపీ బలంగా ఉంది’ అనే ప్రచారం నుంచి మొదలుకొని ‘కేసీఆర్ మీద యువతలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది’ అంటూ పదే పదే రాయడం ద్వారా దాన్నే నిజమని నమ్మించే ప్రయత్నం చాలాకాలంగా చేస్తున్నాడు. ఇదే దారిలో పచ్చ లాబీ ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ముఖంగా ప్రబలంగా సాగుతున్నది. కానీ ఈ ప్రచారాలు చేసే సన్నాసులు తెలుసుకోవాల్సిందేమంటే ఆ మధ్యే యువత ఓట్లే అధికంగా
ఉండే విద్యావంతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండు సీట్లనూ మంచి మెజారిటీతో గెలుచుకున్నది. నిజంగా యువత మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేదేనా?
ఇక్కడ ఓ ధర్మసందేహం.. కేసీఆర్ను వ్యతిరేకిస్తున్న యువత ఎవరు? ఎందుకు వ్యతిరేకిస్తారు? అసలు ఎవరు వ్యతిరేకిస్తున్నారు? రాష్ట్రంలో ఏ మారుమూలకైనా వెళ్లి చూడండి. పట్టణాల లైబ్రరీల్లో గ్రూప్స్కు, ఇతర ఉద్యోగాలకు సీరియస్గా ప్రిపేరవుతున్న యువత కేసీఆర్ను వ్యతిరేకిస్తున్నదా? ఇప్పటికే పోస్టింగులు అందుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నవాళ్లు, వాళ్ల కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తున్నారా? ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్ కాలేజీలతో సీట్లు పెరగడంలో అనూహ్యంగా వచ్చిన అవకాశంతో ఆనందంగా అందులో చేరిన వేలాదిమంది యువత వ్యతిరేకిస్తున్నదా? ఇంజినీరింగ్ చదువుతూ అమెరికాలో భవిష్యత్తుపై అందమైన కలలుగనే యువత వ్యతిరేకిస్తున్నదా? ఇంజినీరింగ్ చదువులు చదివి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న యువత వ్యతిరేకిస్తున్నదా? రాజధానిలో ఇతర వ్యాపారరంగాల్లో నిర్వాహకులుగా, సిబ్బందిగా పనిచేస్తున్నవారు వ్యతిరేకిస్తున్నారా? నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ఎంతో ఎత్తుకు ఎదిగిన రియల్ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న యువత వ్యతిరేకిస్తున్నదా? మరి ఎవరు వ్యతిరేకిస్తున్నది? పనీపాట లేక వాట్సాప్లలో అడ్డగోలు కతలు పడేవాళ్లు.. ఏ పరీక్షా రాయలేక, రాసినా ఎంపిక కాలేక, ఆ కోపాన్ని ప్రభుత్వాల మీద తీసేవాళ్లు.. సీఎంను.. పీఎంలను అరే.. ఒరే అంటూ పోస్టింగులు పెట్టడం ద్వారా, బూతులు తిట్టడం ద్వారా తమను తామే తోపులుగా భావించేవాళ్లు.. మార్ఫింగ్ వీడియోలు చూసి ఇతర మతాల మీద ఊగిపోయే దారి తప్పిన అమాయకులు.. రాజకీయ పార్టీల ర్యాలీలు సభల్లో నినాదాలు చేసేవాళ్లు.. వీళ్లా యువత? వీళ్లేనా యువత అంటే? యువత జనాభాలో వీళ్ల శాతమెంత? ఇప్పటికిప్పుడు వెళ్లి చూడండి ఏ లైబ్రరీలో నైనా.. పరీక్షల మీద అవగాహన కోసం ఏర్పాటుచేసే సదస్సుల్లోనైనా చూడండి ఎంతమంది యువత ఉంటుందో. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనం ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి తెలంగాణ వచ్చేవరకూ ఏ ప్రభుత్వమైనా ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చిందా? ఇన్ని ఉద్యోగాలకు అవకాశమిచ్చిం దా? గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం మీద వీరికి వ్యతిరేకత ఉంటుందా? ‘తిట్టేవాళ్లను వెతుక్కొని వెళ్లే టీవీ గొట్టాలు చేసే బోగస్ ప్రచారాలు’ తప్ప యువతకు వ్యతిరేకతా లేదు, ఆగ్రహమూ లేదు. వాస్తవం ఏమంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఖాళీలను భర్తీచేయడం కాదు, ప్రతి 5 వేల ఎకరాలకొకరు చొప్పున వేలాది మంది ఏఈవోలను (వ్యవసాయ విస్తరణాధికారులను).. ఇరిగేషన్ శాఖలో పోలీసుశాఖలో కొత్తగా వేలాది ఉద్యోగాలను ఇలా… వేలాది కొత్త ఉద్యోగాలు సృష్టించింది. అఖిలేష్ యాదవ్ అన్నట్టు కేసీఆర్ ప్రభుత్వంలో చాలామందికి చేసింది చెప్పుకోవడం రాదు.
– సవాల్ రెడ్డి
(మిగతా రేపు)