ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ను ప్రత్యర్థి పార్టీలు, నాయకులు ఎవరూ పల్లెత్తు మాట కూడా అనటం లేదు. సడన్గా ఈ మార్పునకు కారణం ఏమిటి? భారత్ జోడో యాత్రతో ఆ పార్టీ ఏమైనా పునీతమైపోయిందా? అనుకుంటే పొరపాటే. ‘కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చినట్లుగా’.. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నప్పుడు ఇక మనకెందుకు టైమ్ వేస్ట్ అని ప్రత్యర్థి పార్టీలు భావిస్తున్నాయి కాబోలు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను తూర్పారబట్టడానికి జీ-23 నేతలు, రాష్ట్రంలో జీ-13 నేతలు ఎలాగూ ఉన్నారన్న విషయం తెలిసిందే. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నియోజకవర్గంలో ఇటీవల తెల్లారేసరికి ‘కోవర్టు వెంకట్రెడ్డి’ పేరిట పోస్టర్లు వెలిసాయి. వాటి ఫొటోలు తీసి ఢిల్లీలో ఉన్న కోమటిరెడ్డికి ఆయన అనుచరులు పంపించారు.
ఆయన నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు వెళ్లి వాటిని చూపించారు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు చేసిన పనేమో అని ఖర్గే భావించారు. కానీ టీపీసీసీ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్న వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయమే తనపై పోస్టర్లు వేసిందని కోమటిరెడ్డి వివరించే సరికి ఖర్గే కంగు తిన్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని ఖర్గే చెప్పడంతో.. జరిగిన తప్పుకు తనకు సునీల్ సారీ కూడా చెప్పారని కోమటిరెడ్డి వివరించారు. అక్కడున్న వారికి అప్పుడు అర్థమైంది.. తమ పార్టీని ఇతర పార్టీలు ఎందుకు విమర్శించడం లేదో.
సీఎం కేసీఆర్ తనతో కలిసి పాదయాత్ర చేయాలని, రాష్ట్రంలో సమస్యలేమీ లేవని తేలితే, తాను చేసిన విమర్శలు తప్పని ఒప్పుకొని ముక్కు నేలకు రాస్తానని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో తాదన్నే వాడికి తలదన్నే వాడు ఉంటాడని చెప్పనవసరం లేదు. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ, ‘నీకూ, నీ అన్నకు మధ్య ఆస్తి తగాదల వల్లనే సొంతంగా పార్టీ పెట్టుకున్నావు. ఇది తప్పని నిరూపిస్తే నేను కూడా ముక్కు నేలకు రాసి తప్పు ఒప్పుకుంటా’ అని కౌంటర్ ఇచ్చాడు. ‘అదిరిందయ్యా చంద్రం’ అంటూ నెటిజన్లు అతడిని ఆకాశానికి ఎత్తేశారు. మరి షర్మిల ఏం సమాధానం చెబుతారో చూడాలి.
– వెల్జాల