కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ దేశంలో 8వ పెద్ద రాష్ట్రం మన తెలంగాణ. ఉన్నత విద్యలో తెలంగాణ అత్యుత్తమ ప్రతిభను సాధిస్తున్నది. విద్యారంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అనేక విద్యాసంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. నిజానికి సాంకేతిక, సాంకేతికేతర విద్యనందించడంలో నేడు మన రాష్ట్రం దేశానికే ఆదర్శం.
ఉన్నత విద్యలో ‘జాతీయ విద్య’ నుంచి ‘గ్లోబల్ ఎడ్యుకేషన్’కు, ‘ఉపాధ్యాయ కేంద్రీకృత’ నుంచి ‘అభ్యాస-కేంద్రీకృత విద్య’కు మారింది. సంప్రదాయ కోర్సులతో పాటు ఉపాధి అవకాశాలు పెంచే కోర్సులను మన విద్యా వ్యవస్థ అందిస్తున్నది. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం తదేక దీక్షతో కృషిచేస్తున్నది. పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, బోధనలో సాంకేతికతను పరిచయడం చేయడానికి ముఖ్యమైన ప్రణాళికలు రచిస్తూనే, వాటి అమలు కోసం విస్తృతంగా కృషిచేస్తున్నది.
రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎస్సీ: 30, ఎస్టీ: 22, బీసీ: 33 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేశారు. సంప్రదాయ కోర్సులతో పాటు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ఫార్మా, న్యాయ, అగ్రికల్చరల్ కోర్సులను ప్రవేశపెట్టడం గొప్ప నిర్ణయం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, జేఎన్టీయూ ద్వారా ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటుచేసి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాఉటలోకి తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ది.
వైద్య విద్యను అందరికీ అందుబాటులో తేవడం కోసం దేశంలో ఎక్కడాలేనివిధంగా ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలను ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కోఠిలోఉన్న ఉస్మానియా మహిళా కళాశాలను అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుచేశారు. అలాగే ములుగులోని ఎఫ్సీఆర్ఐ (ఫారెస్ట్ కాలేజీ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్)ను అప్గ్రేడ్ చేస్తూ అటవీ విశ్వవిద్యాలయంగా ఏర్పాటుచేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, ఆలోచన, విధానాల వల్లనే రాష్ట్రం ఉన్నతమైన మైలురాళ్లను సాధించగలిగింది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎంతో అభివృద్ధిని సాధించగలిగాయి.
దేశంలోని జీఈఆర్ 27.3 శాతం ఉంటే తెలంగాణలో జీఈఆర్ 39.1గా నమోదైంది. దేశంలోని మహిళల జీఈఆర్ 27.9 శాతంతో పోలిస్తే తెలంగాణ మహిళల జీఈఆర్ 40.3 శాతం, దేశంలోని ఎస్సీ మహిళల జీఈఆర్ 23.9 శాతంతో పోలిస్తే తెలంగాణలో ఎస్సీ మహిళల జీఈఆర్ 39.3 శాతంగా ఉన్నది. ఈ విధంగా అనేక అంశాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని నమోదు చేస్తున్నది.
రాష్ట్రంలోని ఉన్నతవిద్యలో మహిళల నమోదు కూడా వేగంగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు, ఫీజు రీయింబర్స్మెంట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు మహిళలు ఉన్నతస్థాయికి చేరుకోవడానికి దోహదపడుతున్నాయి. దేశంలో పరిశోధన, ఉన్నతవిద్యకు కేంద్రంగా హైదరాబాద్ గుర్తింబచడింది. విద్యార్థులు తమ కెరీర్లో మరింత ప్రొఫెషనల్గా మారుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దోస్త్’ దేశంలోనే ఒక రోల్మాడల్గా నిలిచింది. మన రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ సేవల అడ్మిషన్ ప్రక్రియ 2016-17 విద్యా సంవత్సరంలో ప్రారంభమైంది. ఇదెంతో పారదర్శకమైనది. ఇది మెరిట్, రోస్టర్ విధానాన్ని పాటిస్తూ, గ్రామీణ మెరిట్ విద్యార్థులు సైతం ప్రవేశం పొందడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా అన్ని విశ్వవిద్యాలయాల అడ్మిషన్ల ప్రక్రియను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో రాణించేందుకు గాను తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో పోటీ పరీక్షల కోచింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసింది. డిమాండ్ ఉన్న అనేక కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు.
అలాగే రాష్ట్రంలో, దేశంలో కూడా ఉపాధి అవకాశాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పాఠ్య ప్రణాళిక సవరణలు తెచ్చారు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్), బకెట్ సిస్టమ్ వంటి ఇతర సంస్కరణలు 2019-20 విద్యా సంవత్సరం నుంచి అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశపెట్టాయి. మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులకు విజ్ఞానాన్ని, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్తో సమానమైన కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. తద్వారా విద్యార్థులు తమ ఇష్టమైన సబ్జెక్టులను ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది.
పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడానికి జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలతో టీఎస్సీహెచ్ఈ అవగాహన ఒప్పందాలు చేసుకున్నది. దీనికి సంబంధించి టీఎస్సీహెచ్ఈ, సీసీఈ, వివిధ విశ్వవిద్యాలయాలు బ్రిటిష్ కౌన్సిల్ టీసీఎస్, ఐఎస్బీ, క్రిస్ప్ లాంటి అనేక సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ప్రకారం విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నాణ్యత, సమానత, సమ్మిళితత్తాన్ని సాధించడానికి అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు కృషిచేస్తున్నాయి.
ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి 94402 36667
(వ్యాసకర్త: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్)