ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురై కూలిపోయిన కులవృత్తులకు, ఆర్థికంగా చితికిపోయిన సేవావృత్తులకు అండగా నిలిచి పునరుజ్జీవం కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో కులవృత్తులకు సరైన ఆదరణ లేక జీవనం కష్టకాలంగా సాగింది. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వాటికి పూర్వవైభవం తీసుకు వచ్చింది. బడుగులకు బాసటగా నిలిచి కులవృత్తులను ప్రోత్సహించడం మన ముఖ్యమంత్రి కేసీఆర్కే సాధ్యమైంది.
గొల్లకుర్మల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో యూనిట్కు 20 గొర్రె లు, ఒక పొట్టేలును 75 శాతం సబ్సిడీతో అందిస్తున్నది. ఇక ముదిరాజ్, బెస్తల అభ్యున్నతికోసం ప్రభుత్వం ఏటా ఉచితంగా చేప పిల్లల ను పంపిణీ చేస్తున్నది. 75 శాతం సబ్సిడీపై ట్రాన్స్పోర్ట్, ద్విచక్ర వాహనాలు, లగేజీ ఆటోలను అందించి వారి జీవన ప్రమాణాలను మార్చిన ఘనత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది.
గీత కార్మికులకు ఉచిత బీమా, మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించి వారికి ఉపాధి అవకాశాలను పెంచింది. తాటిచెట్లపై పన్నును రద్దుచేసింది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియాను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ మహానగరంలో నీరా కేఫ్ను ప్రారంభించి గీత కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటున్నారు సీఎం కేసీఆర్. మరోవైపు, స్వరాష్ట్రంలో నేతన్నల బతుకులు మారాయి. రాష్ట్ర ప్రభుత్వం వీరికి నూలు, రసాయనాలకు సబ్సిడీని అందిస్తున్నది. అలాగే 50 శాతం విద్యుత్ సబ్సిడీని ఇస్తున్నది. నేతన్నలు మరణిస్తే కుటుంబసభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నది.
దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా సేవా వృత్తులైన రజకుల లాండ్రీ షాపులకు, దోభీ ఘాట్లకు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు నెలకు 250 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. స్వరాష్ట్రంలో సుమారు 63 బీసీ, ఎంబీసీ, సంచార జాతుల కులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల పిల్లల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తును బంగారు మయం చేశారు. అంతేకాదు, భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీలకు) ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమే.
వృత్తిదారులకు ఊతమిచ్చేవిధంగా, కులవృత్తులు కుదుటపడే విధంగా, దేశమే అబ్బురపడేలా మరో పథకం తీసుకువచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, శాలివాహన, మేదరి కుల వృత్తుల్లో కొనసాగుతున్నవారికి రూ.లక్ష చొప్పు న ఆర్థికసహాయం అందించేందుకు మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకం. అందుకే బహుజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కొండూరు సత్యనారాయణ: 9154383679
(వ్యాసకర్త: ఎంబీసీ జాతీయ కన్వీనర్)