ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ‘ఓట్ ఫర్ ఇండియా’ అంటూ పిలుపునిచ్చారు. పలు సమావేశాలు, సభల్లోనూ దాన్నే వల్లె వేశారు. అప్పుడు ఆయనింకా దేశానికి ప్రధాని కాలేదు. రూపాయి విలువ పెరగాలంటే, ధరలు తగ్గాలంటే, ఉద్యోగాలు రావాలంటే, అసమానతలు తగ్గాలంటే, అవినీతిని రూపుమాపాలంటే, నల్లధనం వెలికితీయాలంటే బీజేపీని అధికారంలోకి తీసుకు రావాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటేయడమంటే ఇండియాకు ఓటు వేసినట్టేనని మోదీ ప్రచారం చేశారు.
గడిచిన తొమ్మిదేండ్లుగా మోదీనే ప్రధానిగా ఉన్నారు. బెంగళూరులో విపక్షాలు తమ కూటమికి ‘ఇండియా’ (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయెన్స్) అంటే భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి అని నామకరణం చేశారు. అంతే మన అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ ‘అసలు ఇండియా అనేది బ్రిటిష్ వాళ్లు పెట్టిన పేరని, మన దేశం అసలు పేరు ‘భారత్’ అని ట్వీట్ చేశాడు. మరోవైపు విదేశాల్లో చదివి, లండన్లో ఉద్యోగం చేస్తున్న బీజేపీ నేత నిషికాంత్ దూబే కుర్తా, పైజమా గురించి మాట్లాడుతాడు. నిజానికి బీజేపీ ట్విటర్ హ్యాండిల్ పేరు కూడా ‘బీజేపీ ఫర్ ఇండియా’ అని ఉంటుంది. వీరు రాహుల్గాంధీ జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ మీద మాట్లాడుతారు.
రూ.8 వేల కోట్ల విలువైన సకల సౌకర్యాలు గల విమానంలో మోదీ తిరుగుతారు. రేంజ్ రోవర్ కార్లు ఆయనకుంటాయి. ఆయన ఒక్కో డ్రెస్ ధర ఎంతో దేశానికంతా తెలుసు. అయినా ఏదో ఒక వివాదం లేపాలి, మరేదో విమర్శ చేయాలి అంతే. మొన్న కూరగాయల ధరలు పెరగడానికి మియాలు కారణమని, ముస్లింలను టార్గెట్ చేసిన అసోం సీఎం, ఇవాళ దేశం పేరు మీద వివాదం లేవదీశాడు.
విద్వేషపు మాటలు, ఉపన్యాసాలు, తలా, తోకలేని అబద్ధాలతో శారద చిట్ఫండ్ లాంటి అవినీతి కేసుల్లో ఉన్న మతోన్మాది అసోం సీఎం హేమంత్ బిశ్వా శర్మ సామాన్య ప్రజలను రెచ్చగొడుతాడు. ఆయనే కాదు నిషికాంత్ దూబే, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లాంటివారిని మోదీ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు.
మరోవైపు అవినీతి కుటుంబాలు, ఒక కులం వారిని దూషించినందుకు శిక్ష పడినవారు, జైలుకు వెళ్లి వచ్చినవారు, రూ.20 లక్షల కోట్ల అవినీతిలో కూరుకు పోయినవారు విపక్ష కూటమిలో ఉన్నారంటారు ప్రధాని మోదీ. ఇంతేకాదు, అమెరికా, బ్రిటన్ పర్యటనకు వెళ్లి అక్కడ కూడా 2024లో ఎన్డీయేనే దేశంలో మరోసారి అధికారంలోకి రానున్నదని చెప్తున్నారు. ఒక ప్రధాని విదేశాల్లో మన దేశపు ఎన్నికల గురించి మాట్లాడటం ఏమిటి? కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మన దేశ పరిస్థితులను వివరిస్తూ అమెరికాలో మాట్లాడితే ఆయన మీద, దేశాన్ని బదనాం చేస్తున్నాడని ధ్వజమెత్తుతారు. మరి ఇప్పుడు మోదీ మాట్లాడింది ఏమిటి? ఇదేం నీతి?
మోదీ! ఇండియా కూటమి మీద ఇంతలా విషం చిమ్ముడు అవసరమా? పైగా మాజీ ప్రధాని అటల్ జీ, అద్వానీ, బాలా సాహెబ్ ఠాక్రే, జార్జ్ ఫెర్నాండెజ్, పాశ్వాన్ లాంటి వారు ఎన్డీయేను ఏర్పాటుచేశారని పేర్కొంటారు. బ్రిజ్ భూషణ్ లాంటి ఎంపీలు మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చినా, కేసు నమోదైనా, పార్టీ నుంచి సస్పెండ్ లాంటి చర్యలు ఉండవు. అటల్జీ కాలంలో ఇలాంటివారిని దగ్గరికే రానీయలేదు. ఇప్పుడు అలాంటివారికి, పక్కా క్రిమినల్స్, అవినీతిపరులకు బీజేపీ షెల్టర్గా మారిందనడంలో సందేహం లేదు.
ఒకవైపు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రాంతీయ పార్టీలను ఖతం చేస్తామంటడు. ఇప్పుడు అవసరం కాబట్టి వారిని పిలిచి ఎన్డీయే భాగస్వాములంటూ ప్రధాని కౌగిలించుకుంగడు. అదే నడ్డా అందరికీ లేఖలు రాసి మీటింగ్కు పిలుస్తడు. కేంద్ర మంత్రులు మోదీని మహారాజ్ అంటూ కీర్తిస్తారు. అంధ భక్తులు విద్వేషాలు రెచ్చగొట్టే స్టేట్మెంట్లు, ట్వీట్లు చేస్తరు. మోదీ తానా అంటే తందానా అనే మీడియా ఎలాగూ ఉండనే ఉన్నది.
ఇదేం సరిపోనట్టు శ్మశానం, కబ్రస్తాన్, కసబ్, టెర్రరిస్టులంటూ ఒక సామాజిక వర్గం వెంటపడేది బీజేపీ నేతలే. బుల్డోజర్లతో ఇండ్లు కూల్చే ఆటవిక ముఖ్యమంత్రులు ఉన్నది కూడా బీజేపీలోనే. తొమ్మిదేండ్ల మోదీ పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి హామీలు నెరవేర్చలేక ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఓటమి కండ్లముందు కనిపించేసరికి ప్రధాని మోదీ కూడా ఏం మాట్లాడుతున్నారో, ఆయనకే అర్థ్ధం కాని పరిస్థితి ఉన్నది.
– ఎండీ మునీర్ 99518 65223