పల్లవి: తల్లీ.. నీ ఘనకీర్తి
చరిత పుటలో నిలిచినదమ్మా
జననీ… నీ ప్రగతిపథం
హిమశిఖరం తాకినదమ్మా
ఇదే.. మా తెలంగాణ
అభివృద్ధికి ఇది చిరునామా
సగర్వంగా చాటిచెప్పుకొనే
పర్వదినం ఇదేనమ్మా…
చరణం: మారుమూల పల్లెల్లో
మట్టిపూల మా బతుకమ్మను
పుత్తడి పూలతో పూజించి
పువ్వుల పండుగ జరిపితివమ్మా
దేశ విదేశాల్లో ఊరేగి
గిన్నీసు బుక్కులో ఎక్కితివమ్మా… ॥తల్లీ॥
చరణం: నెర్రెలిచ్చిన నల్లరేగళ్లల్లో
గోదారమ్మను చూపితివమ్మా
పల్లేరుకాయలు కాసిన నేలలో
పసిడి పంటలతో మురిసితివమ్మా
రైతుల చావులు ఆపితివమ్మా… ॥తల్లీ॥
చరణం: ఇల్లు వాకిలి పల్లెల విడిచి
కూలీరాళ్లకు వలసపోయిన
గుక్కెడు నీళ్లకు కటకటలాడి
వందల మైళ్లు నడిచివెళ్లిన
కరువు రక్కసిని తరిమితివమ్మా
చెరువులు, కుంటలు నింపితివమ్మా… ॥తల్లీ॥
చరణం: ఇసుక తిన్నెలపై వెలసిన కోవెల
చలువ రాయిని చెక్కిన శిల్పిని
రామప్ప మా దేవాలయాన్ని
కాకతీయకళ వైభవానికి
యునెస్కో గుర్తింపు తెచ్చితివమ్మా
జగాన కీర్తిని చాటితివమ్మా… ॥తల్లీ॥
చరణం: పరాయి పాలన పడగనీడలో
శిథిలమైన మా చీకటి బతుకుల
ప్రగతిపథాన నడిపితివమ్మా
ప్రపంచ పటములో నిలిపితివమ్మా
భరతావనికే తలమానికమై
భావితరాలకు వెలుగునీవమ్మా… ॥తల్లీ॥
– గసిగంటి రాజలింగం
63025 30515