గగనతలంలోనూ తెలంగాణ రికార్డులను సృష్టిస్తున్నది. అటు ప్రయాణికుల పరంగానూ, ఇటు సరుకు రవాణాపరంగానూ హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రపథంలో ఉంటూ మన రాష్ట్రం ఘనకీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్నది. 2008లో ప్రారంభించిన ఈ ఎయిర్పోర్టులో తొలుత ఏటా 1.2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా, 56,700 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరిగేది. అనతి కాలంలోనే దక్షిణ, మధ్య భారతానికి వారధిగా శంషాబాద్ విమానాశ్రయం పేరొందింది. ప్రస్తుతం ఏటా 2.1 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు జరుపుతుండగా, 1.48 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరుగుతున్నది. దేశీయ కార్గో రవాణాలో ప్రస్తుతం ఐదో స్థానానికి చేరుకుంది. అంతర్జాతీయంగానూ ఈ ఎయిర్పోర్టు విశేష సేవలను అందిస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నది. అంతర్జాతీయ సరుకు రవాణా 2013-14లో 16,816 మెట్రిక్ టన్నులు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అది 25,590 మెట్రిక్ టన్నులకు పెరిగింది.
గణాంకాల్లో కనిపించే ఈ వృద్ధి వెనుక మన రాష్ట్రం సాధించిన అప్రతిహత విజయాలున్నాయి. ఈ ఎనిమిదేండ్లలో దేశంలోనే పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ మారింది. అనేక దేశీయ, అంతర్జాతీయ ఐటీ కంపెనీలు హైదరాబాద్కు తరలివచ్చాయి. ఇతర పలు రంగాల్లోనూ దిగ్గజ సంస్థలు భారీ ఎత్తున విస్తరణ కార్యకలాపాలు చేపట్టాయి. వీటి వల్లనే గగనతలంలో రాకపోకలు, సరుకు రవాణా పెరిగిపోయాయి. పారిశ్రామిక రంగంతోపాటు వ్యవసాయంలో తెలంగాణ సాధించిన ఘనవిజయాలు రాష్ట్రంలో సంపదను పెంచాయి. ఫలితంగా దేశ, విదేశీయానం గణనీయంగా పెరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రగతి ప్రస్థానం వెనుక ఇవన్నీ కారణాలే.
‘తెలంగాణ ఏర్పాటైతే కరెంటు ఉండదు, తీవ్రవాదం పెరిగిపోతుంది, మతవైషమ్యాలు పెచ్చరిల్లుతాయి, అభివృద్ధి అడుగంటుతుంది’ అంటూ ఉద్యమకాలంలో శాపనార్థాలు పెట్టిన వాళ్లు తక్కువేమీ లేరు. వారు ఇప్పుడెక్కడా కనిపించటం లేదు. బట్టలు ఆరేసుకోవటానికే పనికొస్తాయని వారు వెక్కిరించిన కరెంటు తీగలు నిర్విరామంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నాయి. దేశమంతటా బొగ్గు కొరతతో ఇటీవల చీకట్లు అలుముకున్నా తెలంగాణ కరెంటు వెలుగులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. రాజకీయాలంటే మతచిచ్చు పెట్టటమనే ప్రమాదకర ధోరణిని బీజేపీ దేశవ్యాప్తంగా అమలుపరుస్తున్న నేటి సంక్షోభ సమయంలో నిజమైన హిందూ-ముస్లిం సమైక్యతకు నిదర్శంగా, ప్రశాంతతకు చిహ్నంగా మన రాష్ట్రం వర్ధిల్లుతున్నది. ఇక సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో తనదైన నమూనాను యావత్దేశానికి ప్రతిపాదించే స్థాయికి తెలంగాణ ఎదిగింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నమోదు చేస్తున్న విజయాలు తెలంగాణ కీర్తి కిరీటానికి మరింత వన్నె తీసుకొస్తున్నాయి.