డాక్టర్ గౌరవ్ గాంధీ జామ్నగర్లోని ఎం పీ షా ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసే ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు (కార్డియాలజిస్ట్). 16 వేల శస్త్రచికిత్సలు నిర్వహించిన చరిత్ర ఆయనది. అయితేనేం అంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన కేవలం 41 ఏండ్ల వయసులో సాధారణ ఈసీజీ రీడింగ్ ఉన్నప్పటికీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనల గురించి మనం అప్పుడప్పు డు వింటూనే ఉన్నాం. డాక్టర్ గాంధీ గతేడాది కాలంగా ఎం పీ షా ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు కార్డియాలజీ బోధించడంతోపాటు ఔట్ పేషంట్ విభాగం (ఓపీడీ)లో క్లిష్టమైన రోగులకు చికిత్స అందించేవారు.
సాధారణ ఈసీజీ రీడింగ్ ఉన్నప్పటికీ మృత్యువు ఆయనను ఎలా కబళించింది అన్న సందేహం మనకు కలుగవచ్చు. దాదాపు 20-30 శాతం కేసుల్లో గుండెపోటు వచ్చినప్పటికీ మొదటి ఈసీజీ రీడింగ్ సాధారణంగానే ఉంటుంది. ప్రాథమిక సమాచా రం ప్రకారం.. డాక్టర్ గౌరవ్గాంధీ 2023 జూన్ 6న ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈ సంఘటన మరోసారి భారతీయ యువతకు ఆందోళనను రేకెత్తిస్తున్నది. ఈ సంఘటనకు ముందు ఆయనలో ఎలాంటి ప్రమాద లక్షణాలు కనిపించలేదు. వయసులో చిన్నవాడు. శారీరకంగా చాలా చురుకుగా ఉండేవాడు. రోజు దాదాపు 14 గంటలు పనిచేసే ఆయనకు ధూమపానం, మద్యపానం అలవాటు లేదు. గుండె సంబంధిత వ్యాధులను సూచించే వైద్య చరిత్ర లేదు. కొవిడ్-19 సంక్రమించిన చరిత్ర లేదు. అయినా డాక్టర్ గౌరవ్గాంధీ హఠాన్మరణం పొంద డం ఒకింత విస్మయానికి గురిచేసిందంటారు మరో హృద్రోగ నిపుణుడు డాక్టర్ సౌగతా ఛటర్జీ.
మరో డాక్టర్ నందిని దేశాయ్ మాట్లాడుతూ.. జూన్ 6 తెల్లవారుజామున 2 గంటలకు ఛాతిలో అసౌకర్యంతో గౌరవ్గాంధీ, శారద దవాఖానకు వెళ్లి అక్కడ ఈసీజీ చేయించుకున్నారు. రీడింగ్ సాధారణంగా రావడంతో అసిడిటీగా భావించి ఇంజిక్షన్ తీసుకున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉత్పన్నమవుతుందేమోనన్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఒక గంటపాటు అక్కడే గడిపి తర్వాత ఇంటికి వెళ్లారు. అయితే ఆశ్చర్యకరంగా ఉదయం 6 గంటల సమయంలో ఆయన బాత్రూమ్లో కుప్పకూలి ఉండడాన్ని ఆయన భార్య గమనించింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే అతడిని గురుగోవింద్ దవాఖానకు తరలించారు. ఆయనను వెంటిలేటర్పై ఉంచి కార్డియోగ్రామ్ చేయగా గుండె చాలా బలహీనంగా కొట్టుకోవడం గమనించి దాదాపు 45 నిమిషాల పాటు కార్డియో పల్మొనరీ రెససిటేషన్ -సీపీఆర్ (ఛాతిని అరచేత్తో నొక్కడం ద్వారా గుండె సాధారణ స్థితికి చేర్చే విధానం) చేసినప్పటికీ గుండె పునరుద్ధరించబడలేదు.
వైద్యపరంగా, ఇది ఆకస్మిక గుండె స్థంబన (sudden cardiac arrest) అని భావించి మేము పోస్ట్మార్టం నిర్వహించినప్పటికీ నివేదికలో గుండె ఆకస్మిక స్థంబనకు గురైనట్టు నిర్ధారించే ఎటువంటి ఆధారాలు చూపలేదు. సాధారణంగా కార్డియాక్ అరెస్ట్ లక్షణాలను సూచించే సమయం, మరణం మధ్య వ్యవధి చాలా తక్కువగా ఉంటుందన్నారు. సాధారణ ఈసీజీ రీడింగ్ ఉన్నప్పటికీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తుంది. సాధారణ ఈసీజీ రీడింగ్లో ధమనులలో ఏర్పడిన లక్షణరహిత (asymptomatic) అడ్డంకులు బహిర్గతం కాకపోయినప్పటికీ భవిష్యత్తులో అవి గుండెపోటుకు దారితీయవచ్చు.
గత కొన్నేండ్ల నుంచి 25-30 ఏండ్ల వయసు గలవారు కార్డియాక్ అరెస్ట్ బారిన పడుతున్న సందర్భాలు ఎక్కువవుతున్నట్టు పేర్కొన్నారు డాక్టర్ సౌగతా ఛటర్జీ. అంబాలాలోని మెడిట్రినా హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ్ శర్మ మాట్లాడుతూ.. భారతదేశంలో సాధారణంగా 40 ఏండ్ల నుంచే అధిక రక్తపోటు (Hypertension) ప్రారంభమవుతుండగా పాశ్చాత్య దేశాల్లో ఈ పరిస్థితి 60-70 ఏండ్ల మధ్య ఏర్పడుతుంది. మన దేశ జనాభాలో 40 ఏండ్లు పైబడిన వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తే, దాదాపు 60 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అలాగే మన దేశంలో పక్షవాతం (Brain Stroke) కారణంగా సంభవించే 57 శాతం మరణాలు, గుండె రక్తనాళాల సం కోచ వ్యాధి (Coronary artery Disease) కారణంగా సంభవించే 24 శాతం మరణాలు అధిక రక్తపోటు వల్లే కావడం గమనార్హం అని అన్నారాయన.
నేటి యువత తీవ్ర వృత్తిపరమైన పోటీ, వృత్తి, జీవితం మధ్య సమతుల్యత వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. సుదీర్ఘ పని గంటలు, జంక్ఫుడ్, శారీరక వ్యాయామం, నిద్రలేమి కూడా కారణమవుతున్నది. చాలామంది యువత ధూమపానం వ్యసనంతో అధిక రక్తపోటును కొనితెచ్చుకుంటున్నారు. అధిక రక్తపోటును సాధారణంగా మందుల ద్వారా నియంత్రించాలి. కానీ పరిస్థితి క్షీణిస్తే, అది పక్షవాతం లేదా గుండెపోటుకు కారణమై రోగి ఆసుపత్రిలో చేరవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని డాక్టర్ శర్మ పేర్కొన్నారు.
40 లేదా 50 ఏండ్ల వరకు వేచి ఉండకుండా 25 ఏండ్ల నుంచే రక్తపోటును నిర్ధారిత సమయానుసారం పరీక్ష చేయించుకోవాలి. తరచూ తలనొప్పి రావడం, తక్కువ దూరం నడిచినా, సాధారణ పరిస్థితుల్లో కూడా ఊపిరి ఆడకపోవడం లాంటి లక్షణాలుగా రక్తపోటు ప్రారంభ దశగా గుర్తించి, వెంటనే డాక్టర్ పర్యవేక్షణలో మందులు తీసుకోవాలి. ఆహారంలో ఉప్పును తగ్గించడంతో పాటు బరువును నిర్దేశిత స్థాయిలో ఉండేలా సాధారణ వ్యాయామం చేయ డం, ఒత్తిడి రహిత జీవితం గడప డం ద్వారా రక్తపోటును తగ్గించుకోవచ్చు. కుటుంబంలో హృద్రోగ నేప థ్యం ఉన్నవారు తప్పనిసరిగా హైపర్ కొలెస్టెరోలేమియా పరీక్ష చేయించుకోవాలి. 45 ఏండ్ల తర్వా త ప్రతి ఒక్కరూ కాల్షియం పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. సరైన మందులు తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేపట్టడం ద్వారా గుండె సంబంధిత ప్రమాదాల నుంచి బయట పడవచ్చు.