తెలంగాణ వివక్షపై ఆయన గళం ఓ గర్జనైంది.. అడుగడుగునా ఈ ప్రాంతానికి జరుగుతున్న దోపిడీని ప్రశ్నించడంలో ముందుంది. తెలంగాణ ఉద్యమంలో, బీఆర్ఎస్లో సామాన్య కార్యకర్తగా మొదలైన ఆయన అడుగులు ఉద్యమ రథసారథి కేసీఆర్ వెంట అలుపు లేకుండా నడిచాయి. కానీ అలాంటి వ్యక్తిని రంగులు మార్చే ఊసరవెల్లులు అవమానించాలని ప్రయత్నిస్తుంటే.. అలాంటి వారికి పదవీ వ్యామోహం ఉన్నదని పసిగట్టాల్సిన అవసరం ఉన్నది.
అధినాయకునికి అత్యంత విధేయునిగా ఆయన తెలంగాణ జెండాను ఎత్తుకున్నారు. అచేతనంగా ఉన్న ఆనాటి తెలంగాణలో ఆయన మాటలు ఓ గుండె నిబ్బరం… కొండంత కష్టాన్ని పోగొట్టి ఆదరించే తత్వం ఆయన నైజం. అటు ప్రజా చైతన్యానికి…ఇటు పార్టీ అధిష్ఠానానికి విధేయునిగా ఉన్న ఆ అసలు సిసలైన నాయకుడు.. తన్నీరు హరీశ్రావు. నాటికీ, నేటికీ ప్రజల పట్ల ఆయన చూపే ఆత్మీయతలో వీసమంత కూడా మార్పు రాలేదు. దీన్ని బట్టే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు పడితే అప్పుడు రాజీనామా చేసిన వ్యక్తి హరీశ్రావు. 2008లో యూపీఏ తీరును నిరసిస్తూ… పార్టీ అధినేత రాజీనామాలకు పిలుపునిచ్చిన సందర్భంలో ఆనాడు అసెంబ్లీలో హరీశ్రావు మాట్లాడిన తీరు నేటికీ గుర్తుండిపోయే సాక్ష్యం. శాసనసభ పక్ష నాయకునిగా అవకాశం ఉన్నప్పటికీ ఆనాడు ఇతర నాయకులకు అవకాశం ఇచ్చి.. ఉపనేతగా శాసనసభలో సమైక్య వాదులకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు ఆయన. తాను నాయకునిగా ఎదుగుతున్న కొద్దీ అంతే స్థాయిలో ఒదుగుతూ వస్తున్న వ్యక్తి. ఇప్పటికీ పార్టీ అధిష్ఠానం నిర్ణయాలకు కానీ, సీఎం కేసీఆర్ నిర్ణయాలకు కానీ విరుద్ధంగా ఆయన ఎక్కడా పని చేసింది లేదు. పార్టీ ఆదేశిస్తే అక్కడ పార్టీ గెలుపును భుజాన మోస్తారు. కష్టం వచ్చిందంటే.. నేనున్నాంటూ భరోసా ఇవ్వడంలో ముందుంటారు. ప్రతి ఎన్నికల్లో రెట్టింపు ప్రజాదరణ పొందుతూ ప్రజల అంతులేని అభిమానాన్ని పొందుతున్నారు. అటువంటి నాయకునిపై తనకు టికెట్ ఇచ్చినా…తన కొడుకుకు ఇవ్వలేదని హన్మంతరావు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండించాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి మంత్రి వర్గంలో హరీశ్రావు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరించారు. మూడేండ్ల లోపే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రేయింబవళ్లు కష్టపడ్డారు. నేడు స్వరాష్ట్రంలో భూములన్నీ పచ్చగా కళకళలాడుతున్నాయంటే అధిష్ఠాన నిర్ణయం, సీఎం కేసీఆర్ ఆదేశాల పట్ల ఆయన ఎంత నిబద్ధతతో పని చేస్తారనేది అర్థమవుతుంది.
ఉద్యమ సమయంలోనూ హరీశ్రావు అంటే ప్రజల్లో జోష్ నిండుకునేది. కేసీఆర్ తర్వాత అంతటి గొప్ప ధైర్యంతో మాట్లాడే ఆయన మాటల కోసం యువత ఎదురు చూసేది. ఎక్కడా విసుగు చెందని ఆయన సక్కని చూపే ప్రజలకు ఓ భరోసాలా ఉంటుంది. ఆనాడు ఉద్యమ సమయంలో ఏ మూలన ఉద్యమ నేతకు ఆపద వచ్చినా అధిష్ఠానం ఆదేశాలతో అక్కడకు వెళ్లి భరోసా కల్పించిన నాయకుడు హరీశ్రావు. అటువంటి నాయకునిపై అక్కసును వెళ్లగక్కడం, అవమానకర మాటలు మాట్లాడేవారు నిజంగా నీతిమాలిన వారేనని చెప్పవచ్చు.
తెలంగాణ ట్రబుల్ షూటర్గా ఇచ్చిన ప్రతి బాధ్యతను, సవాల్ను విజయవంతంగా పూర్తి చేసే సత్తా కలిగిన నాయకుడు హరీశ్రావు. 2016లో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతను దిగ్విజయంగా పూర్తి చేయడంతో విస్తరించిన ఆయన కార్యదక్షత నారాయణ ఖేడ్ ఉపఎన్నికతో మరింత రాటు దేలింది. అటువంటి నాయకుని మీద బురద జల్లే ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం అంతా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నప్పుడు ‘తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి హేళనగా మాట్లాడిన చోటు నుంచే… మొన్నటి బడ్జెట్లో మన తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ఆర్థికశాఖ మంత్రిగా దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టి భారతదేశమే ముక్కున వేలేసుకునేలా చేసిన ఘనత హరీశ్రావుకే దక్కుతుంది.
ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి తెలంగాణ ప్రజలు రోగాల బారిన పడటాన్ని తగ్గించారు. ఒకనాడు డిగ్రీ కళాశాలల కోసం పోరాడిన ఆ నాయకుడు నేడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలిపి 33 వైద్య కళాశాలలు ఏర్పాటయ్యేలా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కృషి చేశారు. ఇలాంటి నాయకుడిపైనా అభాండాలు వేసేది?
పార్టీ అధిష్ఠానం నిర్ణయం ప్రకారం వ్యవహరిస్తే వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం నిజంగా సిగ్గు చేటు. అటువంటి ఆవేశపూరిత నాయకులను తెలంగాణ సమాజం దూరంగా పెట్టడమే మంచిది. ఉద్యమ సమయం నుంచి నేటి వరకూ అధిష్ఠానం గీసిన గీత దాటకుండా పార్టీని వెన్నంటి ఉన్న లీడర్ హరీశ్ రావు. కేసీఆర్ మాటే శిరోధార్యం అంటూ… ఉద్యమ సారథి వెంట ఉంటూ, ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటూ, తనను నమ్మిన వారికి కొండంత ధైర్యంగా నిలబడే వ్యక్తి హరీశ్రావు. ప్రజలు మెచ్చే అలాంటి బాధ్యత గల నాయకునిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా గర్హనీయం.