ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలో ఏర్పాటయ్యే కొన్ని సంస్థలు ప్రజాకంటకంగా తయారైతే ఎలా? అక్రమాలను అడ్డుకునేందుకు తగిలించిన కోరలతో అవి అమాయకులను కాటేస్తే ఎలా? చెరువులు, కుంటలు, తదితర జలవనరుల్లోకి చొచ్చుకుపోయిన జనావాసాల సమస్య పరిష్కారానికి ఏర్పాటైన హైడ్రా పనితీరును గమనించిన ఎవరికైనా ఈ తరహా సందేహాలు ముప్పిరిగొనడం సహజమే. అసలు చట్టం, న్యాయం అమలయ్యే దేశంలో ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా దాడులు చేయడం, ఇండ్లల్లో చిన్నపిల్లలు కనీసం పుస్తకాలు సర్దుకునే అవకాశం కూడా లేకుండా కూల్చివేతలు చేపట్టడం, ఉన్నపళంగా బస్తీవాసులను రోడ్డున పడేయటం వంటి చర్యలు అమానుషం కాకపోతే మరేమిటి? కోర్టుల నుంచి ఉపశమనం పొందే వీల్లేకుండా వారాంతాల్లో కూల్చివేతలు చేపట్టడం కుటిలబుద్ధిని సూచిస్తుందని చెప్పాలి. ఈ నిరంకుశ, కర్కశ బుల్డోజర్ ఆగడాలకు హైకోర్టు సోమవారం ఇచ్చిన ఆదేశాలతో బ్రేకులు వేయడం ముదావహం. ఆగమేఘాల మీద జరిపే కూల్చివేతలకు చెక్ పెట్టింది. న్యాయవివాదంలో ఉన్న భూముల్లో సైతం రాత్రికి రాత్రే బోర్డులు పాతే మాఫియా ఎత్తుగడలు హైడ్రా అత్యుత్సాహానికి పరాకాష్టగా భావించాలి. సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అని హైకోర్టు నిలదీయడం గమనార్హం. సూరారం భూముల్లో పాతిన బోర్డులు తొలగించాలని ఆదేశించడం హైడ్రాకు, ప్రభుత్వానికి చెంపపెట్టు.
ఒక అక్రమ నిర్మాణం వెలిసిందంటే అది అధికార యంత్రాంగం అలసత్వం వల్ల ఏర్పడిందే అయి ఉండాలనేది సాధారణ తర్కం. అది పూర్తయ్యే వరకు నిద్రపోయి ఇప్పుడు హఠాత్తుగా అక్రమమని కూల్చివేతకు ఎలా తెగబడతారని ఉన్నత న్యాయస్థానం మండిపడింది. తొలిదశలోనే అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటే కథ తనదాకా వచ్చేది కాదని చురకలు వేసింది. అక్రమ నిర్మాణమే అయినప్పటికీ కూల్చివేత సక్రమంగా ఉండాలని హైడ్రాకు గడ్డిపెట్టింది. అసలు ఏ విధివిధానాల ప్రకారం కూలుస్తున్నారో వాటిని తన ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. సదరు విధివిధానాల సంగతి తేల్చేవరకు నిర్మాణాల జోలికి పోవద్దని హెచ్చరించడం హైడ్రా అక్రమాలను పరోక్షంగా ఎత్తిచూపడమే. హైడ్రా వంటి అనాలోచిత చర్యల పుణ్యమా అని రాష్ట్రంలో, ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కుదేలు కావడం తెలిసిందే.
జలవనరుల హద్దుబద్దులు పరిరక్షించే సమున్నత లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా పనితీరు మొదటినుంచీ సందేహాస్పదంగానే ఉన్నది. నిబంధనలను గాలికి వదిలేసి దండయాత్రలా దూకుడుగా పోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పేదల పైకి బుల్డోజర్లు, పెద్దలకు జీహుజూర్ అన్నట్టుగా వివక్ష పాటించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మనది సంక్షేమ రాజ్యం. ఏది చేసినా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిందే. మన ప్రజలను మన ప్రభుత్వమే శత్రుదేశీయుల్లా తరిమికొట్టడం విడ్డూరం. ఉన్నపళంగా వీధుల్లోకి నెట్టేస్తే నిర్వాసితులు హైడ్రాను తమ మీదకు ఉసిగొల్పిన సర్కార్ను మోటుమాటలతో కడిగిపారేస్తుండటం మనం చూస్తున్నాం. విపక్ష బీఆర్ఎస్ తనవంతుగా బాధితులను ఎప్పటికప్పుడు ఓదారుస్తూ ధైర్యం చెప్తున్నది. మరోవైపు ప్రభుత్వ అరాచకాలపై పోరాటం సాగిస్తున్నది. ఎఫ్టీఎల్ గుర్తింపు వంటి కనీస విధులను కూడా పట్టించుకోకుండా కూల్చివేతలకు పాల్పడుతుండటం బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు, నిబంధనల ఉల్లంఘన కూడా అవుతుంది. అదీ న్యాయస్థానం చెప్పాల్సి రావడం దురదృష్టకరం. హైడ్రాకు హైకోర్టు గతంలో అనేకసార్లు అక్షింతలు వేసింది. ఈసారి గట్టిగానే తలంటు పోసింది. ఇప్పటికైనా హైడ్రా తన తీరు మార్చుకుంటుందా? ఎప్పటిలా ధిక్కారమే చూపుతుందా? అనేది త్వరలోనే తేలిపోతుంది.