Harish Rao | రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలు విడుదల చేస్తాయి. కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక తాము చేయదలుచుకున్న పనులతో కూడిన ప్రగతి ప్రణాళిక ప్రకటిస్తాయి. కొన్ని పార్టీలు కేవలం అధికారంలోకి రావడానికి అరచేతిలో వైకుంఠం చూపినట్టు మ్యానిఫెస్టోలు విడుదల చేస్తాయి. బీఆర్ఎస్ మొదటి కోవలోకి చెందితే, కాంగ్రెస్ రెండవ కోవలోకి చెందుతుంది. 2014, 2018లో బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసిన విషయం ప్రజల అనుభవంలో ఉన్నది.
అదే సమయంలో కాంగ్రెస్ ప్రతీసారి చేసిన మోసం కూడా వారి కండ్లముందే ఉన్నది. 2004, 2009 మ్యానిఫెస్టోల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించింది. చరిత్ర పునరావృతం అవుతున్నది. 2023లో ఇచ్చిన హామీలను కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కుతున్నది. తాము అధికారంలోకి రావడానికి హామీలు ఇస్తాం తప్ప, వాటిని అమలు చేయడానికి కాదు అని కాంగ్రెస్ చేతల ద్వారా నిరూపిస్తున్నది.
నిరుపేదలు, రైతులు, మహిళలు అధికంగా ఉన్న రాష్ట్రం మనది. కేసీఆర్ ప్రభుత్వం ఈ ముగ్గురి విషయంలోనే అధిక దృష్టి పెట్టింది. పేదలు, రైతులు, మహిళలు తెలంగాణ రాష్ట్రంలో గౌరవప్రదంగా, ఆత్మవిశ్వాసంతో బతికే పరిస్థితులను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. రేవంత్రెడ్డి ప్రభుత్వం కూడా ఈ కృషిని కొనసాగిస్తుందని ఆశించాం. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ప్రభుత్వ ప్రాధాన్యాల్లో మహిళలు, రైతులు, పేదలు లేకపోవడం విస్మయానికి గురిచేసింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యాలను ఎంచుకోవడంలోనే లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. సమాజంలో దాదాపు 90% మంది పేదలు, రైతులు, మహిళలే ఉంటారు. వారి కోసం కాకుండా ప్రభుత్వం మరెవరి కోసం పనిచేస్తున్నదో అర్థం కావడం లేదు.
ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం. 18 ఏండ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పును ఆర్థిక సాయం చేస్తామని మాటిచ్చారు. ఈ మొదటి హామీనే ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటింది. నెలకు రూ.2,500 చొప్పున ఒక్కో మహిళకు మొత్తం రూ.7,500 ప్రభుత్వం ఇప్పటికే బకాయి పడింది. పార్లమెంటు ఎన్నికలు ముగిసే వరకు మరో రెండు నెలలు గడుస్తాయి. అంటే మొత్తం ఒక్కో మహిళకు ప్రభుత్వం బకాయి పడిన మొత్తం అక్షరాలా రూ.12,500. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినట్టు ఒక్కో మహిళ ఖాతాలో ఈ రూ.12,500 జమ చేసిన తర్వాతనే ఓట్లు అడగాలి. మహాలక్ష్మి పథకం కింద నగదు సాయం చేయకుండా మహిళల ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్కు లేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ లాంటి పథకాలు తెలంగాణలో వ్యవసాయ దిగుబడులు పెరగడానికి, రైతాంగం సంక్షోభం నుంచి బయటపడి, ఆత్మవిశ్వాసంతో బతకడానికి ఉపయోగపడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికన్నా చాలా ఎక్కువే తాము రైతుల కోసం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రకటించింది. ఆరు గ్యారెంటీలు, ఎన్నికల మ్యానిఫెస్టోలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి ఎన్నో హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ ఆచరణలో మాత్రం ఒక్కటంటే ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. కొత్త పథకాలేవీ అమల్లోకి రాలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను కూడా సంపూర్ణంగా కొనసాగించలేకపోతున్నారు. ఫలితంగా నేడు రాష్ట్రంలో వ్యవసాయరంగం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయే దుస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పాలనలో ప్రతిదీ సమయానికి సమకూరి సంతృప్తి, సంతోషంగా ఉన్న రైతు మోములో మళ్లీ నైరాశ్యం కనిపిస్తున్నది. ఆనాటి రోజులు తెస్తామనడంలో అసలు అర్థం ఇదేనని ఇప్పుడు రైతులు బాధపడుతున్నారు.
రైతుభరోసా కింద ఎకరానికి రూ.15,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత యాసంగి సీజన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్టే పదివేల చొప్పున అందిస్తున్నది. అది కూడా ఇంకా అందరికీ అందలేదు. కాంగ్రెస్ పార్టీ పెంచుతామన్న రైతుభరోసా సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఒక సీజన్ కు ఎకరానికి రూ.5వేల చొప్పున అదనంగా ఇస్తామన్న డబ్బులు ఇంకా ఇయ్యలేదు. రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులకు చెందిన కోటి 43 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ పదివేల చొప్పున సాయం చేసింది. కాంగ్రెస్ రూ.5 వేలు పెంచుతామని ప్రకటించింది. ఇప్పటికే ఎకరానికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.7,250 కోట్లు రైతులకు ప్రభుత్వం బకాయి పడింది. ఈ బకాయి చెల్లించడంతోపాటు వచ్చే వానకాలం సీజన్ నుంచి మొత్తం 58.33 లక్షల మంది రైతులకు పెంచిన సాయం అందించాల్సి ఉన్నది. ఈ విషయంలో కూడా ప్రభుత్వం నేటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రైతులతోపాటు కౌలురైతులకు కూడా ఎకరానికి రూ.15వేల చొప్పున రైతుభరోసా సాయం ఇస్తామని చెప్పారు. అది కూడా అమలు కావడం లేదు. వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. కానీ దానికి సంబంధించి కూడా నేటివరకు విధివిధానాలే రూపొందించలేదు. చెప్పిన మాట ప్రకారం ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతులందరికీ రైతుభరోసా డబ్బులు బ్యాంకు ఖాతాలో వేయకుండా రైతులను ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్కు లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, రైతులకు ఒకేసారి రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, 2023 డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం రోజే రుణమాఫీ జరుగుతుందని హామీ ఇచ్చారు. కానీ నేటివరకు రుణమాఫీ జరగలేదు. కాంగ్రెస్ మాటలు నమ్మి రెండు లక్షల వరకు అప్పులు తీసుకున్న రైతులపై వడ్డీ భారం పెరుగుతున్నది. చేస్తామన్న రూ.2 లక్షల రుణమాఫీతోపాటు జరిగిన జాప్యం వల్ల పడిన వడ్డీని కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉన్నది. ఆలస్యం అయిన కొద్దీ ఈ భారం మరింత పెరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో అంత వేగంగా స్పందిస్తున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటివరకు అసలు రుణాలు తీసుకున్న రైతులు ఎందరు? బ్యాంకుల్లో ఎన్ని రుణాలు ఉన్నాయి? వాటికి వడ్డీ ఎంత అవుతుంది? రుణమాఫీకి ఎలాంటి విధానం అవలంబించాలి? అనే విషయంలో కాంగ్రెస్ నేటి వరకు కనీసం ఒక నిర్ణయం తీసుకోలేదు. పార్లమెంటు ఎన్నికల వరకు కాలక్షేపం చేసి, అప్పుడు కూడా ఓట్లు దండుకుని రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసే వరకు, కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడానికి రైతుల వద్దకు రావొద్దు.
వరిధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానకాలం సీజన్ వడ్లు మార్కెట్కు వచ్చాయి. కానీ ఎక్కడా ఒక క్వింటాకు కూడా బోనస్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎన్నికల ముందు రైతులెవరూ తమ ధాన్యాన్ని అమ్ముకోకండి, మేము వచ్చాక రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ మాటలు నమ్మి రైతులు ధాన్యాన్ని అమ్ముకోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ధాన్యాన్ని మార్కెట్కు తీసుకుపోయారు. కానీ, మార్కెట్లో రూ.500 బోనస్ గురించి ఎవరిని అడిగినా సమాధానం లేదు. బోనస్ మాట అడిగితే బోగస్ మాటలు చెప్తున్నారు. వానకాలం పంటకు బోనస్ ఇవ్వలేదు. పార్లమెంటు ఎన్నికలు వచ్చే నాటికి యాసంగి పంట కూడా చేతికొస్తుంది. కనీసం అప్పుడైనా రూ.500 బోనస్ ఇస్తారా? లేదా? రైతులకు బోనస్ ఇవ్వకుండా ఓట్లు అడిగితే ప్రతిఘటన తప్పదు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే వ్యవసాయదారుల నుంచి తిరుగుబాటు ఎదుర్కోక తప్పదు.
ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత ఖర్చయినా వెనుకాడకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేసింది. ఎక్కడా ఒక ఎకరం కూడా ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నది. కానీ, కాంగ్రెస్ వచ్చిన మొదటి వంద రోజుల్లోనే రైతులు మళ్లీ కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. కరెంటు లేక, బోర్లు పోయక పంటలను తగులబెట్టుకోవాల్సిన పాత రోజులొస్తున్నాయి. వేల రూపాయల ఆర్థిక భారం వహించి, ట్యాంకర్లతో నీరు తెచ్చి పంటలకు తడి ఇవ్వాల్సిన దుస్థితి వచ్చింది. పంటలు ఎండిపోయి రైతులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన ఘోరాలు చూడాల్సి వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లోనే 178 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి రావడం పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో తేటతెల్లంచేస్తున్నది. అర్ధరాత్రి కరెంటు పెట్టబోయి షాక్కు గురై మరణించే దుర్ఘటనలు పునరావృతమవుతున్నాయి. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత రైతాంగం మోములో చూసిన సంతృప్తి, సంతోషం క్రమేణా తొలగిపోతుండటం బాధాకరం.
కాంగ్రెస్ వచ్చిన మొదటి వంద రోజుల్లోనే రైతులు మళ్లీ కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. కరెంటు లేక, బోర్లు పోయక పంటలను తగులబెట్టుకోవాల్సిన పాత రోజులొస్తున్నాయి. వేల రూపాయల ఆర్థిక భారం వహించి, ట్యాంకర్లతో నీరు తెచ్చి పంటలకు తడి ఇవ్వాల్సిన దుస్థితి వచ్చింది. పంటలు ఎండిపోయి రైతులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన ఘోరాలు చూడాల్సి వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లోనే 178 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి రావడం పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో తేటతెల్లంచేస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడితే, మా పార్టీ గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ ఖాళీ అంటున్నారు. ఒక ముఖ్యమంత్రిగా వారు చేయాల్సింది ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి రైతులకు నీరు ఇవ్వడం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో ముందుచూపుతో వ్యవహరించి, ఎండాకాలం రాకముందే ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని చెరువులన్నీ నింపేది. తద్వారా భూగర్భజలాలు కూడా పెరిగేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించలేదు. ప్రాజెక్టులను ఉపయోగించుకోలేదు. చెరువులు నింపలేదు. ఫలితంగా నేడు గ్రామాల్లో కరువు పరిస్థితి వచ్చింది. మళ్లీ పంట పొలాల్లో బోరు మిషన్లు దిగుతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో బీడు భూముల్లో సైతం బంగారు పంటలు పండితే, నేటి కాంగ్రెస్ పాలనలో పచ్చటిపంటలు మంటల పాలు అవుతున్నాయి.
ఆసరా పెన్షన్ను రూ.4,000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నేటి వరకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వలేదు. గతంలో ఇచ్చే పెన్షన్ కూడా జనవరి నెలది ఎగ్గొట్టారు. రాష్ట్రంలో 44.82 లక్షల మంది పెన్షన్ దారులున్నారు. వారికి ఒక్కో నెల అదనంగా రూ.రెండు వేలు రావాలి. జనవరి నెలవి రూ.నాలుగు వేలు రావాలి. మిగతా రెండు నెలలకు కలిపి రూ.4వేలు రావాలి. అంటే మొత్తం ఒక్కొక్క పెన్షనర్కు ఇప్పటికే ఈ ప్రభుత్వం రూ.8వేలు బకాయి పడింది. మొత్తం పెన్షన్దారులకు కలిపి రూ.3,585 కోట్లు బకాయి పడింది. ప్రస్తుత నెలను కూడా కలుపుకుంటే, అది మరో రెండు వేలు అవుతుంది. పెన్షన్దారులకు పెంచుతామన్న భృతి పెంచకుండా, ఉన్నవి కూడా ఎగ్గొట్టడం పేదలను వంచించడం కాదా? పెన్షనర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే దానికన్నా రెండు వేలు అదనంగా ఇస్తామని చెప్పి, మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి పేదల ఓట్లు అడిగే హక్కు ఉన్నదా?
తెలంగాణలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా మంచినీళ్ల కోసం బిందె పట్టుకుని రోడ్డు ఎక్కవద్దనే మహాశయంతో కేసీఆర్ మిషన్ భగీరథ పథకం తెచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు అందించారు. కానీ, కాంగ్రెస్ కేవలం మూడు నెలల్లోనే తమ నిర్వాకంతో మంచినీటి కష్టాలను మళ్లీ మొదటికి తెచ్చింది. రాష్ట్రంలో నేడు చాలాచోట్ల తీవ్రమైన మంచినీటి ఎద్దడి ఉన్నది. మళ్లీ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. వాటి వెంట జనం పరుగులు తీస్తున్నారు. బిందెలు పట్టుకుని మళ్లీ మహిళలు రోడ్లవెంట కనిపిస్తున్నారు. ఖమ్మం నగరంలో మూడు రోజులకొకసారి మంచినీటి సరఫరా జరుగుతుండటం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నది. వేసవితో వచ్చే మంచినీటి సమస్యను ఎలా అధిగమించాలనే విషయంలో ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే, నేడు పక్కనున్న బెంగళూరులో ఏర్పడ్డ వాటర్ ఎమర్జెన్సీ తెలంగాణకు రాకతప్పదు. ఇప్పటికే హైదరాబాద్లోని చాలాచోట్ల ప్రజలు టాంకర్ల ద్వారా నీరు తెప్పించుకుంటున్నారు. ఎండలు ముదిరిన కొద్దీ పరిస్థితి విషమించే ప్రమాదం ఉన్నది.
తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలను బీఆర్ఎస్ అధికారంలో ఉండగా గట్టిగా అడ్డుకున్నది. ఒక్క ప్రాజెక్టును కూడా కేఆర్ఎంబీకి అప్పగించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి అంగీకారం కుదిరింది. కానీ, బీఆర్ఎస్ పోరాటం చేయడం వల్ల ప్రాజెక్టులు అప్పగించేది లేదని అసెంబ్లీలో తీర్మానం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి అక్కరలేదు.
తెలంగాణ రాష్ర్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలో నింపిందని కాంగ్రెస్ ఆరోపించింది. చేసిన అప్పులను ఎక్కువ చూపించారు. అప్పులు చేయడమే నేరమన్నట్టు మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక కూడా శ్వేతపత్రం పేరుతో అప్పులు చేశారని ఏకరవు పెట్టారు. మరి అప్పులు వద్దన్న కాంగ్రెస్ వంద రోజుల్లోనే రూ.15 వేల కోట్ల అప్పు ఎందుకు చేసింది? విద్యుత్తు శాఖకు, హడ్కోకు అప్పులు చేసుకోవడానికి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో కొత్త అప్పులు తెస్తున్నది. బడ్జెట్ లోటు పూడ్చడానికి అప్పులు చేస్తామని ప్రకటించింది. అప్పులు తేకుండా రాష్ర్టాన్ని నడిపి చూపిస్తామన్న మాటలు ఏమయ్యాయి? అప్పుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి ఎల్ఆర్ఎస్పై వారు రంగు మార్చిన వైఖరి మరో ఉదాహరణ. నివాసస్థలాల క్రమబద్ధీకరణ సక్రమంగా జరిగి, అసలు యజమానులకు పూర్తి హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అమలుచేయాలని నిర్ణయించింది. అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ ఆ ప్రయత్నానికి వక్రభాష్యం చెప్పి, ప్రజల రక్తం పిండుతున్నారని ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే ఒక్క పైసా ఖర్చు లేకుండా క్రమబద్ధీకరిస్తామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఎల్ఆర్ఎస్ పథకాన్ని ముందుకు తెచ్చింది. ఇది ద్వంద్వ నీతి కాదా?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గొల్ల, కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. కానీ, నేటి వరకు ఒక్కరికీ ఇవ్వలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రెండుసార్లు పీఆర్సీ ఇచ్చి వారికి గౌరవప్రదమైన వేతనాలు ఇచ్చింది. కాంగ్రెస్ వస్తే అంతకన్నా గొప్పగా ప్రభుత్వ ఉద్యోగులను చూసుకుంటామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న మూడు డీఏలను ఒకేసారి క్లియర్ చేస్తామని మాటిచ్చారు. కానీ వంద రోజులైనా ఒక్క డీఏ కూడా క్లియర్ చేయలేదు. జనవరిలో మరో డీఏ చెల్లించాల్సి ఉన్నది. దీంతో మొత్తం నాలుగు డీఏలు పెండింగులో పడ్డాయి. ముఖ్యమంత్రే స్వయంగా వారిని పిలిచి మాట్లాడారు. కానీ నాలుగు డీఏలు పెండింగ్లో ఉంటే, వాటిని మాత్రం క్లియర్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని తన గొప్పగా సీఎం చెప్పుకోవడం సిగ్గుచేటు. కాంగ్రెస్ వచ్చాక 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, నియామకాల తుదిదశకు తీసుకొచ్చినవే. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల భృతి ఇస్తామని ప్రకటించారు. రాహుల్, సోనియాగాంధీ కూడా చెప్పారు. అధికారంలోకి వచ్చాక మేము అనలేదని సాక్షాత్తూ మంత్రులే నిండు అసెంబ్లీలో అబద్ధమాడి ఎగ్గొట్టారు. నిరుద్యోగులను నిలువునా దగా చేశారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న మూడు డీఏలను ఒకేసారి క్లియర్ చేస్తామని మాటిచ్చారు. కానీ వంద రోజులైనా ఒక్క డీఏ కూడా క్లియర్ చేయలేదు. జనవరిలో మరో డీఏ చెల్లించాల్సి ఉన్నది. దీంతో మొత్తం నాలుగు డీఏలు పెండింగులో పడ్డాయి. ముఖ్యమంత్రే స్వయంగా వారిని పిలిచి మాట్లాడారు. కానీ నాలుగు డీఏలు పెండింగ్లో ఉంటే, వాటిని మాత్రం క్లియర్ చేయలేదు.
రాష్ట్రంలో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు రోజుకొకరు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికి 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆటో డ్రైవర్ కుటుంబాలను పరామర్శించడానికి కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఎందుకు పోవడం లేదు? నిజామాబాద్లో స్వామి అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటూ పెట్టిన పోస్టు ఎంత హృదయ విదారకంగా ఉన్నదో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ‘నేను చనిపోతే నా భార్య దేవలక్ష్మి ఎలా బతుకుతుంది? అనుకుని ఇద్దరం కలిసి చనిపోతున్నాం’ అని ఆ డ్రైవర్ తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు. రేవంత్రెడ్డి వల్లే తనకీ పరిస్థితి అని కూడా చెప్పి, ఉరేసుకుని ఆ దంపతులు చనిపోయారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12వేల భృతి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేస్తే ఈ ఆత్మహత్యలు ఆగేవి కాదా? మీ హామీ అమలు కాకపోవడం వల్ల జరిగిన ఆత్మహత్యలను మీరు చేసిన హత్యలుగా చూడాలా? వద్దా?
ప్రతిరోజూ ప్రజావాణి ఏర్పాటు చేసి, ప్రజలను కలుస్తానని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి ప్రజల చెవిలో పువ్వులు పెట్టారు. కేవలం ఒక్కటంటే ఒక్కరోజు మాత్రమే ప్రజలను కలిశారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజే ఇక సీఎం ఇంటి ముందు ఎలాంటి ముళ్లకంచెలు, బారికేడ్లు ఉండవని ప్రకటించారు.కానీ నేడు పరిస్థితి ఏమిటి? సీఎం ఇంటి ముందు, అసెంబ్లీ ముందు ముళ్ల కంచెలు పెరిగాయి. బారికేడ్లు పెరిగాయి. పోలీసు భద్రత పెరిగింది. సామాన్యుల ఎంట్రీ బంద్ అయింది.
కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదని, వేరే పార్టీల వారిని చేర్చుకోమని చెప్పింది. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని కూడా రేవంత్రెడ్డి గతంలో పిలుపునిచ్చారు. కానీ, చెప్పింది ఒకటి చేసింది ఒకటి. గతంలో స్వచ్ఛందంగా వచ్చిన వారినే మేము పార్టీలో చేర్చుకున్నాం. ఎవరినీ బలవంతం చేయలేదు. కానీ, నేడు కాంగ్రెస్ ఇతర పార్టీల వారిని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నది. వ్యాపారాలు నడవవని, కాలేజీలు మూసేస్తామని, బిల్డింగులు కూలుస్తామని స్వయంగా ప్రభుత్వ పెద్దలే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రే స్వయంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల ఇండ్లకు వెళ్లి మరీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదని, వేరే పార్టీల వారిని చేర్చుకోమని చెప్పింది. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని కూడా రేవంత్రెడ్డి గతంలో పిలుపునిచ్చారు. కానీ, చెప్పింది ఒకటి చేసింది ఒకటి. గతంలో స్వచ్ఛందంగా వచ్చిన వారినే మేము పార్టీలో చేర్చుకున్నాం. ఎవరినీ బలవంతం చేయలేదు. కానీ, నేడు కాంగ్రెస్ ఇతర పార్టీల వారిని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నది.
కాంగ్రెస్ నాయకుల అండతో రాష్ట్రంలో పోలీసుల అరాచకం పెరిగింది. గతంలో తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, మళ్లీ పోలీసులు రెచ్చిపోతున్నారు. ప్రతి పనిలో పోలీసుల జోక్యం తప్పనిసరి అయింది. కాంగ్రెస్ నాయకులు పోలీసులను తమ సొంత అవసరాల కోసం, రాజకీయ పనుల కోసం వాడుకుంటున్నారు. శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థుల మీద తప్పుడు కేసులు పెట్టడానికి, అక్రమ నిర్బంధాలకు పనిచేస్తున్నది.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నది. నిరుద్యోగులు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తుంటే పోలీసులు చాలా దారుణంగా టెంటు పీకి, నిరుద్యోగులను వెళ్లగొట్టారు. ఇదేనా మీరు హామీ ఇచ్చిన ప్రజాస్వామ్యం? ఇదేనా మీరు చెప్పే స్వేచ్ఛ?
రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు మంగళం పలికారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే జర్నలిస్టులపై రౌడీమూకలతో దాడులు చేపిస్తున్నారు. సోషల్మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. వారి ఇండ్లపై పడి వేధిస్తున్నారు. ప్రభుత్వ భజన చేయాలే తప్ప, జర్నలిస్టులు ప్రజా సమస్యలను ప్రచురించవద్దనే నిర్భంధం రాష్ట్రంలో అమలవుతున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, ప్రొటోకాల్ మర్యాదలను మంటగలిపారు. ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం లేదు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వారే, ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇదే అనుభవం ఎదురవుతున్నది. ఇదెక్కడి సంప్రదాయమో కాంగ్రెస్ నాయకులే చెప్పాలి.
కేసీఆర్ ఎంతో గొప్పగా టీఎస్-ఐపాస్ చట్టం తెచ్చి, తెలంగాణను పెట్టుబడుల స్వర్గంగా మార్చారు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ సమయంలోనే నరకంగా మార్చింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కంపెనీ చెన్నైకి తరలిపోతున్నా గుడ్లప్పగించి చూస్తున్నారు. కేన్స్ సెమీకాన్ సం స్థను గుజరాత్కు ధారాదత్తం చేస్తున్నారు. మరిన్ని కంపెనీలు తెలంగాణ నుంచి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
రాహుల్గాంధీకి సలాం కొట్టి ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డి, నేడు ప్రధాని మోదీకి గులాం అయ్యారు. నిండు సభలో మోదీని బడేభాయ్ అని సంభోదించి, భవిష్యత్తులో మీ సహకారం కావాలని కోరారు. అంటే మళ్లీ ప్రధానిగా మోదీనే ఉంటారని రేవంత్రెడ్డి చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీకి, రాహుల్గాంధీకి రేవంత్ చేసిన ధోకా కాదా? రేవంత్రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏమి కావాలి?
కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం యంత్రాంగంలో అంతులేని గందరగోళం, పాలకుల నిర్ణయాల్లో తొందరపాటు స్పష్టంగా కనిపిస్తున్నది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలనే ఆలోచనే లేదు. మెట్రోరైలు మార్గాన్ని మారుస్తామన్నారు. తర్వాత నాలుక కరుచుకున్నారు. ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు. తర్వాత లేదన్నారు. ప్రగతిభవన్ను కూలుస్తామని ఒకసారి చెప్పారు. దాన్ని నాలెడ్జిహబ్ చేస్తామని మరోసారి చెప్పారు. చివరికి దాన్ని ఉప ముఖ్యమంత్రి నివాసం చేశారు. 33 జిల్లాలను కుదిస్తాం, అన్ని జిల్లాలు అవసరం లేదన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తనను నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరినీ దగా చేసింది. తాము మోసపోయామనే భావనతో ఇవాళ తెలంగాణ ప్రజలు మథనపడుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయమంటే, ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. మూడు కేసులు, ఆరు విచారణలు అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. శ్వేతపత్రాల పేరుతో కాలక్షేపం చేయడం తప్ప విధానపత్రాలు రెడీ చేసి ప్రజల బతుకుల్లో మార్పు తెద్దామన్న ఆలోచన లేదు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీల విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రమే కాదు, ఏఐసీసీ నాయకులు కూడా బాధ్యులే. టీపీసీసీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు తమది బాధ్యత అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నాయకులు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పారు. ట్వీట్లు చేశారు. కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్లు రాసిచ్చారు. కానీ అవిప్పుడు అమలు కాలేదు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత అని చెప్పి చట్టుబండలు చేశారు. ప్రజలకిచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదు.
crop loan waiver