తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిత్రులకు శుభాకాంక్షలు. సరిగ్గా 22 ఏండ్ల కిందట తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేని సమయంలో, తెలంగాణ గళమెత్తిన అనేకమంది ఉద్యమకారులను సీమాంధ్ర ప్రభుత్వం పోలీసులతో అణచిచేస్తున్న సమయంలో మా వేదిక ‘తెలంగాణ జర్నలిస్ట్ల ఫోరం’ అయింది. అప్పటికే కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ కూడా మొదలై ఉండటం మాకు కొంత బలాన్నిచ్చింది.
‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్’లు అనే సింగిల్ స్లోగన్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటి వరకు అందరితో కలిసి ఉన్నది, ఇంకా చెప్పాలంటే అందరికంటే ముందున్నది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ లాన్స్లో ఎన్నో చర్చల తర్వాత ఇలా మొదలైతే మన ఉద్యోగాలు ఊడతాయని తెలిసి కూడా 2001 మే 31న ఐదారుగురం నిర్ణయం తీసుకొని మొదలుపెట్టాం. అలాంటి పరిస్థితి నుంచి జర్నలిస్ట్ ఫోరం ఒక్క మెసేజ్ పెడితే చాలు గంటలో వంద మంది జర్నలిస్టులు జమయ్యే పరిస్థితి దాకా తీసుకొచ్చాం. చాలా విషయాలు బయటకు చెప్పలేం. కానీ, జర్నలిస్ట్ ఫోరమ్ ప్రతినిధులుగా మేము చేయని పనిలేదు. ఒకవైపు ఉద్యోగం ఇంకోవైపు ఉద్యమం. ఆఫీసులో మీటింగ్ అయిపోంగనే ఏదో ప్లేస్లో అల్లం సార్, నేను, రవి, రమణన్న, పీవీలతో పాటు యంగ్ తెలంగాణ జర్నలిస్ట్ బ్యాచ్తో మా మీటింగ్. ఇలా ఈ రోజు ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఫలానా నాయకుడు ఎందుకు జై తెలంగాణ అంటలేడు, అనిపిద్దాం చలో అంటూ సదరు వ్యక్తి దగ్గర వాలడం ఆయనతో ‘జై తెలంగాణ’ అనిపించడం ఆయనతోనే ఒక మీటింగ్ పెట్టించి వాళ్ల పార్టీ మీద ఒత్తిడి తెప్పించడం. ఇంకో పెద్దమనిషి దగ్గరికి వెళ్లి ఆయనతో ముచ్చట్లు ఇలా ఒక కాలెండర్ వేసుకున్నట్టు పనిచేసిన దినాలు తీపిగుర్తులు. నేను ముందే చెప్పినట్టు జర్నలిస్టుల ప్రయోజనాల కోసం కాకుండా ‘తెలంగాణ కోసమే జర్నలిస్టు’లు అనే ట్యాగ్తోనే పనిచేశాం. సాకారమైన తెలంగాణలో తెలంగాణ ప్రజల మౌలిక జీవన విధానాల్లో మార్పు వచ్చింది అనేది సత్యం. ఎమ్మెల్యే అయినందున ఇట్లా చెప్తున్నాడని విమర్శించే వాళ్లున్నా నేను ఇదే చెప్తా.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తదుపరి కార్యాచరణ గురించి అన్ని జిల్లాల నుంచి హాజరైన ముఖ్యులతో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా విస్తృతమైన చర్చ జరిగింది. ప్రత్యేక రాష్ట్రం సాధించాం.. కనుక భవిష్యత్తులో తెలంగాణలో అద్భుతమైన పాలన జరగాలి. ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసినా అన్ కండిషనల్గా రెండు లేదా మూడు పర్యాయాలు మనం సపోర్ట్గా ఉండాలని నిర్ణయించి, ‘జర్నలిస్టు ఫోరం లక్ష్యం నెరవేరింది-ఇక మనం జర్నలిస్టుల ప్రయోజనాల కోసం పాటుపడుదాం’ అని తీర్మానం చేసి టీయూడబ్ల్యూజేగా మార్చేద్దామని నిర్ణయించాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో భారీ సభ పెట్టి కేసీఆర్, జానారెడ్డి, గద్దర్, కోదండరాంలను, నాటి ఎంపీలందరినీ, సీపీఐ, సీపీఎం, బీజేపీతో సహా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని పిలిచాం. అయితే దీనికి ముఖ్య అతిథిగా పిలవడానికి నేను, అల్లం సార్, పీవీ శ్రీనివాస్, రవితో పాటు ఇంకొందరం వెళ్ళాం. విషయం చెప్పిన తర్వాత కేసీఆర్ ఒకే మాట చెప్పారు.. ‘మీరు జర్నలిస్ట్ ఫోరాన్ని అలాగే ఉంచండి, రేపు భవిష్యత్తులో అనేక శక్తులు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో జర్నలిస్ట్ ఫోరం పాత్ర కీలకంగా ఉండబోతుంద’ని సలహా ఇచ్చారు. అయితే అప్పటికే ఒక నిర్ణయం అయిపోయింది ‘ఫోరం ఉంటుంది, యూనియన్ కూడా ఉంటుంది’ అని చెప్పి సార్ను ఆహ్వానించి వచ్చేశాం. ఇప్పుడు నేను, అల్లం సార్ బయట ఉన్నప్పటికీ జర్నలిస్ట్ ఫోరం ఎప్పటికీ సజీవంగా ఉంటది. దానికొక పునాది ఉన్నది. కొందరం బయటకొచ్చినా అవసరం వచ్చినప్పుడు దాని పాత్ర అది పోషిస్తుంది. తెలంగాణ జర్నలిస్టులకు దీర్ఘకాలిక కార్యాచరణ ఉంటుందని ఫోరమ్ నిరూపించింది.. ‘జై తెలంగాణ’…
చంటి క్రాంతి కిరణ్
(వ్యాసకర్త: టీజేఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి)