‘కొత్తది తేను చేతగాదు.. ఉన్నది ఊడబెరికిండు’ అన్నట్లుగా ఉంది కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యవహారం. దేశంలో కోట్లాదిమంది నిరుపేద కూలీలకు అంతోఇంతో ఆసరా కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తున్నది కేంద్రప్రభుత్వం. ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి కేటాయింపులను 25 శాతం తగ్గించటమే ఇందుకు నిదర్శనం. ఉపాధి హామీ కింద ఇవ్వాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయటం లేదని, రాష్ర్టాలను సమన్వయం చేసుకొని వెళ్లటం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవలే తీవ్రంగా ఆక్షేపించింది. ఈ పరిస్థితి చూస్తుంటే మొత్తం పథకానికే ఎసరు పెట్టే ఆలోచనలో మోదీ సర్కార్ ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకునే శ్రామికులు, కార్మికులు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి, ఉన్న ఊర్లోనైనా బతుకుదామన్న ఆశతో అక్కడికి తరలివెళ్లారు. ‘ఉపాధి హామీ’ పథకం ఆసరా ఉంటే కనీసం పూట గడుస్తుందని భావించారు. కానీ, వారి ఆశలు అడియాసలే అయ్యాయి. సంక్లిష్ట సమయంలో కేంద్రప్రభుత్వం వారిని ఆదుకోవటానికి ముందుకురాకపోగా, కొన్నేండ్లుగా అమలవుతున్న ‘ఉపాధి హామీ’కి తూట్లు పొడుస్తున్నది. ఇదేదో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం, దీన్ని కొనసాగిస్తే ఖ్యాతి వారి ఖాతాలోకే వెళ్తుంది అన్న రీతిలో వ్యవహరిస్తున్నది. అలాగని, ‘ఉపాధి హామీ’కి దీటైన ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చే యోచన కూడా మోదీ సర్కార్కు ఉన్నట్టు లేదు. అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ప్రభుత్వాలు మారగానే పథకాలను పక్కనబెడితే.. ఇక దేశ ప్రజల సంక్షేమం సంక్షోభంగా మారుతుంది. ఇటువంటి సంకుచిత రాజకీయాల్ని కేంద్రం మానుకోవాలి.
‘ఉపాధి హామీ’ ఆశయం మంచిదేగానీ, ఆచరణలో దాని చుట్టూ పలు సమస్యలు ముసురుకున్నాయి. ముఖ్యంగా, ఈ పథకం వల్ల గ్రామాల్లో కూలీలకు కొరత ఏర్పడుతున్నదన్న వాదన ఉంది. ఇది కేంద్రం తీవ్రంగా దృష్టి పెట్టి పరిష్కరించాల్సిన సమస్య. ఉపాధి పనులు తూతూమంత్రంగా తయారయ్యాయని, ఊరికి ఉపయోగపడటం లేదన్న విమర్శలున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రత్యక్ష అవగాహన ఉన్న రాష్ర్టాలతో సమన్వయం చేసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం, నిధుల మంజూరులో జాప్యం, నిధుల్లో కోతలు వంటి సమస్యలు నెలకొన్నాయి. వీటిని చిత్తశుద్ధితో పరిశీలించి, పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. ఆ బాధ్యతను విస్మరించి, ఏకంగా పథకాన్నే ఎత్తేసే దిశలో కేంద్రం అడుగులు వేయటం గర్హనీయం. దేశాన్ని నిర్మించే శ్రామికుల విషయంలో మోదీ సర్కార్ విశాల హృదయంతో ఆలోచించాలిగానీ.. సంకుచిత కోణంలో కాదు.