కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ పడుతున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇక ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలని చాన్స్లర్ హోదాలో ఇటీవల ఆదేశించిన గవర్నర్ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఆర్థికమంత్రి మీదే గురి పెట్టారు. ఓ ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా లేవని, ఈ మేరకు సదరు మంత్రి తన విశ్వాసం కోల్పోయారు కాబట్టి ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించాలని సీఎం పినరయి విజయన్కు లేఖ రాశారు. గవర్నర్ విశ్వాసంతో పని లేదంటూ విజయన్ ఘాటుగానే స్పందించారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండేండ్లు కూడా కాలేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు నెరవేర్చాల్సి ఉంది. వాటన్నింటినీ పక్కనపెట్టి కొరకరాని కొయ్యగా మారిన గవర్నర్తో తేల్చుకోవటంపైనే యావత్ ప్రభుత్వం దృష్టి పెట్టే పరిస్థితి వచ్చింది.
ఇది కేరళకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ గవర్నర్ల వైఖరి ఇలాగే ఉన్నది. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారుతో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) జగడాలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా చాత్పూజ ఉత్సవాలకు అనుమతిస్తూ.. ఆ ఉత్సవాల సందర్భంగా తప్పుదారి పట్టించే ప్రచారానికి పూనుకోవద్దని కేజ్రీవాల్కు ఎల్జీ చేసిన ‘సూచన’ వివాదాస్పదమైంది. మరోవైపు జార్ఖండ్లో సీఎం హేమంత్ సోరెన్ మెడపై వేలాడుతున్న అనర్హత అంశాన్ని రెండు నెలలుగా నాన్చుతున్న గవర్నర్.. రాష్ట్రంలో ఏ క్షణమైనా ఆటంబాంబు పేలవచ్చని వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో గవర్నర్ల వ్యవహారశైలికి ఇవన్నీ మచ్చుతునకలు. కేంద్రం వారిని నియంత్రించకపోగా మరింత ప్రోత్సహించే ధోరణి కనిపిస్తున్నది. బెంగాల్లో మమతతో ఏండ్లపాటు కొట్లాడిన గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు ఉపరాష్ట్రపతి పదవి లభించటమే దీనికి మంచి ఉదాహరణ.
ఓ వైపు మతచిచ్చు, మరోవైపు ఆర్థిక సంక్షోభం, ఇంకోవైపు సకల వ్యవస్థల దుర్వినియోగం, రాష్ర్టాలపై పెత్తనం, ప్రభుత్వాల కూల్చివేతలు. భారతదేశాన్ని రావణకాష్టంలా మార్చదల్చుకున్నదా కేంద్రం? స్వతంత్ర భారత చరిత్రలో చీకటి అధ్యాయంగా అభివర్ణించే ఎమర్జెన్సీ సమయంలో కూడా పరిస్థితులు ఇంత పతనం కాలేదు. రాష్ర్టాలకు ఆదర్శంగా ఉంటూ, వాటిని సమన్వయపర్చుకొని దేశాన్ని ప్రగతి పథంలో నిలుపాల్సిన కేంద్రం.. వీధి కొట్లాటలకు దిగటం ద్వారా ఏ రకమైన నమూనాను ఆవిష్కరిస్తున్నది? రాష్ర్టాలు కూడా తెగిస్తే సమాఖ్య వ్యవస్థ బీటలు వారి, దేశ సమగ్రతకే భంగం వాటిల్లదా? బీజేపీ పాలకుల హ్రస్వదృష్టి రాజకీయాలు దేశానికే ఎనలేని చేటు చేస్తున్నాయి. దీనిని సకల వర్గాలూ ముక్తకంఠంతో ఖండించాలి. దేశాన్ని రక్షించుకోవాలి.