సమన్వయంతో వ్యవహరించాల్సిన పరిస్థితులు రాజకీయ రంగు పులుముకొంటే అవి మారిపోతుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేయడానికి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటుచేసుకున్న గవర్నర్ వ్యవస్థ రాజకీయాల్లో కూరుకుపోయి అప్రతిష్ఠలపాలవుతున్నది. తాజాగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర క్యాబినెట్ ఉద్యమకారులు దాసోజు శ్రవణ్కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించాలని సిఫారసు చేస్తే, తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరదీసింది.
గవర్నర్ తమిళిసై వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఒక రకంగా, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మరోరకంగా వ్యవహరిస్తూ తమకున్న అధికారాలతో రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. దేశంలో ఎక్కడా పార్టీల నాయకులు ఎమ్మెల్సీలుగా, రాజ్యసభసభ్యులుగా కానట్టు, గోరంతను కొండంతలుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రపతి కోటాలో బీజేపీ నేతలు మహేష్ జెఠ్మలానీ, సోనాల్ మాన్సింగ్, రాంషఖల్, రాకేశ్ సిన్హా తదితరులు రాజ్యసభ సభ్యులయ్యారు. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జితిన్ ప్రసాద్, గోపాల్ అర్జున్ బూర్జీ, చౌదరీ వీరేంద్రసింగ్, హన్సరాజ్, విశ్వకర్మలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించింది. వీరందరికీ లేని తిరస్కారం తెలంగాణలో ఎందుకు జరుగుతున్నది? కేంద్ర అధికార దుర్వినియోగం గవర్నర్ ద్వారా కొనసాగుతుందనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కేంద్రం తమ అధికార కేంద్రాలుగా గవర్నర్లను వాడుకుంటున్న నేపథ్యంలో గవర్నర్లు, రాష్ర్టాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి.
ఇతర రాష్ర్టాలకు చెందిన, రాజకీయాలకు సంబంధం లేని ప్రముఖ వ్యక్తి గవర్నర్ అయి ఉండాలని సర్కారియా కమిషన్ సిఫారసు చేసింది. రాజకీయాల్లో సంబంధం ఉన్న వ్యక్తికి గవర్నర్ పదవి అప్పజెప్తే రాజకీయాలు చేసే అవకాశం ఉందని వ్యతిరేకించింది. ఆ కమిటీ సిఫారసులను ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసైని గవర్నర్గా నియమించడంతో రాజకీయాలకు కేంద్ర బిందువవుతున్నారు. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలను తనకున్న విచక్షణాధికారాలను వినియోగించుకుంటూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో గవర్నర్ల చర్యలు వివాదస్పదంగా మారాయి. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్ యూనివర్సిటీల వైస్చాన్స్లర్లను మూకుమ్మడిగా తొలగించడం ముఖ్యమంత్రి పినరయి విజయన్కు కోపం తెప్పించింది. గతంలో పచ్చిమబెంగాల్లో మమత సర్కార్కు, అప్పటి గవర్నర్ జగదీప్ ధన్కర్కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగింది. తమిళనాడు విద్యార్థులకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆ రాష్ట్ర శాసన సభ పాస్ చేసిన బిల్లును రాష్ట్రపతికి పంపకుండా గవర్నర్ ఆపి తిరిగి శాసనసభకు పంపారు. తెలంగాణ గవర్నర్ విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వివాదస్పదంగా మారింది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ భగత్సింగ్ కోశ్యారి మంత్రివర్గ సిఫారసు అంశాలను ఆమోదించకుండా విచక్షణాధికారం పేరిట కాలయాపన చేశారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుసంధానకర్తగా ఉండాల్సిన గవర్నర్ పదవి నేడు కేంద్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వాలు పొరపాటు చేస్తే సరిచేయాల్సిన గవర్నర్లు, రాజకీయాలు చేస్తుండటంతో గవర్నర్ వ్యవస్థ విమర్శలకు తావిచ్చేదిగా తయారైంది. కేంద్రానికి అనుసంధానంగా ఉంటూ, రాష్ర్టాల పరిపాలనలో జోక్యమే ఆ వ్యవస్థకు అప్రతిష్టను తెచ్చిపెడుతున్నది. సర్కారియా కమిషన్ సూచనలు అమలుచేస్తే వ్యవస్థలో ఉన్న లోపాలకు పరిష్కారం లభిస్తుంది.
– జీడిపల్లి రాంరెడ్డి 96666 80051