యుద్ధం, పర్యావరణ విధ్వంసం ఎప్పుడూ అనర్థదాయకమే. భూ తాపం, వాతావరణ మార్పులు, తగ్గుతున్న భూసారం, అడవుల నరికివేత, ఆర్థిక అసమానతలు, తగ్గుతున్న సాగు విస్తీర్ణం, పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రపంచాన్ని ఆహార సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాతికేళ్లలో ప్రపంచం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ ఆహార సంక్షోభ తాజా నివేదిక ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 19.30 కోట్ల మంది ఆహార సంక్షోభాన్ని లేదా ఆహార అభద్రతను ఎదుర్కొన్నారు. 2020లో 15 కోట్ల మంది ఆకలితో అల్లాడారు. ఆహార సంక్షోభం అధికమైతే మహిళలు, బాలికలు, చిన్నారుల్లో పోషకాహార లోపం ఎక్కువవుతుంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికీ కరోనా దెబ్బకు పూర్తిగా కోలుకోలేదు. ఇదే సమయంలో పులి మీద పుట్రలా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. యుద్ధం ప్రభావంతో ఇంధన ధరలు పెరిగాయి. నైట్రోజన్, పొటాషియం ఎరువుల తయారీలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న రష్యా నుంచి సరఫరా మందగించడం ప్రపంచమంతటా పంటల ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఫలితంగా సాగు ఖర్చులు పెరిగిపోయాయి. మక్కజొన్న, గోధుమ, జొన్న లాంటి తృణధాన్యాలు 30 శాతం రష్యా, ఉక్రెయిన్లోనే పండుతున్నాయి. యుద్ధం వల్ల వాటి సరఫరా మందగించింది. దీనివల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో జాగ్రత్త పడిన 55 దేశాలు తమ అవసరాల కోసం ఆహార పదార్థాల ఎగుమతులపై ఈ ఏడాది మార్చి నుంచి నియంత్రణలు విధించాయి.
ఇటీవల డాన్యూబ్ మొదలుకొని లియోర్ వరకు యూరప్లోని ప్రధాన నదులన్నీ ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సముద్ర నీటి మట్టాలు పెరగడం, వేడి గాలుల ప్రభావం, తక్కువ వర్షపాతం, భూసారం తగ్గడం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. గత ఐదు శతాబ్దాల కాలంలో యూరప్ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనలేదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాభావం కారణంగా భారత్లో వరి సాగు విస్తీర్ణం 13 శాతం తగ్గింది. దీనివల్ల ఉత్పత్తి తగ్గి బియ్యం ధరలు పెరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారైన భారత్లో వరి సాగు తగ్గడంతో ప్రపంచ దేశాలపైనా ప్రభావం చూపించింది. ఈ పరిస్థితుల కారణంగా 2030 నాటికి మక్కజొన్న ధరలు 80 శాతం, బియ్యం ధరలు 30 శాతం పెరుగుతాయని అంతర్జాతీయ నిపుణుల అంచనా వేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సెకట్రరీ జనరల్ గుటెరస్ అంచనా ప్రకారం ఈ ఏడాది ఆహారోత్పత్తిలో ఏర్పడే సమస్యలు వచ్చే ఏడాది ప్రపంచ ఆహార కొరతకు దారి తీయవచ్చు. 2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు చేరుతుందని అంచనా. ఇంతమందికి ఆహారం అందించాలంటే 2017తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పంట పండించాలి. అది దాదాపు అసాధ్యమన్నది వ్యవసాయ శాస్త్రవేత్తల అభిప్రాయం. కానీ ప్రపంచ దేశాలన్నీ ఈ సమస్యను అధిగమించేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలి.
పరిష్కారం ఇలా : పేద దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టుకొనేందుకు ధనిక దేశా లు సాయం చేయాలి. ఐక్యరాజ్యసమితి 20 30 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రకటన మనకు పరిష్కారాలను సూచిస్తున్నది. వీటిప్రకారం అన్నిదేశాల ప్రజలు కలిసికట్టుగా ఎక్కువ వనరులను ఉపయోగించుకొని పంట దిగుబడులను పెంచాలి. ఆయా దేశాలు తమ విధానాలను, బడ్జెట్లను, సంస్థలను ఆహార సంక్షోభా న్ని రూపుమాపడానికి వినియోగించాలి. యువత, మీడియా, ప్రైవేటుసంస్థలు నిర్విరామంగా ఆహార సంక్షోభ నివారణకు కృషిచేయాలి. పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకా రం ప్రపంచ దేశాలన్నీ గ్రీన్హౌజ్ ఉద్గారాలు తగ్గించడం ద్వారా భూ ఉపరితల ఉష్ణోగ్రతలను తగ్గించాలి. పర్యావరణ అనుకూలమైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఎక్కువగా అమలుచేయాలి. వర్షపు నీటి నిల్వ సామర్థ్యాలను పెంచాలి. సంప్రదాయేతర విద్యుత్ వినియోగాన్ని పెంచాలి. ప్రజా రవాణాను ప్రోత్సహించాలి. ప్రజలు ఆహారపుటలవాట్లను మార్చుకొని వృథాను అరికట్టాలి. అడవుల నరికివేతను నిలిపివేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. ప్రభుత్వాలు ఆర్థిక అసమానతలు తగ్గించి, ధరలను అదుపుచేయాలి. వ్యవసాయానికి, సాగునీటి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించాలి. గ్రామాలను స్వయం సమృద్ధంగా మార్చి నగరాలు, పట్టణాలపై భారం తగ్గించాలి. కుటుంబ నియంత్రణ పథకాలను సమర్థంగా అమలుచేయాలి.
– అంచల భాస్కర్
7799171410