నా చిన్నతనంలో దగ్గు, సర్ది, జ్వరంతో పాటు ఇతర రోగాలు వచ్చినప్పుడు ఇంట్లోనే ప్రకృతి వైద్యం చేసేవారు. ముఖ్యంగా సొంటి, మిరియాలు, ఎల్లిపాయ కారం (మిరం), నేల గంధం మొదలైనవాటితో చికిత్స అందించేవారు. ఇది సర్వరోగ నివారిణి. ఈ సుగంధ ద్రవ్యాలతోనే అనేక రోగాలు మాయమయ్యేవి. అప్పటి ఆహారపుటలవాట్లు, పండిన పంటలు ప్రకృతితో ముడిపడి ఉండేవి.
ప్రస్తుతం పంటలు పండించడంలో అనేక మార్పులు సంభవించాయి. ఈ కల్తీ ఆహార ధాన్యాలతో మనిషి నిత్యం ఏదో ఒక రోగంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ రోగాలను నయం చేసే ఇంగ్లీష్ మందులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ మందులు అత్యంత ఖరీదైనవి కావడంతో సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. ఈ మందులు వాడటం వల్ల ఇతర రోగాలు కూడా వస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండ్ల పేర్లతో అనేకరకాల మందులను మార్కెట్లోకి విడుదల చేసి సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డాక్టర్లు కూడా ఇవే మందులను చీటీలపై రాసి ఈ మందులను వాడకపోతే రోగం నయంకాదనే స్థితికి మనుషులను తీసుకువచ్చారు. డాక్టర్లు ఈ మందుల కంపెనీలతో కుమ్మక్కై పేదలను నిలువు దోపిడి చేస్తున్నారు.
విదేశాల బ్రాండెడ్ కంపెనీల నుంచి కాపీ చేసి ఇక్కడ బ్రాండ్ పేరెన్నిక గన్న కంపెనీల పేరుతో మన దేశ మార్కెట్లోకి ఔషధాలను విడుదల చేస్తున్నారు. బ్రాండె డ్ కంపెనీలు తయారుచేసే మందులపై వారికి పేటెంటు హక్కు పదిహేడేండ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఈ మందులు జనరిక్గా మార్కెట్లో విడుదలవుతాయి. ప్రస్తుతం మన దేశంలో ఈ తరహా వ్యవహారం ఔషధాల అమ్మకాల్లో జరుగుతున్నది. అమెరికాలో దాదాపు 60 శాతం జనరిక్ మందులు వినియోగిస్తారు. స్పెయిన్లో తప్పనిసరిగా జనరిక్ ఉపయోగించాలని చట్టం కూడా చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశంలో డ్రగ్ మాఫియా ఏలుబడి రాజ్యం సాగిస్తున్నది. డాక్టర్లకు బహుమతుల ఆశ చూపి తప్పనిసరిగా తమ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న మందులను రోగులకు రాయాలని శాసిస్తున్నారు. డాక్టర్లకు విందులు, వినోదాలు, రకరకాల బహుమతులు, విదేశాలకు విహార యాత్రలు ఏర్పాటుచేసి ఈ డ్రగ్ మాఫియా ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నది.
దేశంలో దాదాపు 20 ఏండ్ల కిందటే జెనరిక్ మందులు వాడుకలోకి వచ్చాయి. తగినంత ప్రచారం లేక ప్రజలు వీటివైపు మొగ్గుచూపడం లేదు. వీటిలో దాదాపు 200 రకాల మందులు 20 నుంచి 80 శాతం తక్కువ ధరకే లభిస్తున్నాయి. బీపీ, షుగర్, దగ్గు, జ్వరం లాంటి వాటికి జెనరిక్ మందులు లభ్యమవుతున్నాయి.
జనరిక్ మందుల వైపు ప్రజలను మళ్లించేందుకు ప్రభుత్వాలు అవగాహనా సదస్సులను ఏర్పాటుచేయాలె. ప్రచార, ప్రసార సాధనాల ద్వారా జెనరిక్ మందుల ఔన్నత్యాన్ని తెలియజేయాలి. రైల్వేస్టేషన్, బస్టాండ్, పాఠశాల, దవాఖానలు, రోడ్లపై ఉండే ముఖ్య కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలలో కూడా జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మొత్తంగా ప్రజలు జనరిక్ మందులనే వాడేటట్లు చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలదే. తద్వారా ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం చేయవచ్చు. ప్రజల ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకున్నవారమవుతాం.
–దండంరాజు రాంచందర్రావు
(వ్యాసకర్త: విశ్రాంత డిప్యూటీ సూపరింటెండెంట్ సింగరేణి భవన్, హైదరాబాద్)