సుప్రసిద్ధ వైద్యులు, ప్రజానాయకుడు మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్రావు పేదల కోసం పరితపించిన మహోన్నతమైన వ్యక్తి. పేదల డాక్టర్గా పేరుగాంచిన ఆయన ఎందరినో ఆదుకున్నారు. సుధాకర్రావు ఎంతటి ఉన్నత విద్యావంతుడో రాజకీయాల్లో అంతటి నిరాడంబరుడు. వైద్య రంగంలో గొప్ప మేధావి. పరిపాలనలో గొప్ప రాజనీతిజ్ఞుడు.
మాజీ మంత్రి దివంగత నేత ఎన్.యతిరాజారావు-విమలాదేవిల మొదటి సంతానమే సుధాకర్రావు. 1950 ఏప్రిల్ 3న నాటి కొడకండ్ల మండలంలోని వడ్డేకొత్తపల్లిలో ఆయన జన్మించారు. 1975లో హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందిన ఆయన.. 1984లో పోస్టు గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్లో ఎండోక్రైనాలజిస్ట్ పూర్తి చేశారు. తెలంగాణ పట్ల అమితమైన ప్రేమ ఉన్న సుధాకర్రావు వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడే 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. అనంతరకాలంలో గాంధీ దవాఖానలో హెచ్వోడీగా, సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తించి పేదలకు సేవలు అందించారు. తండ్రి యతిరాజారావు రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న సుధాకర్రావు 1999లో టీడీపీలో చేరి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాటి చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిలో సుధాకర్రావు పాత్ర మరువలేనిది. ఓవైపు ప్రజాప్రతినిధిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూనే.. మరోవైపు వైద్యుడిగా సేవలందించిన సవ్యసాచి డాక్టర్ సుధాకర్రావు.
33 ఏండ్లుగా పలు ఆసుపత్రుల్లో వైద్య సేవలను అందించిన సుధాకర్రావు జాతీయ, అంతర్జాతీయ వైద్య బృందాలు, కమిటీల్లో సభ్యుడిగానూ కొనసాగారు. డయాబెటిక్ అంశంపై 8 పరిశోధనా పత్రాలను అందించి ఎందరికో మార్గనిర్దేశం చేసిన మహనీయుడాయన. ఆయన అందించిన సేవలకుగానూ అనేక పురస్కారాలు అందుకున్నారు. 2014లో ఎండోక్రైనాలజీలో లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు, 2016లో డయాబెటిక్ విభాగంలో లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డులూ పొందడం విశేషం.
2004 ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజా సేవకే అంకితమయ్యారే తప్ప వెనుకడుగు వేయలేదు. తెలంగాణ సాధనలో తనవంతు పాత్ర పోషించాలనే ధ్యేయంతో కేసీఆర్ నాయకత్వంలో అప్పటి టీఆర్ఎస్లో చేరి మలిదశ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీఆర్ఎస్ తరఫున పోటీ చేసినా ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ చివరి శ్వాస వరకు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్లోనే కొనసాగారు. డాక్టర్ సుధాకర్రావు మరణంతో తెలంగాణ గొప్ప వైద్యున్ని, మేధావిని కోల్పోయింది. పేదల డాక్టర్ సాబ్గా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు.