ఆయన మాట ఓ ధీమా. ఆయన పలుకు ఓ భరోసా. ఆయనుంటే గుండె నిబ్బరం. ఆయనే ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ కోసం నాడు ప్రజలే కాదు, తెలంగాణ ఉద్యమమే ఎదురుచూసింది. నాడైనా, నేడైనా కేసీఆరే ప్రజలతో పాటు తెలంగాణకు ధైర్యం. నాడు ఉమ్మడి పీడను వదిలించిన ఆ ధైర్యమే.. నేడు స్వరాష్ట్రంలో మన ప్రాంతానికి పట్టిన పీడను వదిలించేందుకు మరోసారి ఉద్యమ జెండా ఎత్తుకోవాలని తెలంగాణ ఆకాంక్షిస్తున్నది.
KCR | పోరాటంలో వెన్ను చూపని, వెనుకడుగంటే ఏమిటో తెలియని నేత వెంట నడవాలని.. ఆరు గ్యారెంటీల మాయలో పడి మోసపోయిన ప్రజానీకం పరితపిస్తున్నది. తూటాల్లాంటి మాటలను మరోసారి ఎక్కుపెట్టాలని కోరుతున్నది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాప్రయోజనాలే పరమావధిగా పనిచేసే కేసీఆర్ మరోసారి ప్రశ్నల సునామీగా మారి కాంగ్రెస్ను ముంచెత్తాలని అభిలషిస్తున్నది.
కేసీఆర్ అంటేనే ప్రశ్నల దండు. ఆయన ధాటిని తట్టుకోవడం ఎంత కష్టమో కాంగ్రెస్కు తెలిసినంతగా మరెవరికి తెలుసు. అందుకే నేడు కేసీఆర్ ప్రశ్నిస్తుంటే.. కాంగ్రెస్ నేతలు జడుసుకుంటున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక సతమతమవుతున్న పాలకులు.. ‘మేము ధైర్యంగా ఉన్నాం’ అని పైకి చెప్పుకొనేందుకే కేసీఆర్పై తిట్ల దండకం అందుకుంటున్నారు.
కేసీఆర్కు సమస్యలపై ప్రశ్నించడం తెలుసు.. పరిష్కార మార్గాలు తెలుసు. కేసీఆర్ రాజకీయ శక్తి మాత్రమే కాదు, సమాజాన్ని అధ్యయనం చేసిన ఒక మహోన్నత వ్యక్తి. ప్రజల ఆవేదనలు తెలిసిన నాయకుడు, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత కలిగిన జననేత. ఆయన ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు. కేసీఆర్ కంటే ముందు చాలామంది తెలంగాణ ఉద్యమాన్ని నడిపినా చివరికి పదవులకో, ప్రలోభాలకో లొంగిపోయారు. కానీ, కేసీఆర్ మాత్రం రాజీనామాలనే ప్రధానాస్త్రంగా చేసుకొని, ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి స్వరాష్ర్టాన్ని సాధించారు.
కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. అధికారం కోసమే ఆ పార్టీల ఆరాటం. కేసీఆర్ను ఎదుర్కొనే శక్తి లేకనే, తెలంగాణలో బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ.. ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. ఉద్యమ కాలం నుంచి ఎన్నో కష్టాలను అలవోకగా ఎదుర్కొన్న ఆయనకు ఈ పరిస్థితి కొత్త కాదు. ప్రజాగొంతుక కేసీఆర్ను ఆపటం ఎవరి తరం కాదు.
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే బీజేపీ సర్కార్కు సామాన్యుల బాధలు పట్టవు. ‘పేదల కడుపు కొట్టి పెద్దలకు పెట్టే’ ఆ పార్టీ విధానాన్ని కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. బీసీ కులగణన చేపట్టకపోవడం, ఎస్సీ వర్గీకరణపై దాటవేత, రైతు వ్యతిరేక చట్టాలు తదితర అనేక ఉదాహరణలు మన కండ్ల ముందే ఉన్నాయి.
తెలంగాణతో పాటు దేశాభివృద్ధిపై కేసీఆర్కు ఉన్నంత అవగాహన మరెవరికీ లేదు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంతో పాటు అనేక జాతీయ సమస్యలపై ఆయన ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం జరిగిన ఉద్యమంలో కూడా కేసీఆర్ చురుగ్గా పాల్గొన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలను మాతృభాషల్లో నిర్వహించాలని విద్యార్థుల తరపున కేసీఆర్ గొంతెత్తడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. తెలుగు భాషను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కించపరిచినప్పుడు మొదటగా స్పందించింది కూడా కేసీఆరే.
పదేండ్లుగా సుభిక్షంగా ఉన్న మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరువు ఎందుకొచ్చింది? ఇది పాలకులు ఉద్దేశపూర్వకంగా తెచ్చిన కరువు కాదా? కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ నాలుగు నెలల్లో 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ‘కేసీఆర్ సారూ! నువ్వు రావాలి.. మా ఆకలి తీరాలంటే నువ్వే గెలవాలి’ అంటూ నల్గొండ జిల్లాలోని ముషంపల్లికి చెందిన రైతు మల్లయ్య ఆవేదనతో మాట్లాడిన తీరు అందరినీ కలచివేసింది. తెలంగాణ పల్లెలన్నీ ఇప్పుడు కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్నాయి. అందుకే రైతులకు భరోసా ఇవ్వడానికి రైతు బాంధవుడు కేసీఆర్ కదిలారు. పొలంబాట పట్టారు. కర్షకుల కన్నీళ్లను తుడుస్తున్నారు. పొలంబాట పట్టిన కేసీఆర్ కు హారతులు ఇచ్చి మరీ అన్నదాతలు స్వాగతిస్తున్నారు. ఓ వైపు పంటలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు కేసీఆర్ అండగా నిలుస్తుంటే.. మరోవైపు ‘రైతుబంధు రాలేదని చెప్పే రైతులను చెప్పుతో కొట్టండి’ అని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న కంట కన్నీరు ఇటు సమాజానికి, అటు తెలంగాణకు మంచిది కాదు.
ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్లో తెలంగాణ గొంతును వినిపించేందుకు బలమైన నాయకత్వం అవసరం. బీఆర్ఎస్ను మించిన తెలంగాణ గొంతుక ఇంకొకటి లేదన్నది అందరికీ తెలిసిందే. తెలంగాణపై జరిగే కుట్రలు, రాజకీయ కుతంత్రాలను సమర్థంగా తిప్పికొట్టే బలమైన పార్టీ బీఆర్ఎస్సే. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ప్రజాగొంతు మూగబోయినట్టు అయింది. కనీసం పార్లమెంట్లోనైనా మన గొంతు వినిపించాలంటే బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలవడం తప్పనిసరి.
కేసీఆర్ తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ తెలంగాణ, దేశ భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు దేశానికి బలమైన నేత అవసరం. అందుకే ఆయనతో జట్టు కట్టేందుకు జాతీయ నేతలు ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ ఎవరి ఆలోచనలకు అందని అపర చాణక్యుడు. వ్యూహకర్తలతో అధికారంలోకి రావాలని ప్రణాళికలు వేస్తున్న పార్టీలకు తెలియదేమో.. కేసీఆర్ అందరినీ మించిన వ్యూహకర్త అని. ఆయన మౌనం, సహనం వెనుక పరమార్థం ఉంటుంది. రేపటి భవిష్యత్తు ఉంటుంది. గర్జించే ప్రజాగళాన్ని తట్టుకొని పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవాలంటే కాంగ్రెస్, బీజేపీ శక్తికి మించి పని చేయకతప్పదు.
– సంపత్ గడ్డం 78933 03516