తెలంగాణ వ్యవసాయ రూపురేఖల్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుంది. అనతి కాలంలోనే అధోగతిలో ఉన్న వ్యవసాయాన్ని పురోగతి వైపు తీసుకెళ్లిన ఘనత వారిదే. ఒక పరిపూర్ణ శాస్త్రవేత్త, ఉత్తమోత్తమ రైతు, అనుభవం ఉన్న ఆర్థిక వేత్త, నిరంతరం తపించే సామాజికవేత్త కలిసి రూపొందిస్తే పథకాలు ఎలా ఉంటాయో కేసీఆర్ రూపొందించిన పథకాలు అలా ఉంటాయి. అందుకే కేంద్రానికి, అనేక రాష్ర్టాలకు తెలంగాణ పథకాలు మార్గదర్శకాలవుతున్నాయి.
ఈ నేపథ్యంలోంచే అనేక రాష్ర్టాల్లో కేసీఆర్ పథకాలను అమలు చేయండి లేదా మా గ్రామాలను ఆ రాష్ట్రంలో కలపండి అంటూ ఒక రాష్ట్రం ప్రజల ముందుకు వచ్చారంటే రైతులకు కేసీఆర్ పథకాలు ఎంత ఉపయోగంగా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. నేడు తెలంగాణలో నేను రైతునని సగర్వంగా చెప్పుకొనే రోజులొచ్చాయి. కేవలం ఏడేండ్లలో బీడు భూములు సహా 97 వేల ఎకరాలు నూతనంగా సాగులోకొచ్చాయి. వరి పంట పండదన్న రాష్ర్టాన్ని దేశానికి అన్నపూర్ణగా మలిచారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కేసీఆర్కు ఇష్టం. లాభదాయక పంటల గురించి తెలుసుకుంటారు. సాగులో రైతు కు అడుగడుగునా వెన్నుదన్నుగా నిలిచేందుకు వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకాలు చేపట్టి వ్యవసాయానికి అన్నివేళలా అండగా నిలు స్తున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, అటవీ కళాశాల వంటివి వారి ముందు చూపుకు తార్కాణాలు. చరిత్ర సగర్వంగా రాసుకొనే తెలంగాణ వ్యవసాయ రూపశిల్పి కేసీఆర్.
రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతుల్లో ధైర్యాన్ని నింపాయి. గతంలో కొద్దిపాటి సాగునీటికి బోరు బావులే ఆధారమయ్యేవి. నాణ్యమైన విద్యుత్ అందుబాటులో లేకపోవటంతో బోర్లు ఫెయిలై పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయేవి. పత్తి, మిరప లాంటి పంటలు రైతులు సాగు చేస్తుంటే నకిలీ విత్తనాలు, చీడ-పీడల నిర్మూలన పురుగు మందులు, ఎరువుల అధిక ధరలతో రైతులు తల్లడిల్లేవారు. పంటల ఉత్పత్తి ఖర్చులు దేశంలోనే తెలంగాణలో ఎక్కువ. ఆంధ్రలో కాలువల ద్వారా సాగు నీరు పంటలకు గ్రావిటీ ద్వారా పారితే, తెలంగాణలో కరెంటుతో బోర్ల నుంచి తోడుకోవలసి వచ్చేది. దశాబ్దాల పాటు సీమాంధ్ర వలస పాలకులు చేసిన అన్యాయాన్ని కేసీఆర్ కేవలం ఏడేండ్లలో సవరించారు.
గత పాలకులు బిందు, తుంపర సేద్యం, హరితగృహ సాగు వంటి ఆధునిక సాగు పరిజ్ఞానం తెలంగాణ రైతులకు పరిచయం చేయలేదు. ఫలితంగా తెలంగాణలో పంటల సాగంటే కష్టం, నష్టం. ఆ వ్యవసాయ చీకటి (అగ్రికల్చర్ బ్లాక్ డేస్) రోజులను దూరం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి బంగారు రోజులను తీసుకొచ్చారు.
రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ధి చెందే క్రమంలో ప్రతి దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో సమగ్ర విధానాలకే మొగ్గు చూపుతారు కేసీఆర్. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఏ పథకంలోనూ నిధుల విషయంలో వెనుకకు తగ్గలేదు. చెప్పినదానికి, ప్రకటించిన దానికంటే రెండు రెట్లు అదనంగా ఇవ్వటమే ఆయన విధానం. ఒక్కో బడ్జెట్లో దాదాపు రూ.25 వేల కోట్ల పైనే కేటాయిస్తూ ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం లాంటి బాహుబలి ప్రాజెక్టులను అతిస్వల్ప కాలంలో పూర్తిచేశారు. పంటపొలాలకు నీరందించటంలో కేసీఆర్ చిత్తశుద్ధి శ్లాఘనీయం. పల్లె జీవన ప్రధాన వనరులైన చెరువుల అభివృద్ధికి కావలసిన నిధులను అందించటం ద్వారా ఊరూరా జలకళ కనిపిస్తున్నది. భూ గర్భ జలమట్టాలు పెరిగాయి. పాడి-పశువులు, పంటల సాగు ప్రధాన వనరులుగా పునర్జీవమయ్యాయి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయ ఆదాయ వృద్ధిరేటులో దేశంలో రెండవ స్థానం సాధించింది. పెద్ద రాష్ర్టాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణదే మొదటి ర్యాంకు. వ్యవసాయ రంగంలోని ప్రతి అంశంలో తీసుకున్న సమగ్ర ప్రణాళికలే దీనికి ప్రధాన కారణం. పలువురు ఆర్థికవేత్తలు కేరళ, గుజరాత్ అభివృద్ధి మోడల్స్కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఎదుగుతుందంటున్నారు. కేసీఆర్ ఆలోచనలకు, వ్యవసాయ రంగానికి దక్కిన గౌరవం ఇది.
తెలంగాణ రాక మునుపు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాస్త్రవేత్తగా రాష్ర్టానికి ఏమీ చేయలేకపోతున్నాననే అసంతృప్తి, బాధ నాకుండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చి, వ్యవసాయ, ఉద్యానరంగాల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలలో మా పరిశోధనలు సైతం రైతులకు ఉపయోగపడేలా ఉండటం జీవితానికి చాలా సంతృప్తినిస్తున్నది.
నేడు తెలంగాణ అంటే.. ఒక కోటి ఎకరాలకు పైగా మాగాణి. రెండు కోట్ల ఎకరాల పైచిలుకు సాగు భూమి. 3 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి. ఇది కదా అభివృద్ధి అని అనిపిస్తున్నది. ఇదంతా కేసీఆర్ రైతు అనుకూల సంక్షేమ అభివృద్ధి పథకాల కారణంగానే అని సగర్వంగా చెప్పుకోవచ్చు.
పట్టణాలకు వలసవెళ్లిన రైతులను తిరిగి పల్లెలకు రప్పించడంలో కేసీఆర్ రూపొందించిన రైతు సంక్షేమ పథకాలైన రైతు బంధు, రైతు బీమా, రైతు రుణ మాఫీ లాంటి పథకాలు ముఖ్య పాత్ర పోషించాయి. నేడు తెలంగాణ అంటే.. ఒక కోటి ఎకరాలకు పైగా మాగాణి. రెండు కోట్ల ఎకరాల పైచిలుకు సాగు భూమి. 3 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి. ఇది కదా అభివృద్ధి అని అనిపిస్తున్నది. ఇదంతా కేసీఆర్ రైతు అనుకూల సంక్షేమ అభివృద్ధి పథకాల కారణంగానే అని సగర్వంగా చెప్పుకోవచ్చు.
(వ్యాసకర్త: అసోసియేట్ ప్రొఫెసర్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం)
– డాక్టర్ పిడిగం సైదయ్య
77805 09322