తెలంగాణ పరాయి పాలన నుంచి బయటపడి స్వయంపాలనలోకి అడుగుపెట్టి పదేండ్లయింది. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పాలన పగ్గాలు చేపట్టింది. పదేండ్ల పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటి వనరులు పెరిగి ధాన్యం దిగుబడులు పెరిగాయి.
మరోవైపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ జరిగింది. అయినా ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు తిరిగి అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. పాలన అంతా బాగానే ఉన్నా ప్రజల్లో ఉన్న చిన్న చిన్న అసంతృప్తులు, అనుమానాలు, వారి అమాయకత్వమే దీనికి కారణమని తెలుస్తున్నది.
‘నీ చేతను నా చేతను/ వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
ధర చేత భార్గవు చేత/ నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్//
Telangana | ‘ఓ అర్జునా, కర్ణుడు ఆరుగురి వలన ఒరిగాడు. చివరికి చంపిన నువ్వు ఆరోవాడివి మాత్రమే! నా సంకల్పం, వరం పొందిన నీ తల్లి కుంతి వలన, కర్ణుని కవచ కుండలాలు దానం తీసుకున్న ఇంద్రుడి వలన, భూమాత, పరశురాముల శాపం వలన ఇది జరిగింది. కనుక కేవలం నీదే బాధ్యత అని దుఃఖ పడకు’ అని శ్రీకృష్ణుడు భారతంలో చెప్పాడు ప్రస్తుతం రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా అటువంటి ఆశ్చర్యకరమైనవే.
దీనివల్ల తెలిసేదేమంటే ఏదన్నా ఒక పెద్ద సంఘటన, ఎవరూ ఊహించనిది- జరిగినప్పుడు దానికి చాలా కారణాలుంటాయి. అది ఒక్కరి వల్ల జరిగేటంత చిన్నది కాదని గుర్తించుకోవాలి.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలు అటువంటి ఆశ్చర్యకరమైనవే! అయితే ఇప్పుడు విచారపడుతున్న వారు నిశ్శబ్దంగా బాధపడుతుంటే, ఈ ఎన్నికలతో, రాష్ట్రంతో సంబంధంలేని అయిరా గయిరా వాళ్లుకూడా బీఆర్ఎస్ ఓటమికి కుంగిపోయి మాట్లాడటం చూస్తుంటే తెలంగాణ సిద్ధాంతకర్త డాక్టర్ జయశంకర్ అన్న మాటలు గుర్తుకువస్తున్నాయి.
2009 డిసెంబర్ 9న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు భయపడి అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ మొదలవుతుందని ప్రకటన చేసింది. తెలంగాణ వాసులంతా పొంగిపోయారు, సంబురాలు చేసుకున్నారు. ఆ రోజు నుంచి 2009 డిసెంబర్ 23న కేంద్రం యూటర్న్ తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర రాజకీయ నాయకులు- ఇక్కడ పార్టీలన్నీ కలిసిపోయాయి. కుటిల రాజకీయ సంఘ నాయకుడు చంద్రబాబు నేతృత్వంలో తమ బెదిరింపు లేఖలతో కేంద్రాన్ని భయపెట్టి చేయించిన తిరోగమన ప్రకటన దాకా తెలంగాణ రాష్ట్రం గురించిన విషయాలు చాలా చర్చించుకున్నారు ఇక్కడి ప్రజలు.
ప్రతిరోజు డాక్టర్ జయశంకర్ సార్ను కలవటానికి యాభై నుంచి వంద మంది దాకా వచ్చేవారు. వారందరికి జయశంకర్ ఒక హెచ్చరిక చేసేవారు. ‘ఇల్లు అలుకగానే పండుగ కాదు. తెలంగాణ విషయంలో పండుగ అయ్యాక కూడా అప్రమత్తంగానే ఉండాలి. ఒకవేళ మన రాష్ట్రం మనకు వచ్చి మనం బాగుపడుతున్నా, గిట్టనివాళ్లు, ముఖ్యంగా చంద్రబాబు, ఆయన వర్గం మనకు అడ్డుపడుతారు. ఈ రాష్ర్టాన్ని అస్థిరపరచటానికి, ప్రగతికి భంగం కలిగించటానికి, మనకు పాలన చేతకాదని నిరూపించటానికి ఏ ఒక్క అవకాశమూ వదులుకోరు. ఆంధ్ర రాష్ర్టానికి వెళ్లిపోయిన వారే కాదు, హైదరాబాదులో ఆస్తులు కూడగట్టుకొని, వ్యాపారాలు చేసుకుంటూ బాగుపడ్డవారు కూడా తమ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటారు. స్థానిక ప్రభుత్వం ఏర్పడటం కాదు, కనీసం రెండు దశాబ్దాల కాలం తెలంగాణను ఈ నేలను ప్రేమించేవారు గట్టి పట్టుదలతో పాలించాలి. ఇప్పుడు తెలంగాణ మీద అక్కసు, అసూయ పెంచుకున్న ఈతరం వెళ్లిపోయాకే రాష్ట్రం స్థిరపడుతుంది. అంతేకాదు, స్థానిక నాయకులైనా, ఈ రెండు జాతీయ పార్టీలల్లో ఉన్న ఎస్ బాస్ గాళ్ల వల్ల ఈ ప్రాంతానికి మేలు జరుగదు. తెలివి, ధైర్యం ఉన్న కేసీఆర్ వంటి నాయకుడి ప్రాంతీయ పార్టీ మాత్రమే ఈ ప్రాంతానికి శ్రీరామ రక్ష’ అని వేర్వేరు సందర్భాల్లో ఆయన చెప్పేవారు.
రాష్ట్రం విడిపోయి సుమారు పదేండ్లయినా చంద్రబాబు అరెస్టు తర్వాత ఆ వర్గం వారు ఇక్కడ చేసిన గోల, అల్లరి ఈ మాటలు నిజమని నిరూపించాయి. అంతేకాదు, తెలంగాణకు బద్ధ శత్రువుగా వ్యవహరించిన చంద్రబాబు అరెస్టు ఖండించలేదని తాము బీఆర్ఎస్ను ఓడించి తీరుతామని శపథం చేశారు. ఎంత విచిత్రం! తాము బతికే నేలను ప్రేమించలేకపోవటం ఎంత దౌర్భాగ్యం! మరి ఇప్పుడు తెలంగాణవాసులు ఆ వర్గానికి చెందిన సినిమాలు, దవాఖానలు, హోటళ్లు, వ్యాపారసంస్థలు, రియల్ ఎస్టేట్ భవనాలు బహిష్కరిస్తామంటే ఎంత వికారంగా ఉంటుంది. మనుషులందరూ ఒకటేననీ, ప్రతివారు అందరి సంతోషం కోరుకోవాలనీ ఎప్పటికి అర్థం చేసుకుంటారు వాళ్లు? నిజంగా వారు మాతృభూమి మీద అంత ప్రేమ ఉన్నవాళ్లయితే తమ వ్యాపారాలు అక్కడే చేసుకొని ఆ నేలను సుభిక్షం చేయవచ్చు కదా! జయశంకర్ అన్నట్టు 1952లో మద్రాసు నుంచి విడిపోయినప్పుడూ, తెలంగాణ నుంచి విడిపోయినప్పుడూ ఎందుకు నిజంగా వారి స్వస్థలాలకు వెళ్లలేదు? ఇదేనా ప్రేమంటే?
ఇక తెలంగాణ వారు వారి రాష్ట్రం పట్ల ఎలా ఉన్నారో పరిశీలిద్దాం. పల్లెటూర్లలో సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి ఉన్నా, ఒక రకమైన అమాయకత్వం ఉంటుంది వారికి. ఏ వార్తయినా-నిజమైనా, పుకారైనా త్వరగా పాకుతుంది. అంతేకాదు, ఇన్నాళ్లు బాధలు పడ్డారు. తమకు రావలసినది త్వరగా అందాలనే ఆత్రం ఉంటుంది. నిజానికి కేసీఆర్ తన సంక్షేమ పథకాలు అందుకున్నవారు తమ ఓటర్లే అని నమ్మారు. 93 లక్షల తెల్లరేషన్ కార్డుల వారికి ఇచ్చిన సంక్షేమాలు, దేశంలో ఇంకే రాష్ట్రంలోనైనా ఉన్నాయా? 70 లక్షల మంది రైతులేమైపోయారు? వారంతా ఎంత అనాలోచితంగా ఉన్నారంటే ఒక రైతు అన్నాడు ‘నాకు లక్షా తొంభై వేల రుణంలో 1 లక్ష మొదట, 30 వేలు ఇప్పుడు మాఫీ అయింది. మరి మిగతాది చెయ్యలేదు కదా?’ అని. ఇంకొక క్యాబ్డ్రైవర్ నాతో వాదించాడు. ‘ఏం కాళేశ్వరం అమ్మా, మా తమ్ముడి ఊరిదాకా నీళ్లొచ్చాయి. వాడి పొలానికి రాలేదు’ అని. ఊరిదాకా వచ్చిన నీళ్ళు ఆయన పొలం దాకా రావా? నిజానికి ఇటువంటి చిన్న చిన్న అసంతృప్తులు, గ్యాపులు ఉన్నచోట కనీసం ఎన్నికలొచ్చే చివరి సంవత్సరమైనా అధికారులు, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలు నిరంతరం పర్యవేక్షించి, ఆ పల్లెవాసుల అనుమానాలు తీర్చి ఉంటే బీఆర్ఎస్కు అఖండ మెజారిటీ వచ్చి ఉండేది. ఇది అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఒక గుణపాఠం!
ఇక మూడో గ్రూపు నిరుద్యోగులు. నిజానికి వీరు చదివింది చదువే అయితే, రాష్ట్రంలోని మార్పులు అందరికంటే వీరే ఎక్కువ అర్థం చేసుకోవాలి. నిజమే, పేద, మధ్య తరగతి కుటుంబాల్లో జీవనాధారం ఉద్యోగమే! కానీ, దాదాపు అర్ధ శతాబ్దం పాటు కకావికలమైన ప్రాంతం పుంజుకోవాలంటే ఎంత సమయం కావాలి? సంఘంలో ముఖ్యమైనవి వరుసగా పెడ్తే కూడు, గుడ్డ, విద్య, వైద్యం, ముందు కావాలి. ఈ రంగాలను అభివృద్ధి చేస్తూనే మిగతా వాటిని కూడా వీలైనంత దారికి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఒక నిరుద్యోగి తల్లిదండ్రులకు ఆసరా పింఛన్, ఒంటరి అక్కకు పింఛన్, చెల్లికి కల్యాణలక్ష్మి వస్తే అది అతనికి లాభం కాదా? చదువుకున్నవారు ఆ మాత్రం ఆలోచించలేరా? అసంతృప్తులని రెచ్చగొట్టే మనుష్యులు ప్రతి సంఘంలోనూ ఉంటారు. కానీ, ఏది నిజం, ఏది అబద్ధం, ఎలా ఆలోచించాలన్న విచక్షణ ప్రతి విద్యావంతుడికీ ఉండాలి. వీరికి ఇంకొక మాట. ఇప్పుడు విశ్వవిద్యాలయంలో చదువుతున్నవారు, డిగ్రీ పేపర్ ముక్క తీసుకొని బయటపడి పదే పదే పోటీ పరీక్షలు రాయటం కాదు. డిగ్రీ, పీజీ చేస్తున్నపుడే మీ కాలేజీలలో కొన్ని సెంటర్లు పెట్టాలని డిమాండ్ చేయాలి. ఒకటి ఇంగ్లీషు భాషా నైపుణ్యాలు, ఉద్యోగానికి కావలసిన నైపుణ్యాలు (సాఫ్ట్ స్కిల్స్) నేర్పే సెంటరు, ఇంకొకటి మీ పాఠ్యాంశాలలో కష్టమైనవి మళ్లీ బోధించే సెంటర్, మూడవది వ్యక్తిగత సమస్యలను సమాధానపరచి, ఉత్సాహపరిచేందుకు సెంటరు. ప్రతి విద్యార్థి ధైర్యంగా, తెలివిగా ఆలోచించే, మాట్లాడగలిగే నైపుణ్యాలతో విద్యాలయాల నుంచి బైటకు రావాలి.
మన దేశంలో మార్కెట్ అవసరాలకు, ఉపాధి, ఉద్యోగాలకు ఏమి సంబంధముండదు కనుక, పాశ్చాత్య దేశాల వలె ఏ ఉద్యోగమైనా చేయటానికి సిద్ధపడాలి. ఏం చేస్తున్నామనే కాదు, ఎలా చేస్తున్నామన్నది ముఖ్యం. విఖ్యాతిగాంచిన విశ్వేశ్వరయ్య చాలా చక్కటి మాట చెప్పారు. ‘నేను మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చే ఉద్యోగినైతే, అందరి రోడ్ల కంటే నా రోడ్డు బాగుండాలని అనుకుంటాను’ అని. అంటే ఆ పని చేయమని కాదు, ఏ పనైనా గౌరవంతో బాగా చేయాలి అని! అదీకాక మిగతా ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఈ తొమ్మిదిన్నరేండ్లలో. ఇంకా ఏ రాష్ట్రంలో రానన్ని ప్రైవేటు ఉద్యోగాల కల్పన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నిరుద్యోగులు నిరాశపడకుండా దొరికిన సమయాన్ని తమ ఉద్యోగ నైపుణ్యాలు పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి.
ఇక తెలంగాణలో మాట్లాడుకోవలసినది మనమనుకుంటున్న మేధావుల గురించి! జయశంకర్ ఒక మాట అనేవారు. ‘మేధావులంతా ప్రొఫెసర్లు కారు, ప్రొఫెసర్లంతా మేధావులు కారు’ అని! మేధావి అన్న మాటకు ‘జ్ఞాని’ అనీ ‘పండితుడు’ అనీ అర్థం ఇస్త్తుంది నిఘంటువు. ఈ రెండు అర్థాలకీ మళ్లీ వివరణ ఈ రకంగా ఇస్తుంది. ‘ఏ విషయాన్నయినా ఉన్నదున్నట్టు, దానిలో మంచి, చెడు రెండింటినీ స్పష్టంగా చూడగలిగినవాడు, చెప్పగలిగినవాడు అని! మరి మన రాష్ట్రం వచ్చిన దగ్గర్నించీ మన మేధావులు- కొందరు ప్రొఫెసర్లు, మరికొందరు సీనియర్ పత్రికా ప్రతినిధులు- ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో జరిగిన మంచి ఒక్కటైనా వారి దృష్టినాకర్షించిందా? మంచిని మెచ్చుకోగలిగినవాడికే లోపాలను ఎత్తిచూపే హక్కు ఉంటుంది. రెండింటినీ సమదృష్టితో చూడగలిగిననాడే జ్ఞాని, మేధావి. మూడొంతుల రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయగలిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో 200 స్తంభాలలో 2 కొద్దిగా కుంగాయనేటప్పటికీ మన జ్ఞానులందరికీ పండుగ! కాళేశ్వరం కేసీఆర్దా, తెలంగాణదా? మనకు ఏ మాత్రం బుద్ధి ఉన్నా రావలసినది దిగులు కదా, సంతోషమా? ఇలా వందల ఉదాహరణలు వీరు గోరంతలు కొండంతలు చేసి ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు. సమాజంలోని మేధావులు ప్రభుత్వానికి సలహాదారులవ్వాలి కానీ, శత్రువులు కాకూడదు కదా! పక్క రాష్ట్రం వారు సంతోషించారంటే అర్థం ఉంది, వాళ్లు ఐదేండ్లలో ఒక శాసనసభా భవనం కూడా కట్టుకోలేక పోయారు కనుక. మనం మన రాష్ట్ర నష్టానికి సంతోషిస్తున్నామంటే ఏమనాలి? అయితే దీనికి కూడా మన శాస్ర్తాలలో ప్రస్తావన ఉంది.
15వ శతాబ్దంలో వాసుదేవ అను కేరళ శాస్త్రజ్ఞుడు యోగసార సంగ్రహ అనే ఆయుర్వేద గ్రంథంలో ‘అమేధ’ అనే వ్యాధి గురించి వివరిస్తాడు. ఈ రోగ లక్షణాలు ఏమిటంటే- విన్నది గుర్తు లేకపోవటం, చూసినది మర్చిపోవటం, ఒక ప్రయాణం ఎదురుగా కనిపిస్తున్నా, అది ఉందని ఒప్పుకోకపోవటం అనే ఇంకా కొన్ని విచిత్రమైనవి. అంటే అన్నీ నకారాత్మకంగా కనిపించటం. ఈ సందర్భంలో ఒక పాత సంఘటన జయశంకర్ చెప్పింది గుర్తు చేసుకోవాలి. ‘ఉమ్మడి రాష్ట్రంలోనే కరీంనగర్ అనుకుంటా, ఒకచోట నదిలోంచి ఒక కాలువ పారి దాదాపు అయిదు పల్లెలకు నీరందింది. ఆ మరుసటి సంవత్సరం ఆ ఊళ్లనుంచి వెళ్ళిపోయి నక్సలైట్లలో కలసిన యువత దాదాపు 90 శాతం మంది వెనక్కి వచ్చి వ్యవసాయం చేసుకోవటం మొదలుపెట్టారు. జయశంకర్ అప్పటి ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఈ విషయం మాతో చెప్పినప్పుడు ఆయన కళ్లు వర్షించాయి. ఇదీ మాతృభూమి మీద ప్రేమ! మరి ఇప్పుడున్న వారిని ఇంకా మేధావులందామా, అమేధావులందామా? నిర్ణయించండి.
మొత్తానికి ఎవరైతేనేం నిరక్షరాస్యుల దగ్గర్నించీ, కొద్దిగా చదువుకున్నవారూ, బాగా చదువుకొని చదువు చెప్పేవారూ అందరూ 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభా ఎన్నికల్లో వారి వారి భూమికలను అద్భుతంగా పోషించారు. కోరిన మార్పు తెచ్చుకున్నారు చూద్దాం! ప్రొఫెసర్ కోదండరాం 2 లక్షల ఉద్యోగాలిచ్చి మన యువత ఆశలను తీర్చుతారని ఆశిద్దాం. కొత్త ప్రభుత్వం తన మాటలు నిలబెట్టుకుంటుందని కూడా ఆశిద్దాం! ఎవరు చేశారని కాదు, తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని కదా మన కోరిక. తాపత్రయం. అలాగే జరుగాలని కోరుకుంటూ…
-కనకదుర్గ దంటు
89772 43484